Thathva Rahasyaprabha    Chapters   

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం

శ్లో|| శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే||

శ్లో|| భ##జే మహిని పీయైకం ముహురన్యం వయోధరం

మార్గంతం బాలమాలోక్య హసంతా వాది దంపతీ||

శ్లో|| శ్రీ రామ చరనద్వంద్వ మద్వయానంద సాధనం

సమామి యద్రజోయోగా త్సాషాణోపి సుఖం గతః||

శ్లో|| గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం

విధయే సర్వవిద్యానాం దక్షిణామూ ర్తయే నమః||

శ్లో|| యద్వక్త్ర మానససరః ప్రతిలబ్ధ జన్మ

భాషారవింద మకరంద రసంపిబంతి|

ప్రత్యాశ మున్ముఖవినీతవీనేయ భృంగాః

తాన్‌ భాష్యవి త్తక గురూన్‌ ప్రణమామి మూర్ధ్నా||

సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు సంసార సముద్రమందు నిమగ్నులై బహు దుఃఖ పరంపరలను, జన్మ మరణములను అనుభవించే జీవులను చూచి, అనేక దుర్మతములతో లోకమంతయు నిండియుండే సమయంలో ప్రజలందరు మోక్షమార్గమును మరచి, దుర్మతములనే సన్మతములనుగా గ్రహించి, శాస్త్ర విరుద్ధ మార్గములయందు ప్రవర్తించుచున్న ప్రజలదుస్థితిని కూడా చూచి, పరమాను గ్రహముకలవారై, దుర్మతములను ఖండించి, సన్మతములను స్థాపించి మోక్షమార్గమును చూపించి ప్రజలందరిని ఉద్ధరించుటకు, శంకరాచార్యరూపముతో భూలోకమం దవతరించిరి.

శంకరాచార్యులవారు జన్మతోనే వైరాగ్యమార్గమును లోకమునకు ప్రదర్శించుచు, జ్ఞాన సంప్రదాయమును కూడా చూపించుచు, యథావిధిగా పరమహంసాశ్రయమును స్వీకరించి, ఉపనిషత్తులకును, బ్రహ్మసూత్రములకును, భగవద్గీతలకును అతి మనోహరమైన గంభీరభాషతో, సువిపుల మైన భాష్యములను రచించిరి. ఈ మూడు భాష్యములనే ప్రస్థానత్రయమంటారు.

ఈ భాష్యములలో అనేక దుర్మతములను గంభీరమైన యుక్తులతోను, ప్రమాణ వచనములతోను ఖండించి, అతి సుందరమైన, గంభీరమైన శైలితో అద్వైతసిద్ధాంతమును ప్రతిపాదించిరి. ఇట్టి గంభీరమైన వేదాంతభాప్యములను చదివి గ్రహించుట, సూక్ష్మబుద్ధికలవారికి, ఇతర శాస్త్రమందు పాండిత్యము కలవారికే సాధ్యమగునుగాని అందరికిని సాధ్యముకాదు.

అయినను అట్టి శాస్త్రసారమును తెలుసుకొనుట అందరికిని అవసరమే. సంసారబంధమును పోగొట్టుకొనుట, ఆనందరూపమగు మోక్షమును పొందుట ఆస్తికులందరికిని అవసరమేగనుక మందాధికారులకుగూడా సకల వేదాంత సిద్ధాంతసారం తెలియుటకు కొన్ని వేదాంతస్తోత్రములను కూడా రచించిరి.

అంద లో దక్షిణామూ ర్తిస్తోత్రం చాలా ప్రధానమైనది. పూర్వకాలంలో దేవాసురులు మందరపర్వతముతో పాలసముద్రమును మధించి అమృతకలశమును సంపాదించినట్లు, శంకర భగవత్పాదులవారు వేదాంతములనే క్షిరసముద్రమును శాస్త్రన్యాయములనే మందరపర్వతంతో మధించగా అద్వైతామృతం బయలుదేరి బైటికివచ్చినది. అట్టి అద్వైతామృతమును ఈ దక్షిణామూ ర్తిస్తోత్ర మనే పాత్రయందు నింపిరాయన్నట్లున్నది.

ఇట్టి అద్వైతామృత కలశస్వరూపమైన ఈ దక్షిణామూ ర్తిస్తోత్రము చాలా మనోహరమైనది. ఈ అమృతకలశము నందరుచేపట్టి, అద్వైతామృతమును త్రాగి సంసారరోగమును పోగొట్టుకొని, పునరావృత్తి రహితమైన పరమానందరూపమగు మోక్షమును పొందుటకు బహు సులభసాధనం ఈ దక్షిణామూర్తి స్తోత్రం.

మరియు మోక్షము ఆనందరూపమని, ఆత్మరూపమని, శరీరముండగనే లభించునని, నిత్యమని, అందుచేతనే త్రివర్గ పురుషార్థములకంటె, అనగా ధర్మము, అర్థము, కామముఅనే మూడు పురుషార్థములకంటె, చాలా గొప్పది యని శాస్త్ర ప్రసిద్ధియు, లోక ప్రసిద్ధికూడా కలదు. అట్టి మోక్షమును పొందుటకు జ్ఞానమే సాధనంకాని, వేరు సాధనం లేదని శాస్త్రం చెప్పుచున్నది.

మోక్షస్వరూపమును, మోక్షసాధనములను, ఆయా మతకర్తలు' వారివారి మత గ్రంథములయందు అనేకవిధములుగా ప్రతిపాదించిరి. ఆ సాధనములు ఉత్తమ లోకప్రాప్తికి సాధనములైనను, స్వస్వరూపావస్థాన మగు పరమముక్తికి అద్వితీయాత్మసాక్షాత్కారమే సాధనంకాని మరి యొకటి కాదని అద్వైత సిద్ధాంతం. అన్ని దర్శనములకంటే, అన్ని మతములకంటేకూడా అతి ఆశ్చర్యకరమైన ఈ సిద్ధాంతమును అతిమధురంగా ఈస్తోత్రమందు ప్రతిపాదించిరి. గనుక అందరికిని ఆవశ్యకమని చెప్పుటలో అతిశయోక్తి లేదు.

ఈ స్తోత్రమునకు సంస్కృత వ్యాఖ్యానములు కలవు. ఆ వ్యాఖ్యానములను చూచి ఎటులవ్రాసిన లోకమున కుపయోగించునాయని పర్యాలోచనచేసి, సంస్కృతభాషయందు పరిచయం లేనివారికికూడా ఈ దక్షిణా మూర్తి స్తోత్రమందలి అద్వైతసిద్ధాంతరహస్యం అతి సులభముగాతెలియుటకు ఆంధ్రభాషలో ప్రతిపదార్థనిరూపణమును వ్రాయుచు, మతస్వరూపం బాగా తెలియుటకు మరికొన్ని అద్వైత సిద్ధంతావిషయములను చేర్చి యథాశక్తిగా తాత్పర్య వివరణమునుకూడా వ్రాయుచున్నాను.

శ్లో|| మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మ తత్వం యునానం|

వర్షిష్ఠాన్తే వసదృషి గణౖరావృతం బ్రహ్మనిష్ఠైః

ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం

స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ||||

ప్రతిపదార్థ నిరూపణము : బ్రహ్మనిష్ఠైః = బ్రహ్మవిచారపరులైన, వర్షిష్ఠాన్తే వసదృషి గణౖః=వర్షిష్ఠ, అధిక వయస్సుకల, అంతేవనదృషిగణౖః=శిష్యులగు ఋషిసముదాయములచేత, ఆవృత్తం=చుట్టుకొనబడిన, కరకలిత చిన్ముద్రం = హస్తముచేత రచింపబడిన జ్ఞాన ముద్ర కలిగినటువంటియు, ఆనందమూర్తిం=ఆనంద స్వరూపుడయినటు వంటి, స్వాత్మారామం=తన ఆత్మయందే రమించుచున్నటువంటియు. ముదితవదనం=సంతోషముతో కూడిన ముఖముగల, ఆచార్యేన్ధ్రం=గురువులలో శ్రేష్ఠుడైన, దక్షిణామూ ర్తిం=దక్షిణామూ ర్తి స్వామిని, ఈడే=స్తుతి చేయుచున్నాను.

తాత్పర్య వివరణము : ప్రపంచంలో జీవరాసులు జరాయుజములని, అండజములని, స్వేదజములని, ఉద్భిజ్జములని నాల్గురకములుగా నున్నవి. జరాయుజములనగా మాయ అను చర్మవిశేషముచేత ఆవరింపబడి పుట్టే మనుష్యులు, పశువులు మొదలగునవి. అండజములనగా గుడ్లలో నుండి పుట్టేకోళ్ళు, నెమళ్ళు మొదలగు జంతువులు, స్వేదజములనగా చమటలో నుండి పుట్టే నల్లులు, దోమలు మొదలగునవి, ఉద్భిజ్జములనగా భూమిని పెగలించుకొని పుట్టుచున్న గడ్డి, చెట్లు మొదలగునవి. ఇవి కూడా జీవరాసుల క్రింద పరిగణింపబడునవే.

అన్ని జనీవరాసులలో మనుష్యులు కర్మయోగమునకు, జ్ఞానయోగమునకు అర్హులుగనుక ఉత్తమ జీవులుగా పరిగణింపబడుచున్నారు. ఇట్టి మనుష్యులుకూడా శరీరేంద్రియములయందు ఆత్మ యనే భ్రమకలిగి, అనగా శరీరేంద్రియములకంటే అతీతమగు సచ్చిదానందరూపమయిన ఆత్మను, శరీరేంద్రియ రూపముగా గ్రహించుచు, కర్మబద్ధులై, జననమరణ ప్రవాహమందు ఎల్లపుడు ముణిగితేలుచు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికము లను మూడు రకములుగా నున్న దుఃఖములను అనుభవించుచు, ఈ దుఃఖములను పోగొట్టుకొని సుఖమును పొందే ఉపాయమును తెలియని దుర్దశ నొంది పరమ దీనులయియున్నారు.

ఇట్టి మనుష్యులను చూచి పరమాను గ్రహముకలిగిన పరమేశ్వరుడు ఈ దీనులను ఉద్ధరించుటకై దక్షిణామూర్తి రూపముగా నవతరించి, వట వృక్షముక్రింద కూర్చొని యుండెను. అంతట పరమ జిజ్ఞాసువులు అనగా పరమాత్మను తెలుసుకొను కోరిక కలవారు, దక్షిణామూర్తిస్వామి వారికంటే వయోవృద్ధులు, నిరంతరం బ్రహ్మవిద్యయం దాసక్తి కలవారును, దక్షిణామూ ర్తిస్వామివారివద్దకువచ్చి, వారికి సాష్టాంగ నమస్కారము చేసి తమతమ జిజ్ఞాసలను వెలిబుచ్చి, వారిచుట్టు అనగా వారికి అభిముఖులై కూర్చొనిరి.

అంతట సచ్చిదానందరూపుడగు జగజ్జన్మ స్థితి లయ కారణభూతుడగు సర్వేశ్వరుడగు దక్షినామూ ర్తిస్వామి వారు ఆ పురుషుల జిజ్ఞాసను, ఉద్దేశ్యమును గ్రహించి, ముముక్షువులకు పరమహితమగు పరమాత్మ తత్వమునుపదేశింప తలచిరి.

ఆ పరమాత్మ జాతిలేని దగుటచేతను, పేరులేని దగుటచేతను, గుణములేని దగుటచేతను, క్రియలేని దగుటచేతను, జాతి వాచకశబ్దముల చేతగాని, నామవాచక శబ్దములచేతగాని, గుణవాచక శబ్దములచేతగాని, క్రియావాచక శబ్దములచేతగాని, బోధించుటకు వీలులేకపోయినది.

శబ్దరాసులలో ఈ నాల్గురకముల శబ్దములకన్న వేరు బోధించే శబ్దములులేవు. గనుక వాక్యములతో పరమాత్మను బోధించుటకు వీలులేదు. ప్రత్యక్షముగా చూపించుటకు కూడా, రూపము మొదలగు గుణములు లేనిది గనుక వీలులేకపోయినది. లింగాదులు లేనిది గనుక. అనుమానాది ప్రమాణములచేత కూడా గ్రహించుటకు, గ్రహింపచేయుటకును శక్యముకాదు.

అందుచేత ఆ యవాఙ్మానస గోచరమగు పరమాత్మను మౌనము చేతనే ప్రబోధచేయవలయునని భావించి, జ్ఞానముద్రను చూపించుచు మౌనముగా నుండిరి. ఆ మౌనస్థితియే శిష్యులకు పరబ్రహ్మతత్వమును ప్రబోధించుట. ఆ మౌనస్థితియే శిష్యులందరు గుర్వనుగ్రహము వలన పరబ్రహ్మతత్వమును స్పష్టముగా తెలిసికొని సంశయమును పోగొట్టుకొనిరి.

జ్ఞానముద్రను చూపించుటచేత జీవబ్రహ్మలకు ఏకత్వమును గుర్తించిరి. ఈ యర్ధమునే :

శ్లో|| చిత్రం పట తరోర్మూలే వృద్ధాశ్శిష్యా గురుర్యువా

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః||

అను శ్లోకముకూడా చెప్పుచున్నది.

చాలా చిత్రమైన విషయం. మఱ్ఱిచెట్టుక్రింద కొంతమంది మహానుభావులు కూర్చున్నారు. అందరు మాట్లాడకుండా కూర్చున్నారు. అందులో గురుస్థానమందున్నవారు యువకులు, మంచి రూపవంతులు, బ్రహ్మవర్చస్సు తాండవించుచున్నది.

బొటనవ్రేలు, చూపుడువ్రేలు కలిపి (చిటుకలాగా) జ్ఞానముద్రను చూపించుచున్నారు. గాని, ఏమీ మెల్లగాకూడా ఉపదేశించుటలేదు. పూర్తిగా మౌనంగానే యున్నారు. శిష్యులంతా వయోవృద్ధులు, పరమానందంగా కూర్చున్నారు. వారేమి చెప్పుచున్నారో, వీరికేమి అర్థమైనదో చూచేవారికి తెలియుటలేదు. చాలా చిత్రంగా నున్నది. దక్షిణామూర్తి స్వామివారి చుట్టూ కూర్చున్న శిష్యులకు సంశయంలేనట్లు వారి ముఖవికాసనుబట్టి తెలుస్తూన్నది.

గురువు చిన్నవాడై యుండడం, శిష్యులు వయోవృద్ధులై యుండడం, ఒక చిత్రం. తత్రాపి గురువుగారు మౌనంగా నుండడం, శిష్యులు సంశయం లేనివారై ప్రశ్నచేయకుండా తృప్తిగా నుండడం అంతకంటే చిత్రం అని ఈ శ్లోకమునకు తాత్పర్యము.

శ్లో|| అంగుష్ఠ తర్జనీ యోగ ముద్రావ్యాజేన సేవినాం

శృత్యర్థం బ్రహ్మజనీవైక్యం దర్శయన్నోవతాచ్ఛివః||

ఈ శ్లోకముకూడా ఈ అర్థమునే బలపరచుచున్నది. ఇదియే గాక దక్షిణామూర్తి స్వామివారు శిష్యులకు అద్వైత సిద్ధాంతమునే బోధించినట్లు తెలియుచున్నది. బొటనవ్రేలు, చూపుడువ్రేలు కలిపి జ్ఞానముద్రను చూపుటచే జీవబ్రహ్మైక్యమును బోధించినట్లే.

''శృత్యర్థం బ్రహ్మజీవై క్యం దర్శయన్‌'' అనుటవల్ల సమస్తశృతులకు జీవబ్రహ్మైక్యమందే తాత్పర్యమనికూడా స్పష్టమగుచున్నది - ఆ తత్వం ఆవాఙ్మానసగోచరమడగుటచేతనే జ్ఞానముద్రతో బోధించిరని, అట్లు బోధచేసిన దక్షిణామూర్తి స్వామి ''నోవతాచ్ఛివః'' అనుటవల్ల ఈశ్వరావతారమనికూడ స్పష్టమగుచున్నది. అట్టి జీవబ్రహ్మైక్యమును బోధించిన దక్షిణామూర్తి స్వామికి నమస్కారమని ప్రతిశ్లోకమందు చెప్పిరిగనుక, ఈ దక్షిణామూర్త్యషకంచాలా జ్ఞానప్రదమని, సకల శృతులకు సారభూతమైన జీవ బ్రహ్మైక్యమును చక్కగా సులభముగా తెలియునటుల ప్రతిపాదించినదని స్పష్టమగుచున్నది.

జ్ఞానప్రదమగు దక్షిణామూ ర్తిస్మరణపూర్వకముగా నున్నది గనుక ఈ దక్షిణామూర్త్యష్టకమును శ్రద్ధగా వెనుకముందు శ్లోకములతో సహా పది శ్లోకములను చదివి అర్థము తెలుసుకొనుట ముఖ్యమని విశ్వసించవలసిన విషయం. ఈ స్తోత్రం జ్ఞానప్రదం గనుకనే శంకర భగత్పాదులవారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యం, గీతాభాష్యం, ఉపనిషద్భాష్యం అను ప్రస్థానత్రయమును గురువులవద్ద చదువునపుడు ముందు వెనుక ఈ శ్లోకములను చదువుచు గురువందనములు చేయవలయునని సంప్రదాయమును స్థాపించిరి.

ఆ గురువును దక్షిణామూర్తి స్వామివలె భావించి వందనములు చేసి, వారి యుపదేశమువలన తత్వమును గ్రహించి కృతకృత్యులు కావలయునని కూడా తాత్పర్యము. నాటినుండి నేటివరకు శంకరాచార్యుల వారు స్థిరపరచిన సంప్రదాయమును అ స్తికజనులు పాటించుచునే వేదాంత భాష్యములను చదువుచున్నారు.

ప్రతి శ్లోకంలో తసై#్మ శ్రీ గురుమూర్తియేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని యున్నది. ఈ శ్లోకములనుచదివి గురువందనములు చేయుచున్కనారంటే గురువుయందు. దక్షిణామూర్తి రూపమైన ఈశ్వరభావన ఉంచవలయుననే అర్ధం. విద్యార్థులయినవారు ఈ దక్షిణామూర్తి స్తోత్రంను ప్రతిరోజు స్నానంచేసి, శుచిగా స్వకర్మానుష్ఠానం చేసికొని, చదివినయెడల సర్వవిద్యాపారంగతు లగుదురనుటలో సందేహంలేదు.

తత్త్వమును తెలిసికొనతలచినవారుకూడా ఈ స్తోత్రం పారాయణం చేసి, అర్థమును తెలిసికొన్నయెడల తత్వ సాక్షాత్కారమునుపొంది ముక్తులగుదురనుటలో సందేహంలేదు. చాలా గంభీరార్థము కలదగుట చేతనే ఈ స్తోత్రముపై సురేశ్వరాచార్యులవారు విపులమైన వార్తికమును వ్రాసిరి.

వట వృక్షమూలమున శిష్యులు శ్రీ దక్షిణామూ ర్తిస్వామివారి దర్శన మాత్రంతో వారి యనుగ్రహమును పొంది, ఉపదేశం లేకపోయినను, జ్ఞానులై కృతాకృత్యు లయినట్లు దక్షిణామూ ర్తిస్తోత్రమును చదివి స్వామి యనుగ్రహమును పొందినవారుకూడా జ్ఞానులై కృతకృత్యులగుదురని చెప్పుటలోకూడా సందేహం లేదు. అందుచేతనే అన్నిటికంటే ముందు దక్షిణామూ ర్తిస్తోత్రమును చదివి, దీని యర్థమును పూర్తిగా తెలిసికొనుట చాలా ముఖ్యం.

మొదటి శ్లోక తాత్పర్య వివరణం పూర్తి అయినది.

అవతరణిక:

సాక్షాత్తు ఈశ్వరావతారమైన శంకరాచార్యులవారు లోకానుగ్రహదృష్టితో సకల వేదాంతసారభూతమగు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును రచించుచు. వేదాంతశాస్త్రమందు ప్రసిద్ధమగు జీవబ్రహ్మైకమనే విషయమును, మోక్షమనే ప్రయోజనమును, గ్రంథమునకు విషయమునకు కల ప్రతిపాద్య ప్రతిపాదక భావసంబంధమును, ముముక్షువనేఅధికారిని సూచించుచు, సకలప్రపంచమునకు అధిస్ఠానమగు పరమాత్మయే దక్షిణామూర్తి యని నమస్కరించుచు, వేదాంతశాస్త్రతత్వమును బోధించుచున్నారు.

శ్లో|| విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం|

పశ్యన్నాత్మని మాయయా బహివోద్భూతం యథానిద్రయా|

యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం |

తసై#్మ శ్రీగురుమూ ర్తియేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||

ప్రతిపదార్థ నిరూపణం :

దర్పణ దృశ్యమాన నగరీతుల్యం - దర్పణ=అద్దమందు; దృశ్య మాన=ప్రతిబింబించినదై చూడబడుచున్న; నగరీ=పట్టణముతో; తుల్యం=సమానమైనటువంటి, నిజాంతర్గతం=నిజతనసంబంధమైన, అంతః=మధ్యను; గతం=పొందిన అనగా సకల ప్రపంచమునకు అధిష్టానము సచ్చిదానందరూపమగు పరమాత్మయేగనుక అట్టి పరమాత్మయందే ఆరోపితమగు ప్రపంచ మున్నది యని అర్థము. అట్టి నిజాంతర్గతమగు విశ్వం భూతభౌతిక రూపమగు సకల ప్రపంచమును; యధా=ఏప్రకారముగా; నిద్రయా=నిద్రాదోషముచేత అనగా స్వప్నావస్థయందు; సాక్షిచైతన్యమందు కల్పితమైన=అనేక రకములగు ప్రపంచవిషయములను తన లోపల కల్పితమైనను, బైటయున్నట్లుగా చూచుచున్నాడో|

తథా=ఆ ప్రకారముగా, ఆత్మని=పరమాత్మయందు; మాయయా=సత్వరజస్తమోగుణాత్మకమైన ఆవరణ, విక్షేపశక్తులతోకూడిన=అజ్ఞానముచేత కల్పితమూనప్రపంచమును; బహిః=బైట; ఉద్భూతమివ=అవిర్బవించిన దానివలె (ఉన్నదానివలె); వశ్యన్‌=చూచుచున్నవాడై; యః=ఎవడు; ప్రబోధనమయే=గురువులచేత ఉపదేశింపబడిన మహావాక్యముల వలన కలిగిన అఖండ బ్రహ్మ సాక్షాత్కారకాలమందు; అద్వయం=రెండవది లేని, అద్వితీయమగు, అనగా బ్రహ్మ పాక్షాత్కారముచే, అజ్ఞానతత్కారములు నశించును గనుక అద్వితీయమగును. అట్టి అద్వితీయమైన స్వాత్మానమేవ=సచ్చిదానందరూపమగు; ప్రత్యగ్బ్రహ్మ స్వరూపమునే, సాక్షాత్కారుతే=సచ్చిదానందాత్మకమగు బ్రహ్మను నేనైతినని; అపరోక్షముగా తెలుసుకొనుచున్నాడో;

తసై#్మ=అటువంటి; శ్రీ గురుమూర్తయే శ్రీ గురుః=బ్రహ్మసాక్షాత్కారముకలిగి, బ్రహ్మరూపుడైన, దేశకాల వస్తు పరిచ్ఛేదరహితుడైన జ్ఞానమునుపదేశించుపురుషుడు, మూర్తయే=అట్టి స్వరూపుడైన శ్రీదక్షిణా మూర్తయే=దక్షిణదిక్కుకు అభిముకముగానున్న; అనగా దక్షిణదిక్కును చూచుచున్న శరీరముకల మహానుభావునకు; ఇదం=ఈ; నమః=నమస్కారము.

శ్రీ గురుమూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే అను పదములకు మరి యొక అర్థము-శ్రీఅనగా శ్రీమతీ; సచ్చిదానందరూపమైన; గుర్వీ=అతి గొప్పదైన: మూర్తిః=స్వరూపము; యస్యసః = శ్రీగురుమూర్తిః, శ్రీ గురుమూర్తియనగా సచ్చిదానందస్వరూపుడని యర్థము. శ్రీ దక్షిణామూర్తయే శ్రీ- అనగా అనాదియగు, అచింత్యమగు, మాయాశక్తియని అర్థము; అట్టి మాయాశక్తిచేత; దక్షిణ=సృష్టి స్థితి లయముల యందు నిపుణుడు అని యర్థము. శ్రీ దక్షిణామూర్తయే అన్నపుడు అకారప్రశ్లేషచేత; అమూర్తయే అని అర్థము వచ్చును. అమూర్తి యనగా మూర్తిలేని వాడు, నిర్వికారుడని యర్థము||

ఇంత వరకు ప్రతిపదార్థ నిరూపణం పూర్తియైనది.

ఇక తాత్పర్య వివరణం

ఈ దక్షిణామూర్త్యష్టకములో చాలా లోతైన అర్థములున్నవి. అన్నింటి కంటేకూడా ఈ శ్లోకమునందు చాలా గూఢమైన అర్థమున్నది. అద్వైత సిద్ధాంతమును సాధ్యమైనంత కొద్దిలో ప్రతిపాదిస్తూ, శ్లోక తాత్పర్యమును విశదపరచుచున్నాను. అద్వైత వేదాంతశాస్త్రమందు బ్రహ్మను తెలిసికొన్న వ్యక్తి బ్రహ్మయగునని; ఆత్మ సాక్షాత్కారమును పొందినయెడల జనన మరణ ప్రవాహముతోకూడిన ప్రపంచమంతయు అజ్ఞానముతో సహ నివర్తించుననియు, ఉపనిషత్తులు బోధించు చున్నవి. స్థూల సూక్ష్మకారణరూపమగు ప్రపంచమంతయు బ్రహ్మయేయని కొన్నిచోట్ల, సర్వం ఆత్మయే యని కొన్నిచోట్ల, శృతిస్మృతులు బోధించుచున్నవి. బ్రహ్మయన్నను ఆత్మయున్నను ఒకటియే గనుక అదిష్ఠానమగు పరమాత్మ కంటె వేరైనది యేమియు లేదని యర్థము. ఈ అర్థమంతయు గూడా, ఈ శ్లోకమందు ''యస్సాక్షాత్కురుతే ప్రబోధనమయే స్వాత్మానమేవాద్వయం'' అను శ్లోకభాగమును బట్టి స్పష్టమగుచున్నది.

అజ్ఞానదశయందు ఆత్మయే అజ్ఞానముచేత ఆవరింపబడి, జీవుల వలె, సృష్టికర్తయగు ఈశ్వరునివలె, ప్రపంచమువలె భాసించు చున్నదని అదిష్టానమగు, అద్వితీయమగు ఆత్మసాక్షాత్కారము కలిగినయెడల ఆత్మను ఆవరించిన అజ్ఞానముతోక సహ, అజ్ఞానము వల్ల ఏర్పడిన జీవత్వ ఈశ్వరత్వ జటద్విషక భ్రమ నిశ్శేషముగా నశించి, అద్వితీయమగు సచ్చిదానంద రూపమగు ఆత్మయే మిగులునని, అట్టి స్థితియే మోక్షమని కూడా విశదమగుచున్నది.

ఈ సిద్ధాన్తము స్పష్టముగా అర్థము కావలయునంటే కొన్ని భ్రమ దృష్టాంతములను బాగుగా విమర్శించవలయును. శుక్తి అదిష్టానముగాగల రజత భ్రమ-అనగా శుక్తియనగా ముత్యపుచిప్ప. దానియందు వెండియని కలిగిన భ్రమ, శుక్తిసాక్షాత్కారముచేతనే, అనగా ఇది ముత్యపుచిప్పయే కాని వెండికాదు. అనే ప్రత్యక్షజ్ఞానముచేతనే ఆ రజతభ్రాంతి నశించును.

ఒకప్పుడు కొద్దిచీకటిలో తాడును చూచి సర్పమని భ్రమపడుట, భయపడుట, పరిగెత్తుటకూడ అనుభవసిద్ధమైన విషయమే.(రజ్జవుఅనగా తాడు) అట్టి రజ్జువు అదిష్ఠానముగాగల సర్పభ్రమ, అదిష్ఠానమగు రజ్జుసాక్షాత్కారముచేతనే అనగా ఇది తాడుగాని, సర్పముకాదు అను ప్రత్యక్షజ్ఞానముచేతనే నశించుచున్నట్లు కూడా అనుభవంలో నున్న విషయమే. అధిష్ఠానమనగా భ్రమకు కారణమగు అజ్ఞానముచేత ఆవరించబడు యదార్థవస్తువే. అనగా దేనియందు భ్రమకలుగునో ఆ నిజమైన వస్తువే అధిష్ఠానమని యర్థము.

అటులనే ఆత్మ అదిష్ఠానముగా గల జీవత్వ, ఈశ్వరత్వ, జగద్విషయక భ్రమ కూడా అదిష్ఠానమగు ఆత్మ సాక్షాత్కారముచేతనే నశించును. ఆత్మసాక్షాత్కారము సకల సంసారబంధమునకు కారణమగు మూలా జ్ఞానమును నశింపచేయునది గనుకనే, ఆత్మసాక్షాత్కారముకొరకు శ్రవణము, మననము, నిదిధ్యాసము చేయవలయునని శాస్త్రము చెప్పుచున్నది. వీటి వివరణం ముందు చేయబడును.

అద్వైత సిద్ధాన్త రహస్యమును తెలిసికొనవలెనంటే, అధ్యాస (అనగా భ్రమ) యొక్క స్వరూపస్వభావములను ముఖ్యముగా విసుకు చెందక మాటిమాటవకి విమర్శించి గ్రహించవలయును. మొట్టమొదట తిరిగి శుర్తజత భ్రమను విమర్శింతము. రజభ్రమ కలిగేముందు యథార్థమగు శుక్తిని, సత్వరజస్తమోగుణాత్మకమగు ఆవరణ విక్షేపశక్తులు గల ఆజ్ఞానము ఆవరించి, జీవుని ఆశ్రయించియుండును. ఆవరణశక్తి యనగా అసలువస్తువును తెలియకుండా చేసే శక్తియే, విక్షేపశక్తి యనగా అసలు వస్తువును మరియెకవస్తువుగా కనుపింపచేసే శక్తియే. ఈరెండు శక్తులతో కూడిన ఆ యజ్ఞానము రజత సంస్కార రహితమై చకచక మెరిసి నట్లు కనబడగానే తాత్కాలికముగా రజతరూపముగాను, రజత జ్ఞానరూపముగాను పరిణమించును.

అక్కడ ఆరోపితమగు రజితము. శుక్తిని ఆవరించిన అజ్ఞానము యొక్క పరిణామమని, అజ్ఞానముచేత ఆవరింపబడిన శుక్తిని వివర్తమని అంటారు. అనగా రజతమునకు శుక్తిని ఆవరించిన అజ్ఞానము పరిణామ్యుపాదానము పరిణామ్యుపాదామనియు, ఆ రజతమునకు శుక్తి వివర్తోపాదాన మనియు అందురు. కార్యరూపముగా మార్పునుచెందేది పరిణామ్యుపాదానము, మారకుండా మరియొక వస్తురూపముగా కనిపించేది వివర్తోపాదానమని యర్థము. అజ్ఞానం రజతంగా మారినది గనుగనే పరిణామ్యుపాదమని, శుక్తిమారకుండా వెండివలె కనిపించినది గనుకనే వివర్తోపాదానమని శాస్త్రకర్తలు నిరూపణ చేసిరి.

అద్వైత సిద్ధాంతమందు వివర్తవాదమే ప్రధానము. ఇట్టి వివర్తవాదమును సమర్థించుటకై ప్రపంచమంతయు అవిద్యా పరిణామమని పరిణామవాదము నంగీకరించిరి. అజ్ఞానము పరిణమించిన దనగా భ్రాంతియనే అర్థము. భ్రాంతి యనగా ఒక వస్తువు మరియొకవిధముగా కనిపించుటయే. అట్టి శుక్తి రజితభ్రాంతికి అదిష్ఠానమగు శక్తిని , ఆవరించిన అజ్ఞానము శుక్తి సాక్షాత్కారముచేతనే, దేపం వెలిగిస్తే చీకటిపోయినట్లు పోవును. ఆ యజ్ఞానం పోగానే దానివలన ఏర్పడిన రజతభ్రమకూడా నిశ్శేషముగా నివర్తించును. ఇది శుక్తి రజితభ్రాంతి వివరణము.

అటులనే సచ్చిదానంద రూపమగు నిత్య శుద్దబుద్ధ ముక్త స్వభావమగు, అనగా నాశనములేని సకలదోషరహిమైన జ్ఞానస్వరూపమైన మోక్షరూపమగు ఆత్మనే అనాదియైన, అనిర్వాచ్యమైన, సత్వరజన్తమోగుణాత్మక మైన ఆవరణ విక్షేపశక్తి యుక్తమైన అజ్ఞానము ఆవరించి, అనాదియగు ప్రపంచ సంస్కారసహితమై ఆ యజ్ఞానముచేత ఆవరింపబడిన ఆత్మనే జీవేశ్వర జగద్రూపముగా భాసింపజేసినది. ఇట్టి అజ్ఞానమే జీవునియొక్క సంసారబంధమునకు మూలకారణమై ఉన్నది.

ఈ యజ్ఞానము అదిష్ఠానమగు పరమాత్మ సాక్షాత్కారముచేతనే నశించును. అజ్ఞానం నశించినయడల ఆ యజ్ఞానంవల్ల ఏర్పడిన భ్రమ విశ్శేషముగా నశించును. గనుక ప్రపంచమంతయు బ్రహ్మను ఆవరించిన మూలాజ్ఞానముయొక్క పరిణామని, అట్టి అజ్ఞానముచేత ఆవరింపబడిన పరమాత్మయొక్క వివర్తయని, అనగా ప్రపంచమును గురించి అజ్ఞానముపరిణామ్యుపాదామని, పరమాత్మ వివర్తోపాదాయని, ముఖ్యముగా గమనించవలసిన విషయం.ఇట్టి అద్వైత సిద్ధాంతవిషయములను అందరికి సులభముగా తెలయునటుల ఈ శ్లోకమందు శంకర భగవత్పాదులవారు దయతో బహు లలితముగా చెప్పిరి.

''విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుఉల్యం''అంటే ప్రపంచమంతయు అద్దంలో కనిపించే పట్టణమువలె కనిపించుటయే గాని, సత్యమైనది కాదని యర్థము. పెద్ద నిలువుటద్దమును ఉన్నతప్రదేశమందు పెట్టినయడల ఆ యద్ధమునకు యెదురుగానున్న పట్టణము, మార్గములు, మార్గమునందు తిరుగుచున్న ప్రజలు, బండ్లు వగైరాలన్నియు ప్రతిబింబించి కనిపించుచుండెను. దీనినే ప్రతిబింబభ్రమ యందురు. అద్దములో కనిపించిన వస్తువులలో ఒక వస్తువునైను చేతితో విడతీసి చూచుటకు వీలులేదు. కనిపించుట మాత్రం తప్పదు.

వేరే సత్యమైన బింబమున్నను, అద్దములో కనిపించువస్తువులు సత్యస్వరూపము లేనివై భ్రమమాత్రముగానే యున్నవి. ఈ భ్రమసూక్ష్మదృష్టితోను, శాస్త్రీయదృష్టితోను విచారించిన యడల చాలా ఆశ్చర్యకర ముగా నుండును.

అటులనే స్వచ్చమైన స్వప్రకాశ##మైన సచ్చిదానందరూపమైన ఆత్మయందు ప్రపంచమంతయు కనిపించుచున్నదని గ్రహించవలెను. అద్దమందు కనిపించు నగరప్రతిబింబము అద్దమందే యందును గాని ప్రతిబింబమునకు ఆధారమైన అద్దముకంటే ఇతరత్ర ఉండదు. అటులనే అజ్ఞానముచేత కల్పింపబడిన దృశ్యప్రపంచమంతయు అధిష్టానమగు ఆత్మయందే ఉండునుగాని ఇతరత్ర ఉండదు. ఈ విషయమే నిజాంతర్గత అనే పదము వల్ల స్పష్టమగుచున్నది.

ఈ విషయంలో ఒకప్రశ్న. అద్వైతులు శుక్తియందు రజతభ్రమ కలిగినట్లు, తాడుయందు సర్పభ్రమ కలిగినట్లు, పరమాత్మయందు జీవత్వ ఈశ్వరత్వ జగద్వషయక భ్రమ కలుగుచున్నది. అంతా భ్రమ కనకనే మిధ్యయనిచెప్పుదురు. మిధ్యయనగా అదిష్ఠానమును (అసలువస్తువును తెలుసుకుంటే నశించుపోవునది)శుక్తిని తెలుసుకుంటే రజతభ్రమ నశించును గనుక రజితం మిధ్యా తాడును తెలుసుకుంటే సర్పభ్రమ నశించును గనుక సర్పము, సర్పజ్ఞానముమిధ్య. మెళుకవచ్చి తన స్వరూపమును గుర్తించినపుడు స్వప్నమంతయు లయించిపోవును గనుక స్వప్నము మిధ్య. అటులనే యదార్థమగు ఆత్మసాక్షాత్కారము కలిగినపుడు భ్రమరూప ప్రపంచమంతయు నిశ్శేషముగా నశించునుగనుక ప్రపంచమంతయు మిధ్యాభూతమని కూడా చెప్పెదురు.

అజ్ఞానముకూడా అదిష్ఠానసాక్షాత్కారముచేత నశించును గనుక మిధ్యే అయితే శుక్తిచయందు రజతభ్రమ కలిగినపుడు గాని, రజ్జావు యందు సర్పభ్రమ కలిగినపడుగాని, అదిష్టానమగు శుక్తికంటే, రజ్జువు కంటే వేరుగా ఒక జీవుడుఉండిశుక్తిని రజ్జువును యథార్ధముగా తెలుసుకొనక భ్రాంతిని పొందుచున్నాడు. అసలు వస్తువులను చూ చి భ్రాంతిని పోగొట్టుకొనుచున్నాడు గనుక, ఈ దృష్టాంతములలో చెప్పినవిషయములు అనుభవమునకు సరిపోవుచున్నవిగాని ఆత్మయందు జీవత్వ, ఈశ్వరాత్మ, జగద్విషయక భ్రమకలుగునపుడు భ్రాంతిని పొందువా డెవరు. పరమాత్మ అదిష్ఠానమే కదా. జీవత్వము కూడా కల్పితము గనుక జీవుడు పరమాత్మ కంటే వేరులేడు కదా! భ్రాంతిని పొందేవాడే లేకపోయినపుడు భ్రమకలుగునని చెప్పుట యుక్తమని గట్టిగా ప్రశ్నించవలసిన విషయమే.

ఈ ప్రశ్నకు సమాధాన మిట్లు చెప్పవలయును. భ్రమ రెండువిదములు. అనాత్మధిష్టానక భ్రమయని ఆత్మాదిష్ఠానకభ్రమయని, అనాత్మాదిష్ఠాన భ్రమయనియు, అత్మాదిష్టానకభ్రమయని ఆనాత్మాధిష్ఠానక భ్రమయనగా ఆత్మ భిన్నమగు శుక్తియందు రజతమను భ్రమ. ఆత్మకంటే భిన్నమగుతాడుయందు పర్పమనుభ్రమ మొదలగు నవి.ఈ భ్రమయందు అదిష్ఠానముకంటే భ్రాంతిని పొందువాడు వేరుగా నున్నమాట సత్యమే. కాని అత్యాధిష్ఠానకభ్రమను విచారించిన యడల ఈ ప్రశ్నకు సమాధానం వచ్చును.

అత్మాధిష్ఠానకభ్రమయనగా ఆత్మయే యధిష్ఠానముగాగల భ్రమ యని అర్థము. స్వప్నభ్రమ ఆత్మాధిష్ఠానక భ్రమయే. దీనిని కొంత విమర్శించవలయును. ఒక గ్రామమందు ఒకవ్యక్తి తన యింట్లో తన మంచంమీద పడుకొని నిద్రపోయెనని యనుకుందము. ఆ నిద్రపోయిన వ్యక్తికే కాశీకిపోయినటుల, గంగాస్నానం మొదలగు యాత్రచేసినటుల, అక్కడ పరిచితులగువారిని చూచినటుల స్వప్నమువచ్చినది.

ఈ స్వప్నము నిద్రపోయినవాని శరీరములోని ఆత్మయందే కలుగు చున్నది గనుక ఆత్మయే అధిష్ఠానమని చెప్పక తప్పదు. ఆత్మ నిద్రతో ఆవరింపబడి తెలియనిస్థితిలో నున్నాడుకనుక! ఈ స్వప్నమును చూచువాడెవడు? ఈ నిద్రపోయిన వ్యక్తియే కాశీకి వెళ్ళి యాత్రచేసికొని పరిచితులతో మాటలాడిననాడని చెప్పుటకు వీలులేదు. పరిచితులు ఈయన కాశీకి వచ్చినాడని, మాతో కలసి మాటలాడినాడని చెప్పువారు లేరుకదా! అందువలన ఈ వ్యవహారదశయందున్న నిజమైన కాశీపట్నమునకు వెళ్ళుటగాని, పరిచితులను చూచుటగాని జరుగలేదనియే చెప్పవలయును.

ఏమన తాత్కాలికముగా నిద్రపోయినవాని ఆత్మయందు నిద్రా దోషముచేత కల్పింపడిన విలక్షణమగు ప్రపంచము జాగ్రదవస్థయందు మనము చూచు ప్రపంచమంకంటే వేరుగా నున్నదని చెప్పక తప్పదు.స్వప్నమందు వెళ్ళిన కాశీపట్టణం ప్రాతిభాసిక కాశీ పట్టణమే! స్వప్నమందు చేసిన కాశీయాత్ర ప్రాతిభాసిక కాశీయాత్రయే. స్వప్నమందు చూడబడిన పరిచిత బంధుమిత్రాదులును ప్రాతిభాసికులే.

ఇవి జాగ్రదవస్థయందు కనిపించేవికావు. మరియు మహారాజుకు నిరుపేదయై బిక్షాటన చేయుచున్నట్లు స్వప్నము వచ్చును. భిక్షమెత్తుకొను నిరుపేదకు చక్రవర్తి సార్వభౌముడై సమస్త రాజ్యసుఖములను అనుభవించుచున్నట్లు స్వప్నము వచ్చును. ముసలివానికి పడుచువాడనని స్వప్నము వచ్చును. స్త్రీకి పురుషుడనైతినని స్వప్నము వచ్చును. పురుషునకు స్త్రీనైతినని స్వప్నము వచ్చును. కుంటివాడై, రోగియై కదలలేని స్థితిలో నున్నవానికి ఆరోగ్యవంతుడై పరుగెత్తుచున్నట్లు స్వప్నము వచ్చును.

రాత్రియందు నిద్రపోయినవానికి పగలు ఎండలో తిరుగుచున్నట్లు, అరణ్యమందున్న వానికి నగరమందున్నటులను, నగరమందున్నవానికి అరణ్యమందున్నవటులను, విపరీతముగా స్వప్నములు వచ్చుచుండెను. కనుక ఈ స్వప్నప్రపంచము జాగ్రత్త్పంపచ సంస్కారముతో ఏర్పడుటచే గ్రహించవలెను. స్వప్నప్రపంచ మంతయు ప్రాతిభాసికము. ప్రాతి బాసిక మనగా అగంతుకదోషజన్య భ్రమ.

ఇచట ఆగంతుక దోషము నిద్రాదోషము. ఈ నిద్రాదోషము ప్రతి రోజు వచ్చుట మెళుక వచ్చినపుడు పోవుట. ఆనుభవములోనున్నది.గనుక దీనిని అగంతుక దోషమని శాస్త్రుజ్ఞాలు చెప్పెదరు. ఇట్టి అగంతుకమిత్రాదోషమువలన, స్వప్నభ్రమ కలుగుచున్నది. గనుక ప్రాతిభాసిక భ్రమయని చెప్పబడుచున్నది. ప్రాతిభాసికభ్రమ బ్రహ్మజ్ఞానముకంటే ఇతరముచేత బాదింపబుడును. అనగా బ్రహ్మజ్ఞానముకంటే ఇతర విషయమగు ప్రబోధచేత (మెళుకువచేత) స్వప్నభ్రమ నివర్తించుచుండును. గనుక కూడా స్వప్నభ్రమ ప్రాతిభాసిక భ్రమ యనబడుచున్నది.

శుక్తిరజిత భ్రమ రజ్జుసర్పభ్రమ మొదలగు భ్రమలు కూడా ప్రాతిభాసిక భ్రమలే. ఈ భ్రమలుకూడా అగంతుకమగు, నేత్రగతమున భ్రమను కలుగజేయు కాచాదిదోషములచేతలనేఏర్పడినవి. బ్రహ్మజ్ఞానము కంటే ఇతరమగు శుక్తిసాక్షాత్కారముచేతను, రజ్జాసాక్షాత్కారముచేతను నశించుచున్నవి. గనుక ప్రాతిభాసిక భ్రమలని చెప్పబడుచున్నవి.ప్రాతిభాసికమగు ప్రతిభాసకాలమందు మాత్రమే ఉండుననియు అర్థము. ప్రతిభాస అనగా భ్రమను పొందువ్యక్తియెక్క దృష్ఠియే, ఆ దృష్ఠికాల మందే ఆ దృశ్యములు ఏర్పడుచున్నవి. ఆ దృష్టి పోయినపుడు ఆ దృశ్యములు పోవుచున్నవి. ఇది ప్రాతిభాసిక భ్రమ స్వభావము.

వ్యావహారిక భ్రమ యనగా అనాది దోషజన్యభ్రమ, జాగ్రదవస్థయందు మనకు గోచరించు భూతభౌతిక ప్రపంచ దృశ్యమంతయు వ్యావహారిక భ్రమకు చెందినదే. ఈ వ్యావహారిక భ్రమ అనాదియగు అజ్ఞానదోషముచే కలుగుచున్నది. గనుక అనాది నున్నటులను, స్వప్నముకంటే నిత్యముగా నున్నటులను గోచరించుచున్నవి. కాని ఇంత కంటేవిశేషములేదు.

ఇదియేగాకర బ్రహ్మసాక్షాత్కారముచేతనే ఈ జాగ్రత్ర్పపంచభ్రమ నశించును. కాని ఇతర జ్ఞానముచే నశించదు. కారణమేమనగా వ్యావహారికమగు ఈ ప్రపంచమభ్రమమకు కారణమగు, అనాదియగు ఆత్మావరక అజ్ఞానదోషము, బ్రహ్మసాక్షాత్కారముచేతనే నశించును. గనుకప్రపంచభ్రమకూడా బ్రహ్మసాక్షాత్కారముచేతనే నివర్తించును. గనుక వ్యావహరికముగ జాగ్రత్ప్రపంచ భ్రమకంటే విలక్షణముగా నుండును.

వ్యావహారిక మనగా వ్యావహారకాలమందు గోచరించున్నది. వ్యవహారకాలముగా ఆజ్ఞానకాలమే. అనగా అదిష్టానమగు పరమాత్మను అవరోక్షముగా తెలుసుకొనవని(అజ్ఞానదశయందు) సమయముందు ఇట్టి ప్రపంచభ్రమ కలుగుచును యుండునని తాత్పర్యము.

ప్రాతిభాసిక మగు స్వప్నభ్రమకు కారణమగు నిద్రాదోషము ప్రబోధ చేతనే బాధింపడును. గనుక స్వప్నభ్రమకూడా ప్రబోధచేతనే నశించును. ఇట్టితేడా ఈ భ్రమలలో గ్రహించవలసి యున్నది. మరోక విషయము;జాగ్రదవస్థయందు స్వప్నవస్థ గోచరించదు. స్వప్నవస్థయందు జాగ్రదవస్థ గోచరించదుర. సుషుప్త్యస్థయందు జాగ్రదవస్థ, స్వప్నావస్థలుకూడా గోచరించవు. జాగ్రత్స్వప్నావస్థలయదు సుషుప్తవ్యస్థ గోచరించదు కానిఈ యవస్థలను తెలుసుకునే ఆత్మ మూడు అవస్థలయందు ను అనుగతమై మార్పును పొందకుండా అనుభవములో గోచరించుచుండును.

ఈ యనుభవమునుబట్టి అవస్థాత్రయములో ఆత్మ ఏదో అనత్మ ఏదో తెలుసుకొనుట కవకాశమున్నది.స్వప్న జాగ్రదవస్థలను మరియొక విధముగా కూడా విమర్శించవలసి ఉన్నది. జాగ్రదవస్థయందలి జీవుడు నిద్రించుకాలమందు నిద్రతో నావరింపబడి జాగ్రదవస్థకు చెందిన తన స్వరూపమును మరచిపోవును. స్వప్నము వచ్చినపడు స్వప్నదృశ్యముతో పాటు తాను ఆ ప్రపంచమును అనుభవించువానివలె బయలుదేరి జాగ్రద్దశయందు పనిచేసిన నేత్రములు మొదలైన ఇంద్రియములు శరీరం పని చేయకపోయినను, స్వప్నావస్థయందు నేత్రములతో చూచుచున్నాడు. చెవులతో వినుచున్నాడు. కాళ్ళతో నడుచుచున్నాడు, వాక్కుతో మాట్లాడు చున్నాడు. ఈ విధముగా అన్ని వ్యవహారములు చేయుచుట్లు కనిపంచుచున్నది.

మెళుకువ వచ్చినతరువాత ఈ స్వప్నదృశ్యముతో సహా స్వప్నదృశ్యములను చూచిన ఇంద్రియములు, శరీరము అదృశ్యమై తిరిగి జాగ్రదవస్థయందలి స్వరూపముతోనే మిగిలియున్నాడు. ఇంతకు, జాగ్రద్దశను మరచి నిద్రపోయినను స్వప్నావస్థయందు స్వప్నకల్పనతో పాటు స్వప్నమును చూచేవాడు కూడా అపుడు కల్పితమైన శరీరేంద్రియములతో తయారై స్వప్నము ననుభవించి మెళుకువ వచ్చినతరువాత నిద్రతోపాటు స్వప్నదృశ్యముతోపాటు స్వప్నశరీరమును వదలి వ్యావహారిక స్వరూపుడగుచున్నాడు. స్వప్నంలో ద్రష్టకూడా తయారగుచున్నాడు గనుక స్వప్నమును చుచేవాడెవడని ప్రశ్నించ నవసరం లేదు. అందరికిని అనుభవంలో నున్న విషయంలో సందేహమెందుకు.

అటులనే అనాది అనిర్వచనీయమగు అజ్ఞానుమనే నిద్రలో ఆత్మనిద్రపోయి, అనగా అజ్ఞానముచేత ఆత్మ ఆవరింపబడి పారమార్ధికమగు తన స్వరూపమును తెలిసికొనలేక స్వప్నద్రష్టవలె జీవుడుగా బయలుదేరి కల్పితమగు దేహేంద్రియములతో అజ్ఞాన కల్పితములగు అనేక విధములైన ప్రపంచమున అనుభవించుచున్నాడు.

నిద్రయనగా ఆత్మను ఆవరించిన మూలాజ్ఞానముయొక్క పరిణామమే. అనగాఅజ్ఞానమే నిద్రవలె తయారై వ్యావహరిక స్వరూపము నావరించి స్వప్నభ్రమను కలుగజేచేసినది. అయినపడు నిద్రకు మూలమగు అజ్ఞానముకూడా నిద్రయొక్క స్వభావము కలదనుటోలో సందేహము లేదుకదా. నిద్రస్వభావమేమంటే తన స్వరూపాన్నికప్పివేసి మరియొక రూపము కలవానిగా తయారుచేసి, మరియొక దృశ్యమును చూపించడమే అజ్ఞానమనే నిద్రకూడా పరమాత్మస్వరూమును మరపించి జీవునిగా తయారుచేపి ఆరోపిత ప్రపంచమును చూపించుటయేనని చెప్పవలయును.

నిద్రాసమయములో కనిపించేదే స్వప్నం. అప్పుడు చూచేవాడు కూడా మారియుంటాడు. ఈ మామూలునిద్రకు మూలభూతమగు ఆజ్ఞానము కూడా నిద్రయనుటలో సందేహించినక్కరలేదు. అజ్ఞానమే నిద్రఅయినపుడు నిద్ర ఎప్పుడూ స్వరూపమును అచ్ఛాదన చేయును గనుక ఆ స్వరూపమును మరియొక స్వరూపం కలవానినిగా తయారుచేయుననియు మరియొక ప్రపంచమును చూపించుననియు చెప్పితీరవలయును. నిద్రాసమయంలో కనిపించేది స్వప్నమేగనుక అజ్ఞానం, నిద్ర అయినపుడు అజ్ఞాన సమయంలో కనిపించేదంతయు స్వప్నమనే చెప్పవలయును. ఈ స్వప్నమును చూచేవాడు కల్పితస్వరూపం కలవాడనే చెప్పవలయును.

జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్యవస్థ కూడా మూలాజ్ఞానమనే నిద్రాసమయములోనే భాసించుచున్నవి గమనిక మూడు అవస్థలు స్వప్నా వస్థక్రిందనే లెక్కబెట్టి శృతి మూడు స్వప్నములని చెప్పినది. మామూలు స్వప్నములో పగలు జాగ్రదవస్థ.రాత్రి నిద్రపోయినపుడు స్వప్నావస్థ, గాఢసుషుస్తి. ఈ మూడుగోచరించినను ఈ మూడు స్వప్నముఆనే గ్రహించ వలయునుకదా. అటులనే అజ్ఞాన నిద్రావస్థయందు గోచరించినఅవస్థాత్రయం స్వప్నమని తాత్పర్యం. అందువలననే వేదమాత నాయనా! నిద్రలేవండి, మహానుభావులవద్దకు వెళ్ళండి, జ్ఞానమును సంపాదించండి.జ్ఞానమార్గం చాలా కష్ఠం. ఈ విషయమును బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు. అని బోధించుచున్నది.

మామూలుగా నిద్రపోయిన వానిని ఎవరయినా నిద్రలేపినట్లు ఈ యజ్ఞాన నిద్రలో నిద్రపోయిన వానిని దయామయుడయిన గురవు నాయనా! నీవు జీవుడవు కావు. నీవు కర్తృత్వ భోక్తృత్వ భోక్తృత్వములు లేవు. జనన మరణములు లేవు. శోక మోహములు లేవు. ఆకలిదప్పికలు లేవు. శరీరేంద్రియములేవు. నీవనుభవించు ప్రపంచమంతయు మిధ్యా భూతమే. నీయొక్క పారమార్థిక స్వరూపమేమంటే వేదాంతవేద్యమైన సచ్చిదానంద రూపమైన పరమాత్మ స్వరూపమే. అట్టి పరమాత్మ స్వరూపుడవే నీవు.

అని మహావాక్యార్థముగు జీబ్రహ్మైక్యమును బోధించిన యడల ఆ స్వప్నద్రష్టవలెనున్న జీవుడు నేను జీవుడను కాను, కర్తను కామ, భోక్తను కాను, నాకు జన్మమరణాదులు లేవు, ప్రపంచమంతయు భ్రమయేమని భావించుచు నేను సచ్చితానందమగు, అద్వితీయమగు పరమాత్మ స్వరూపుడనేనని బ్రహ్మసాక్షాత్కారమును పొందును. ఈ బ్రహ్మ సాక్షాత్కారమే అజ్ఞాననిద్రలో ప్రబోధ (మెళుకవ) యని చెప్పబడును. ఇట్టి ప్రబోధ కలిగిన తరువాత అజ్ఞానమనే నిద్ర నశించును. అజ్ఞాననిద్ర పోగానే ప్రపంచమను స్వప్నభ్రమ, జీవత్వభ్రమ కూడా నశించును. ఆయాత్మఅద్వితీయమగు పరమాత్మ స్వరూపముతో నుండును. ఈ స్థితియే మోక్షమని చెప్పబడును.

ఈ విషయమంతయు ''యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే! స్వాత్మాన మేవాద్వయం'' అను శ్లోక భాగముతో సూచించబడినది. అద్వైత వేదాంత రహస్యము తెలుసుకొనుటకు చాలా క్లేశము గనుక ఈ శ్లోకమునకు వ్రాయతగిన తాత్పర్యమేగాక, సిద్ధాన్తమును తెలిసికొనుటకు ఇతర విషయములను కూడా చేర్చి విశదపరచడమైనది. చెప్పినవిషయమునే కొన్నకొన్నివిశేషములు తెలిసికొనుటకొరకు రెండుమూడుమార్లుగా వివరించితిని, గనుక పునరుక్తిగా భావింపకుందురుగాక.

ఈ శ్లోక తాత్పర్యమును బాగుగా చూచినయడల అద్వైతసిద్దాంత రహస్యము స్పష్టముగా తెలియగలదు. శంకర భగవత్పాదులవారు లలితముగా చెప్పినను, వారి వచనముయందు గంభీరములైన అర్థములు ఉండును. గనుక ఇది విస్తృతముకాదు. ఆశ్చర్యమేమంటే స్వప్నంలో అసలు స్వరూపమును మరచిపోయినను బ్రాంతిలోనే తాను ద్రష్టగా తయారుకావడం, ప్రబోదవలన బ్రాంతి పోయినతర్వాతభ్రాంతిని చూచిన ఉపాదితోకూడిన అనగా ఆభ్రాంతికాలమందు ఏర్పిడిన శరీరేంద్రయములుపోయి ఒక మిగిలినస్వరూపంతో అసలువానిలో చేరి నాకే స్వప్న వచ్చినదని భావించున్నడు.స్వప్నదశయందున్న ఔషధిక స్వరూపము పోయినట్లుఏ, నిరూపధిక ఉన్నట్లే ,కాని మూలాజ్ఞానం పోలేదు గనుక మెళుకువ వచ్చినతరువత కూడా వ్యావహారిక శరీరేంద్రియము లనే ఉపాదితోకలసియుండుటచేత నిజమైన స్వరూపమును గుర్తించలేకున్నాము.

ఆత్మసాక్షాత్కారం కలిగినతరువాత అజ్ఞానంపోతే ప్రపంచస్వరూపస్మప్నమంతయు పోవును.ఈ స్వప్నదశయందు ఏర్పడిన స్థూలసూక్ష్మ దేహములనే ఉపాదులుపూర్తితా పోవుచుకనుక మోక్షదశలోపూర్తిగా సర్వోపాదిరహితుడై నిర్విశేష బ్రహ్మరూపముగా స్వప్రకాశానంద రూపముగానుండును.

శుక్తి రజితభ్రమ, రజ్జుసర్పభ్రమ మొదలగు భ్రమలలో భ్రాంతిని పొందేవాడు. అదిష్టానముకంటే వేరుగానున్నటుల కనిపించి నను ఆత్మాధిష్ఠానక భ్రమయందు మాత్రం, భ్రమకు అదిష్ఠానం భ్రమను చూచే ద్రష్టము ఒకటియని అనకోవరలయును. తను స్వరూపంలోనుండి అన్యధా మరియొక స్వరూపంతో బయలుదేరుట జీవభావం. అది పోవుటయే బ్రహ్మైక్యమని దృఢముగా గమనించవలసిన విషయము.

''విశ్వం దర్పణదృశ్య మాన నగరీతుల్యం'' అన్నపుడు మరియెక విధముగా కూడా విమర్శంచుట అవసరం. అద్దమును మనం చూచేటప్పుడు మనముఖం అద్దములో గోచరించుచున్నది. ముఖం అద్దమునకు ఎదురుగా నుండును. అద్దం ముఖమునకు ఎదురుగా నుండును. మనముఖమే అద్దంలో కనిపించేయెడల అద్దమునకు ఎదురుగా ముఖం అద్దంలో ప్రతి బింబిస్తే మన వెనుకభాగమే అద్దంలో మనకు కనిపించువలయును గాని మనకు ఎదురుగా నున్నట్లు కనిపించడం ఎట్లు కుదరురును. అంటే మనం అద్దం చూచినపుడు మన నేత్రమునుండి సూర్యకిరణములవంటి కిరణములు బయలుదేవి అద్దమునకు తగిలి, మరల తిరిగి మన ముకములనకు తగిలి మన ముఖమును అద్దమందున్నట్లు కనిపింపచేయుచున్నవని ఒక సమాధానం చెప్పెదరు.

ఈ విధంగా చెప్పేయోడల మనం నీళ్ళలో సూర్యప్రతిబింబం చూచేటపుడు, మన నేత్రకిరణములు నీటిమీదికి వెళ్ళి తగిలి తిరిగి సూర్యమండలమునకు పోయి ఆ సూర్యమండలమును తగిలి ఆకాశమందలి సూర్యుని భూమిలో మనం చూస్తున్న నీటిలో నున్నట్టు కనిపంపచేయుచు%్‌నవని చెప్పవలయునుకదా. పెద్దఅద్దంలో పట్టణం కనిపిస్తున్నదంటే అద్దమును చూచేవారికి నేత్రకిరణములు అద్దమునకు తగిలి, ఆ నేత్రకిరణములు నగరమునకు తగిలి ఆ నగరమును అద్దంలోనున్నట్లు కనిపించేయుచున్నపని చెప్పవలయును. ఇది సంభవమేనా అంటే,

సమాధానం: ఆద్వైతులు ఇంద్రియములద్వారా సూర్యమండలం చంద్రమండలం మనకు కనిపించేటపుడు ఆకాశమందున్న సూర్యుడు, భూమియందున్న మనకు ఎట్లు కనిపిస్తాడు. చూచేవానికి చూడబడే వస్తువులకు సంబంధం ఉండవలయును కదా. సూర్యుని వెలుతురులో ప్రపంచం కనిపించుచున్నదంటే సూర్యబింబం ఆకాశమందున్నను సూర్యబింబం వెలుతురు భూమండలంమీదికి దిగి, ప్రపంచమంతయు వ్యాపించి ప్రపంచమును కనిపించేటట్లు చేయుచున్నది. ప్రకాశింపచేసే వెలుతురురుకు ప్రకాశింపచేయబడే ప్రపంచమునకు సంబంధం కలిగినది కనుకనే ఆ వెలుతులో ఆ ప్రపంచం కనిపిస్తున్నది.

ఈ విధంగానే దీపం ఒకచోట నున్నను దాని వెలుతురు కొంత మేర వ్యాపించును గనుక ఆ వెలుతురు వ్యాపించినంతవరకున్న వస్తువులు ఆ వెలుతురులో కనిపించుచున్నవి. ఈవిధంగానే చంద్రుని వెలుతురులో వస్తువులను చూచుట మొదలగు జ్ఞానములు కలుగుచున్నవి. ఈ యనుభవమునుబట్టి తెలియచేసే వెలుతురుగాని మరొకటిగాని తెలియచేయబడే వస్తువులమీదికైనా రావాలి, లేక తెలియబడే వస్తువులు తెలియజేసే వెలుతురుమీదికైనా వెళ్ళాలేకాని, ఆ వెలుతురు వ్యాపించకుండా ఆక్కడనే యుండి ఈ వస్తువులు ఇక్కడనే వున్నప్పుడు పరస్పరం సంబంధం లేక పోతే ఆ వెలుపుతురు వల్ల మనకు వస్తువులు కనిపించుట కవకాశంలేదు కదా.

అయినపుడు ఆ వెల్తురువల్ల మన కుపయోగం ఉండదుకదా! గనుక వెల్తురు ప్రకాశింపచేయగలిన వస్తువులమీదికి వ్యాపించుననియే అనుభవమునుబట్టి చెప్పితీరవలెను. మనం ప్రపంచవస్తువులనుగాని, సూర్యమండలమునుగాని, చంద్రమండలమునుగాని, నక్షత్రములనుగాని చూచునపుడు అవి మనకు కనిపిస్తున్నవికదా! ఎట్లా కనిపిస్తువని విమర్శించవలయును. తెలుసుకొనే మనం గాని, మనదృష్టిగాని సూర్యమండలంవద్దకో, దూరంగా వుండే వస్తువులవద్దకు పోవాలి. లేక ఆ సూర్యమండలం దూర ముందుండే వస్తువులను, మనవద్దకు వచ్చి మన దృష్టికి సంబంధించాలి. లేకపోతే అవి మనకు కనిపించవు.

మన అనుభవాన్ని బట్టి చూస్తే సూర్యుని వెల్తురు క్రిందికి వచ్చినను సూర్యబింబం మనవద్దకు రావడంలేదు. కాని సూర్యబింబంకూడా మనకు కనిపిస్తున్నది. దూరమందుండే పర్వతములు, వృక్షములు మనవద్దకు రావడంలేదు. కాని కనిపిస్తున్నవి. సంబంధంలేనిది కనిపించవు గనుక, మనమే మనదృష్టితో కూడా సూర్యమండలంవద్దకు, మనకు కనిపించే ఇతర వస్తువులవద్దకు వెళ్ళుచున్నామని చెప్పవలయును.

ఎట్లాగంటే, మన నేత్రములతో వస్తువులను చూడగానే మన హృదయ పుండరీకములోనున్న మన అంతఃకరణ అతిశీఘ్రముగా సూర్యమండలమునకు వెళ్ళి సూర్యబింబాకారాకారితమగును. అనగా, నీరు పాదుల లోనికి వదలినపుడు పాదు నాల్గుపలకలగానుంటే నాల్గుపలకలగాను, గుండ్రంగానుంటే గుండ్రగాను పాదులలో వ్యాపించును. అటులనే అంతఃకరణ ఏ వస్తువులమీదికి ఇంద్రియములద్వారా వెళ్లునో ఆ వస్తువులనిండా తదాకారముగా పరిణమించునని యర్థము. జీవచైతన్యముకూడా అంతఃకరణముతో పాటు సూర్యమండలమునకు హృదయము నుండియే వెళ్ళునని, ఆ వృత్తియందు చైతన్యం ప్రతిబించునని ఆ వృత్తి ప్రతి బింబిత చైతన్యమే జ్ఞానమని, ఆ జ్ఞానమునకు సూర్యమండలం గోచరించునని చెప్పెదరు. అటులనే అన్ని విషయములలోను గ్రహించవచ్చును.

ఇట్లయితేనే అంతఃకరణ అనే దృష్టికి, సూర్యమండలమనే దృశ్యమునకు ద్రష్టయనే జీవునకు సంబంధం కలుగును. అందువలనే మనం ఆ దూరవస్తువులను చూచి తెలుసుకొనుచున్నాము. అవి మన అద్వైత సిద్ధాంతంలో జ్ఞానోత్పత్తి ప్రక్రియను చెప్పెదరు. సూర్యుడు సూర్య మండలంలో నుండియే వెల్తురుతో ప్రపంచమంతయు వ్యాపించుచున్నాడు. అటులనే మనలోనున్న చైతన్యము, మన శరీరములోనుండియే ఇక్కడ వదలకుండా నేత్రగోళకద్వారా అంతఃకరణతో సూర్యమండలాది ప్రదేశమునకు వెళ్ళి గ్రహించుచున్నది. సూర్యుని వెల్తురు భౌతికమైనది గనుక రూపము కలిగియున్నది. అందుచేతనే సూర్యమండలంనుండిభూమండలం వరకు, వ్యాపించినంతవరకు, మధ్యలో కూడా కనిపించుచున్నది. చైతన్యంరూపంలేనిది గనుక ఇంద్రియద్వారములనుండి అంతఃకరణతో సూర్యమండలంవరకు వ్యాపించినను మధ్యలోకనిపించుటలేదు.

ఇంద్రియములకు గోచరించేదికాదు. గనుక మన చైతన్యస్వరూపముతో అన్నిటిని తెలుసుకుంటున్నాముగాని మన ఆత్మను మనం తెలుసుకొనలేకున్నాము. దీనినిబట్టిచూస్తే మన నేత్రకిరణములు అద్దమునకు తగిలి తిరిగి వచ్చి మన ముఖమును అద్దమందున్నటుల కనిపించేటట్లు చేయుచున్నవనే విషయం పెద్ద ఆశ్చర్యం కాదు. మనం ఈ విమర్శచేయనందు వలన ఆశ్చర్యపడవలసినదే గాని విమర్శించిన మనస్సుకు సమధానం కలుగును.

అద్దంలో వస్తువులున్నట్లు కనిపించడం, యథార్థజ్ఞానం అవడానికి వీలులేదు. యథార్థవస్తువులు లేవు గనుకనే, యథార్థజ్ఞానమైతే, ఉన్న వస్తువులే కనిపించునుగాని, లేనివస్తువులు కనిపించవు. అద్దంలో ఆ వస్తువులు ఇమడవు గనుక, అప్పటికప్పుడు అద్దంలో ఆ వస్తువులు, పుట్టి కనిపించు చున్నవని యనుటకు వీలులేదు. అద్దంలోనే కనిపించే వస్తువులు పుడితే అద్దం పగిలిపోవలేకదా.

అద్దంలో కనిపించే వస్తువులు సత్యమైతే, ఆ జ్ఞానం యథార్థమైతే, శంకర భగవత్పాదులవారు ''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం'' అని. ఆత్మయందు ప్రపంచం భ్రమగా కనిపించుచున్నదని చెప్పుటకు, ఈ ప్రపంచం అద్దంలో కనిపించే ప్రపంచంలాంటిదని దృష్టాన్తంగా ఎందుకు చెప్పెదరు. భ్రమకు దృష్ఠాంతంగా చెప్పుచున్నారు గనుక అద్దమందు కలిగే ప్రతిబింబం జ్ఞానం భ్రమయనే శంకరభగవత్పాదులవారి హృదయమని చెప్పవలయును.

భ్రమయనగా ఒకదానియందు మరియొకటి యనే జ్ఞానమేకదా! అనగా భ్రమలో ఒక వస్తువుయందు ఆజ్ఞానముచేత తాత్కాలికముగా గోచరించే వస్తువు కల్పితమగును కదా! అయితే ఇక్కడదేనియందు ఏది కల్పింపబడుచున్నది? అసలు ముఖంగాని, ప్రతిబింబించే ఇతర వస్తువులు గాని, యథార్థమైనవి, దగ్గరనే యున్నవిగనుక అద్దములో అవియే కల్పితమైనవని చెప్పుటకు వీలులేదుకదా.అంటే.

ఈ విషయంలో కొందరు ఒకవిదంగా సమాధానం చెప్పిరి. ఒక చోట స్ఫటికమున్నది. దానిప్రక్కన్నే జపాకుసుమ మున్నది. స్ఫటికం తెల్లగా స్వచ్ఛంగా నుండునుకదా. జపాకుసుమం బాగా ఎరుపుగా నుండును కదా. జపాకుసుమమందున్న ఎరుపు స్ఫటికమందు ప్రతిబింబించి కనిపించు చున్నది. ఇక్కడ స్ఫటికమందు ఎరుపు కల్పితమని చెప్పుటకు వీలులేదు. ఎందుచేతనంటే జపాకుసుమం దగ్గరనే యున్నది గనుక ఆ స్థలంలో స్ఫటికం ఎరుపుగా నున్నదనే జ్ఞానాన్ని ఏమనవలెనంటే భ్రమ అనకుండా, అన్యధాఖ్యాతి యనవచ్చునన్నారు. అన్యధాఖ్యాతి యనగా ఒకచోటవున్న వస్తువు మరియొకచోట వున్నట్లు కనిపించుటయే.

అయితే ఇక్కడ ఇక విశేషం. స్ఫటికం కనిపిస్తూ స్ఫటికానికి దగ్గరనే జపాకుసుమముండి. ఏదైనా అడ్డముండుటచేత జపాకుసుమం మనకు కనిపించకుండా ఆ జపాకుసుమం ఎరుపుమాత్రం స్ఫటికమందు కనిపించినపుడు. అనగా స్పటికం ఎరుపుగా నున్నదనేజ్ఞానం భ్రమయే. అనగా ఆ ఎరుపు స్ఫటికమందు కల్పితమైనట్లే. అదిపూర్తి భ్రమయనే చెప్పవలయును. జపాకుసుమం, స్ఫటికం రెండు వేరువేరుగా కనిపిస్తున్నపుడు స్ఫటికమందు ఎరుపుగానున్నదనే జ్ఞానం మాత్రం అద్వైతులు చెప్పే భ్రమకాదు. అన్యదాఖ్యాతియనే చెప్పవలయుననిరి.

అయితే అద్దం కనిపిస్తూ అద్దమందు ప్రతిబింబించే వస్తువులుకూడా వేరుగానున్నట్లు మనకు కనిపించనపుడు ఆ వస్తువులు అద్దంలో కనిపిస్తే, అవికల్పితమైనట్లుకదా. ఆజ్ఞానం భ్రమయే కదా. అట్లయితే అద్దమందు ఒక నగరంగాని, కొన్నివస్తువులుగాని కనిపించినవంటే, అద్దమును మాత్రం చూస్తూ నగరమును, ప్రతిబింబించే అసలు వస్తువులను చూడకుండా నున్నవ్యక్తికి అద్దంలో కలిగిని ఆవస్తు ప్రతిబింబజ్ఞానం భ్రమయనియే చెప్పవచ్చును. ప్రతిబింబించే ఆరోప్య వస్తువులు దగ్గరగానున్నను కనిపించకుండా వుండి అద్దంలో కనిపిస్తే భ్రమ. అసలువస్తువులు వేరుగా కనిపిస్తూ అద్దంలో కనిపిస్తే మాత్రం అన్యధాఖ్యాతి అంటామనిరి. అటులనే ప్రపంచం ఆత్మయందు నిజముగా లేదని, భ్రమగా కనిపించుచున్నదని, భగవత్పాదులనారు చెప్పిరి.

కొందరు అద్దంలో మన ముఖంగాని, కొన్ని వస్తువులుగాని కనిపించినపుడు మన ముఖమందే అద్దమందున్నట్లు మన కెదరురుగా నున్నట్లు ఈ స్థితి కల్పితమైనది. ఇదియే ఇక్కడ భ్రమయని చెప్పిరి. భ్రమయనగా ఒకవస్తువు మరియొక వస్తువుగా కనిపించడంకదా. శుక్తి వెండి వలె, త్రాడు సర్పంవలె కనిపించిందంటే అది భ్రమ అంటే సరిపోతున్నది కాని ఇక్కడ అద్దంలో వస్తువులు కనిపిస్తే, ఏ వస్తువు ఏవస్తువుగా కనిపించింది? అదిష్ఠానం ఏది? ఆరోపం ఏది? అని ప్రశ్నించవచ్చును. సమాదానం: అద్దమే అద్దంలో కనిపించే నగరంవలె, కనిపించే ఇతరవస్తువుల వలె కనిపించుచున్నది. అద్దమే అదిష్టానం . ఇందులో కనిపించే వస్తువులే ఆరోపం అంటారు.

ఒక వస్తువు మరియొక వస్తువుగా కనిపించిన భ్రమ యనవచ్చును గనుక. అద్దమే ప్రతిబింబముగా కనిపింంచుచున్నదంటే భ్రమయని చెప్పుట కుదిరినది. ఏ వస్తువు దగ్గరవుంటే ఆ వస్తువే అద్దంలో ఎందుకు కనిపించవలె. మరియొక వస్తువుగా ఎందుకు కనిపించకూడదు. అంటే సమాదానం: భ్రమ ఎప్పుడు ఒక దోషమును బట్టియే కలుగుచుండును. కామర్లు అనే దోషము కలవారికి తెల్లగానున్నశంఖం పచ్చగా నున్నట్లు కనిపించును. నాలుకయందుదోషం కలవానికి తియ్యని బెల్లంముక్క నాలుకయందు వేసుకున్నప్పుడు చేదుగానున్నట్లు గోచరించును. అద్దంలో భ్రమకలుగుటలో బింబసాన్నిధ్యమే. అనగా బింబం దగ్గర వుండుటయే దోషంగనుక, అద్దం ఏ వస్తువుదగ్గరవుంటే ఆ వస్తువుగానే కనిపించుచుండును. అనగా అద్దంలో కనిపించుచుండును. బింబసాన్నిధ్యమును లేకుండా చేసినయడల ఆభ్రమ పోవును. మరియొకవస్తువు దగ్గరనున్న యడల ఆ వస్తువే అద్దంలో కనిపించును. ఇట్టి దోషయే ఈ భ్రమమలో కారణం గనుక. అద్దమే అదిష్టానం గనుకను, అదిష్ఠానంలోనే ఆరోపం కనిపించును గనుకను అద్దంలో కనిపించే దృశ్యము లన్నియు అద్దంలో నున్నట్లేగాని బైటలేవు. అద్దంకంటే వేరులేదుకూడా (ఉండడమనగా కనిపించడమనే యర్థము). అటులనే అదిష్ఠానమగు ఆత్మయందు కల్పితమై కనిపించే ప్రపంచమంతయు ఆత్మయందే యున్నదిగాని మరియొక చోట ఉండదు. అందుచేతనే నిజాంతర్గతం అని చెప్పిరి.

ఈ విషయంలో ఒక ప్రశ్న. అదిష్ఠానం కనిపించే సమయంలో ఆ యదిష్ఠానమందు భ్రమకలుగదు. తాడును తాడని గుర్తించిన సమయంలో సర్పమనే భ్రమ కలుగదు కదా! అద్దమని మనకు తెలుసును. అద్దంలో మన ముఖం లేదు ఇతర వస్తువులు లేవు అని దృఢంగా తెలిసినను, అద్దంలో ముఖమున్నట్టు వస్తువులున్నట్లు కనిపించుచున్నవి. కారణమేమి? అంటే ఈ ప్రశ్నకు సమాధానం: దోషం లేనపుడు అదిష్ఠాన సాక్షాత్కారం కలిగియుంటే భ్రమ కలుగదుకాని దోషమున్నడు అధిష్ఠానం తెలిసియున్నను భ్రమ కలుగుచునేయుండును.

శంఖం తెల్లగానే యున్నది. పచ్చగా లేదని బాగా తెలిసినను కామెర్లదోషము కలవాని కళ్ళకు పచ్చగానే యున్నట్లు కనిపించుచున్నది. కామెర్లు అనే దోషమును పోగొట్టుకుంటే శంఖం పచ్చగానున్నదనే భ్రమకలుగదు. బెల్లం తియ్యగానే యున్నది చేదులేదని తెలిసియున్నను, జిహ్వాదోషం కలవానికి బెల్లం నాలుకమీద వేసుకున్నపుడు బెల్లం చేదుగానే యుండును. జిహ్వదోషమును పోగొట్టుకొన్నయెడల చేదుగా నున్నటుల భాసించదు. ఇటులనే ఆకాశంలో రూపంలేదని బాగా తెలిసినను దూరత్వదోషంవల్ల, ఆకాశం నల్లగా నున్నట్లు భ్రమ కలుగుచునేయున్నది. దగ్గరకి పొయ్యేకొద్ది దూరత్వదోషం పోవునుగనుక ఆ నలుపు కనిపించదు. ఇంకాదూరంలో నలుపుగానున్నట్లు కనిపించును. శాస్త్రప్రమాణముచేత చంద్రుడు ప్రపంచంకంటే విశాల స్వరూపుడని తెలిసియున్నను దూరత్వదోషం వల్ల జానెడు పరిమితిలో గుండ్రముగా కనిపించుచున్నాడు.

సముద్రం ఉదకమని తెలిసియున్నను దూరంగా నున్నవారికి నల్లని రాళ్ళవలె కనిపిస్తుంది. దగ్గరకి వస్తే దూరత్వదోషం పోవును గనుక నీరు నీరుగనే కనిపించును. స్ఫటికం తెల్లగనే యున్నది. ఎఱ్ఱనిది కాదని తెలిసినను జపాపుష్పందగ్గర నున్నపుడు ఎరుపుగా నున్నట్లే కనిపించును. జపాకుసుమం తీసివేసినపుడు ఆ భ్రమ పోవును. అటులనే అద్దంలో కనిపించేవి ఏమీలేవని తెలిసినను ప్రతిబింబంచే అసలు వస్తువులు ఎదురుగా నున్నపుడు, అద్దంలోనున్నట్లు బ్రమకలుగుచునే యుండును.

పైన ఉదహరింపబడిన దృష్టాంతరము లన్నియు అదిష్ఠానం తెలిసియున్నను, దోషమున్నంతవరకు మరియొక విధంగా భ్రమగా గోచరించుచుండునని చెప్పుటకు ఉదహరించుపడినవి. అద్దమందు కలిగే ప్రతిబింబభ్రమ ఉపాధినిబట్టియు బింబమును బట్టియు కలుగుచున్నది. అద్దంలో కనిపించే ప్రతిబింబం ఉపాధియగు అద్దమునకు బింబమగు అసలు వస్తువు లకు అధీనమై యున్నదిగాని స్వతంత్రంకాదు. ప్రతిబింబం అద్దం కదలినా కదులుతుంది, బింబం కదిలినా కదులుతుంది.

బింబం ఏరంగుతో నుండునో, ఆ రంగుతో కనిపిస్తుంది. ఒకప్పుడు అద్దం ఏ రంగుతో నుండునో ఆరంగుతో కనిపిస్తుంది. అందుచే ప్రతి బింబమునకు బింబమే పరమార్థ స్వరూపమని చాలామంది అంటారు. బింబముంటేనే ప్రతిబింబం కనిపించును. లేకపోతే ప్రతిబింబం కనిపించదు కూడా. మరియొక పక్షం, మన ముఖం అద్దమున కెదరుగానున్నది. అద్దం మనకెదురుగా నున్నది.అద్దంవలె అద్దంలో ప్రతిబింబం కూడా మనకెదురుగా నున్నది గనుక. అద్దమే ప్రతిబింబంవలె గోచరించుచున్నది. అందువలననే భ్రమ యన్నారు. మొత్తానికి అద్దంలో లేనిది. అద్దంలో నున్నట్లు కనిపించనిది గనుక భ్రమ యనవచ్చును.

కొందరు అద్దమే ప్రతిబింబంవలె కనిపిస్తున్నది. గనుక అద్దమే ప్రతిబింబమునకు పరమార్థము. అద్దముంటేనే ప్రతిబింబంకనిపిస్తుంది.లేక పోతే కనిపించదు. గనుక ఆపక్షంలో పూర్తిగా భ్రమయని చెప్పవచ్చును. అయితే శుక్తి రజత భ్రమలో, రజ్జుసర్పభ్రమలో అదిష్ఠానములైన శుక్తి రజ్జువులు అజ్ఞానముచేత నావరింపబడి తెలియబడకుండా వుండే దశలోనే భ్రమకలుగుచున్నదికదా. ప్రతిబింబభ్రమలో తెలయబడకుండా వుండే అదిష్ఠానం ఏదిలేదే అని ప్రశ్నించవచ్చును. సమాధానం: భ్రమలన్నియు ఒక విధంగా ఉండవు. కొన్నిచోట్ల అసలు వస్తువు అజ్ఞానముచేత ఆవరింపబడును. కొన్నిచోట్ల అధిష్ఠానం తెలియుచున్నను దోషంవల్ల భ్రమ కలుగుచుండును. ఈ విషయం పైన వివరింపబడినది. శంకర భగత్పాదులవారు శుక్తికాహి రజతవ దవభాసతే, ఏకశ్చంద్రస్స ద్వితీయవత్‌ అనిఅధ్యాస భాష్యంలో ఉదహరించిరి. అనగా శుక్తి వెండివలె కనిపించుచున్నది. ఒక చంద్రుడు ఇద్దరు చంద్రులవలె కనిపించుచున్నాడని యర్థము. ఒక వస్తువు మరియొక వస్తువుగా కనిపించుటలో శుక్తి రజత భ్రమను దృష్టాంతముగా చెప్పిరి. ఒక వస్తువు అనేక వస్తువులవలె కనినపించుటలో, ఒక చంద్రుడు అనే చంద్రులవలె కనపించునని దృష్టాంతము చెప్పిరి. శుక్తి రజత భ్రమలో శుక్తి యజ్ఞానముతో ఆవరింపబడినట్లు ఒక చంద్రుడు ఒనేక చంద్రులవలె కనిపించుటలో చంద్రుడు అజ్ఞానంతో నావరింపబడియుండలేదు. ఒకానొక దోషం చేతనే అనేకంగా కనిపిస్తున్నాడు.

ఒక విధమైన రేచీకటి కలవానికి ఒక చంద్రుడు ఇద్దరు చంద్రుల వలె కనిపించును. ఒక దీపం రెండుదీపములవలె కూడా కనిపించును. కన్ను నొక్కినపుడు అందరికిని ఒక చంద్రుడు ఇద్దరు చంద్రులవలె, ఒక దీపం రెండు దీపములవలె కనిపించును. గనుక భ్రమలు అనేక విధములుగా నుండును. అందుచేత అద్దంలో కలిగే ప్రతిబింబ భ్రమ ఒక విధమైనది. అద్దంలో కనిపించేవి సత్యములు కావు. విమర్శించిన అద్దంకంటే వేరుగాకాని, బింబంకంటె వేరుగానున్నట్లు రుజువుకావు. అటులనే ఆత్మలో కనిపించే ప్రపంచం ఆత్మకంటే వేరుగా లేదని రుజువు కాదు అని శంకర భగవత్పాదులవారి హృదయమని గ్రహించవచ్చును. ఈ విషయంలో శాస్త్రయుక్తులనేకముగా నున్నను అందరికి సిద్ధాంతం తెలియుటకు అనుగుణముగా ఒక రకంగా తేల్చి యధాశక్తిగా వ్రాసితిని. (ఇంకా విపులముగా వ్రాసిన చదువుటకు కూడా కష్టమగును) శంకర భగవత్పాదులవారి భాష పైకి సులభముగా నున్నట్లుకనిపించినను ఆ భాషలో అర్థము చాలా గంభీరముగా నుండును. 'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. నిజాన్తర్గతం' అని చెప్పుటవలన ఆత్మయందు ప్రపంచ స్థితిని ప్రపంచ స్వరూపమును ఎట్లు గ్రహించవలసినది పూర్తిగా చెప్పిరి. 'యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం' అని చెప్పుటవలన, ఆత్మసాక్షాత్కారము కలిగిన తరువాత ప్రపంచభ్రమ జీవత్వభ్రమ పోయి, పరమాత్మ స్వరూపముగా నుండుటలో స్వప్నభ్రమను మెళుకువ వచ్చిన తరువాత స్వప్న ప్రపంచం పోయి స్వప్నమందు కల్పితమగు తన ఔపాధిక స్వరూపం కూడా పోయి, వ్యావహారిక పరమార్థ స్వరూపంతో నున్నాడని ఉదాహరణగా చూపించిరి. గనుక ఈ శ్లోకం ఎంత గంభీరార్థము కలదో ఆలోచించండి. సంగ్రహముగా అద్వైత సిద్ధాంతమంతయు ఈ శ్లోకము నందు చూపించబడినది. అవిద్యాదశ, విద్యాదశ జీవస్వరూపము. పరమాత్మ స్వరూపస్థితి. విషయప్రయోజనాదులను అతి హృదయంగమముగా ప్రబోధించిరి గనుక తత్వజిజ్ఞాసువులు ముఖ్యముగా ఈ స్తోత్రసారమును గ్రహించవలయును.

ఇట్లు ద్వితీయ శ్లోక తాత్పర్య వివరణం సమాప్తం,

అవతరణిక :-

వెనుక శ్లోకమందు పరమాత్మయందు ప్రపంచమంతయు ఉండునని, నిజాంతర్గతం అను పదముతో స్పష్టపరచిరి. అది కుదరదనియా శంకించవచ్చును. పరమాత్మ జగత్కారణ మయ్యేయడల కారణమైన పరమాత్మయందు కార్యమైన ప్రపంచం ఉండవచ్చునుగాని, నిర్వికారమైన, నిర్గుణమైన పరమాత్మ దీనిని గురించియు కారణం కానేరదు.

ఆరంభవాదమని, పరిణామవాదమని రెండు విధములుగా కార్యకారణ భావమును చెప్పే వాదములుకలవు. ఆరంభవాదులు తార్కికులు, పరిణామవాదులు సాంఖ్యులు మొదలగువారు. ఆరంభవాద మనగా కొన్ని కారణములు కలసి ఆ కారణములకంటే కార్యమును వేరుగా పుట్టించు విధానమే. అది ఎటులననగా ఒక కుండ అనే కార్యం పుట్టవలయునంటే, కుమ్మరివాడు, మట్టి, నీరు, చక్రం మొదలగు కారణములవలన ఆ కుండ అనే కార్యం పుట్టి, మట్టి అనే ఉపాదాన కారణమం దుండును. ఈ మతంలో కార్యకారణములు పూర్తిగా భిన్నములు. ఈ విధముగా పరమాత్మ జగత్తునుగురించి కారణం కానేరదు. పరమాత్మయనగా జ్ఞాన స్వరూపం. అది వ్యాపకం. అద్వితీయం. అనగా రెండవవస్తువు లేనిది అద్వితీయమైన పరమాత్మ ఇతర కారణములు లేకుండా ప్రపంచమునకు ఉపాదానకారణం కానేరదు గనుక ఆరంభవాదరీత్యా పరమాత్మ జగత్కారణమని, పరమాత్మయందు జనగత్తుఉండునని చెప్పుటకు వీలులేదు.

ఇక పరిణామవాదరీత్యా పరమాత్మ ప్రపంచమును గురించి, కారణమని చెప్పవలయును. అటుల చెప్పుటకుకూడా వీలు లేదు. పరమాత్మ నిర్వికారము. అనగా వికారమును (మార్పును) పొందనిది. నిరవయవము అనగా అవయవములు లేనిది లోకంలో సముద్రోదకం తరంగములవలె, బుడగలవలె పరిణామమును పొందుచున్నది. జలం అవయవములు కలదే. అందువలననే పరిణమించగలుగుచున్నది. గనుక జలపరిణామమైన తరంగాది వికారములన్నియు కార్యములే గనుక పరిణామి కారణమైన అనగా ఉపాదాన కారణమైన జలమునే ఆశ్రయించియుండును.

ఉపాదాన కారణమనగా కార్యం దేనియందు పుట్టి, స్థితిని పొంది, లయించునో అది ఆ కార్యమును గురించి, ఉపాదానకారణమని చెప్పబడును. ప్రకృతంలో తరంగములు, నురుగులు, బుడగలు అనే కార్యములు కారణమగు జలమందే పుట్టి, జలమందే ఉండి, జలమందే లయించుచున్నవి గనుక, ఆ జలం తరంగాది వికారములను గురించి ఉపాదానకారణమగును. అటులనే మట్టి, కుండలు, మూకుళ్ళు మొదలగు కార్యరూపముగా పరిణామమును పొందునుగనుక, కుండలు మొదలగు కార్య వర్గమునకు, మట్టి పరిణామ్యుపాదాన కారణమగుచున్నది. కుండలు మొదలగు కార్యములన్నియు మట్టియందే ఉత్పత్తి స్థితి లయములను పొందుచుండును. ఇటులనే బంగారము, గొలుసులు, ఉంగరములు మొదలగు అనేక భూషణస్వరూపముగా పరిణామమును పొందును. ఇట్టి పరిణామ కార్యములన్నియు ఉపాదానమైన బంగారమునే ఆశ్రయించి యుండును. ఇటులనే దారములయందు వస్త్రములు, ఇత్తడియందు ఇత్తడి వికారమైన పాత్రలు ఆశ్రయించి యుండును. సకల ప్రకృతి ద్రవ్యములయందును ఆయా ప్రకృతి వికారములగు కార్యములన్నియు వాటివాటి ప్రకృతుల యందు పుట్టుచు, స్థితిని పొందుచు, లయించుచుండును. ప్రకృతికంటే వికారములు వేరుకావు. వికారములన్నింటికిని ప్రకృతియే పరమార్థరూపముగా నుండును.

ఇటులనే పరమాత్మ ప్రపంచమును గురించి పరిణమించే ప్రకృతి అయ్యేయడ అ ప్రపంచమనే పరిణామకార్యము, ప్రకృతియగు పరమాత్మ యందు పుట్టునని, యుండునని, లయించుననియు, ప్రపంచమనే కార్యం పరమాత్మకంటే వేరుగాలేదని, ప్రపంచమనే కార్యమునకు పరమాత్మయే పరామార్థమని, పరమాత్మ సర్వవ్యాపకమని, సర్వాత్మకమని చెప్పుట కవకాశ ముండును. కాని, పరమాత్మ అవయవములు లేనిదిగనుకను, క్రియ లేనదిగనుకను, ప్రపంచరూపముగా పరిణామమును పొందనేరదు. ఇదియే గాక పరమాత్మ ప్రపంచమునుగురించి పరిణామికారణమయ్యే యడల అనేక దోషములు సంభవించును. లోకంలో ఒక ప్రకృతి కార్యముగా పరిణమించునపుడు సజాతీయమగు కార్యముగానే పరిణమించుచున్నది.

బంగారమనే ప్రకృతిద్రవ్యము సజాతీయమగు బంగారు భూషణములుగానే పరిణమించుచున్నదిగాని, వెండిపాత్రల వలె, రాగిపాత్రలవలె పరిణమించుట లేదుగదా! అటులనే వెండి, వెండిపాత్రలుగానే పరిణమించుచున్నదిగాని, విజాతీయమగు ఇత్తడి మొదలగు పాత్రలుగా పరిణమించుటలేదు. ఇటులనే రాగి రాగిపాత్రలుగానే పరిణమించును. మట్టి మట్టిపాత్రలుగానే పరిణమించునుగాని, ఇతరములుగా పరిణమించవుగదా! అటులైన సచ్చిదానంద స్వరూపమైన, నామరూపక్రియారహితమైన పరమాత్మ ప్రపంచరూపముగా పరిణమించేయడల సచ్చిదానంద రూపముగాను, నామరూప క్రియారహితముగాను ఉండవలసి వచ్చును.

ప్రపంచం నామరూపసహితముగాను, దుఃఖరూపముగాను గోచరించుచున్నది. చేతనమైన పరమాత్మలోనుండి అచేతనమగు ప్రపంచ పరిణామము ఏర్పడుటకు వీలులేదు. అందుచేత పరిణామవాదానుసారముగా కూడా పరమాత్మ జగత్కారణమని సమర్థించుట కవకాశంలేదు. అనేక ఉపనిషత్తులయందు సచ్చిదానందమగు పరమాత్మనుండియే ఆకాశాది భూత భౌతికములు పుట్టుచున్నవని స్పష్టమగుచున్నది. అందుచేత పరమాత్మ పరిణామవాదము ననుసరించియు, ఆరంభవాదము ననుసరించియు కారణం కాకపోయినను వివర్త వాదానుసారముగా బ్రహ్మజగత్కారణమగునని అనగా రజత భ్రమకు శుక్తివలె, స్వప్నభ్రమకు ఆత్మవలె పరమాత్మ ప్రపంచమునకు కారణమగునని వివర్తవాదమును సమర్థించుచు, శంకర భగవత్పాదులవారు ఈ శ్లోకమును వ్రాసిరి.

శ్లో|| బీజస్యాన్త రివాంకురో జగదిదం పాజ్నిర్వికల్పం పున

ర్మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీ కృతం

మాయావీవ విజృంభయత్యపిమహాయోగీవయస్స్వేచ్ఛయా

తసై#్మశ్రీ గురుమూర్తయేనమ ఇద్రంశ్రీ దక్షిణామూర్తయే ||3||

ప్రతిపదార్థ నిరూపనము||

ఇదం =ఈ అనుభవంలోనున్న ప్రపంచమంతయు, ప్రాక్‌=సృష్టి కంటె పూర్వమందు, నిర్వికల్పం,=భోక్త, భోగ్యము, కర్తా కార్యము అను వికల్పరహితమై (ఆకారము లేనిదై) పరమాత్మ స్వరూపముగానే, ఆసీత్‌=ఉండెను, ఆది ఎటులననగా దృష్టాంతమును చెప్పుచున్నారు. బీజస్య=విత్తనంయొక్క; అంతః=లోపల, అంకుర ఇవ=మొక్కవలె అనగా, ఆకులు పుష్పములు, కాయలు, కొమ్మలు, ఊడలు మొదలగు ఆకారముతో కూడిన గొప్ప పరిమితిగల వృక్షమంతయు మొక్క పుట్టుటకు పూర్వమందు స్థూలాకారములేని కారణమగు బీజరూపముగా నుండెనని (యర్థము). అటులనే ప్రపంచమంతయు సృష్టికి పూర్వమందు కారణమగు బ్రహ్మ రూపముగా నుండెనని యర్థము. పుణః=తిరిగి, సృష్టిసమయమందు మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం, మాయా=ఈశ్వరుని ఆశ్రయించిన మాయచేత, కల్పిత=కల్పింపబడిన, దేశ=దేశము, కాల=కాలము; కలనా=వాటియొక్క సంబంధము వీటి చేత, వైచిత్ర్య చిత్రీకృతం-వైచిత్ర్య=నానారూపమగు విచిత్రస్వరూపముతో; చిత్రీకృతం=అనేక భేదములచేతను అనేక ఆకారములచేతను పరస్పర భిన్నముగా చేయబడినది. కుమ్మరివాడు మొదలగు వారు తనుగాక మట్టి మొదలగు సాధనములతో ఘటాది కార్యములను చేయుచున్నట్లు మనకు అనుభవసిద్ధమై యున్నది. ఇతర సాధనలులేని పరమేశ్వరుడు విచిత్రమగు ప్రపంచమును ఎటుల సృష్టించును అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నారు. మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవయ స్స్వేఛ్ఛయా-మాయావీవ=లోక ప్రసిద్ధమైన ఐంద్రజాలికునివలె; మహాయోగీవ=గొప్పయోగివలె; స్వేచ్ఛయా=తన సంకల్పమాత్రము చేతనే; యః=ఏ పరమేశ్వరుడు, ఇదం=ఈజగత్తును; విజృంభయతి=సృష్టిస్తున్నాడో; తసై#్మ=ఆ; శ్రీ గురుమూర్తయే=గురుమూర్తి అయిన; శ్రీ దక్షిణామూర్తయే=శ్రీదక్షిణామూర్తిస్వామి కొరకు, నమః=నస్కారము,

తాత్పర్య వివరణము.

శంకర భగవత్పాదులవారు పరమాత్మ జగత్కారణమని, కారణమగు పరమాత్మయందే జగత్తు ఉండునని చెప్పుటకు, బీజాంకుర న్యాయమును దృష్టాంతముగా చెప్పిరి. ఈ బీజాంకుర న్యాయమును విమర్శించిన యడల చాలా ఆశ్చర్యము కలుగును. ఒక మఱ్ఱిగింజ సూక్ష్మమైనది. ఆ గింజ భూమియందుపడి తడిసినపిమ్మట ఆ విత్తనమును భేదించుకొని ఒక మొక్క బయలుదేరుచున్నది. ఆ మొక్క పుట్టి దినదినాభివృద్ధిగా పెరిగి మహావృక్ష మగుచున్నది. ఆ మహావృక్షము యొక్క విశాలమైన ఆకారము, మొక్క రూపముగా నున్నపుడు కనిపించుటలేదు. ఆ మొక్క యొక్క సూక్ష్మస్వరూపముకూడా, మొలవకుండా విత్తనముగా నున్నపుడును కనిపించుటలేదు. విత్తనము బద్దలు గొట్టి విమర్శించినను అచట ఆ చెట్టు యొక్క ఆకారము గోచరించుటలేదు. అయితే చెట్టు యొక్క స్వరూపము విత్తనములో యిమిడి వున్నాదా లేదా అంటే ఇమిడియున్నదనియే చెప్పవలయును. విత్తనమందు ఆ ఆకారములేక సంబంధములేక హఠాత్తుగా అంకురము పుట్టేయడల, చింతగింజలో నుండి కూడా మఱ్ఱిమొక్కగాని, వేపమొక్కగాని పుట్టవచ్చును గదా.

మరియు సంబంధములేకుండా ఉత్పత్తి అయ్యేయడల, విత్తనమును పాతిపెట్టినట్లు, రాతిముక్కను పాతిపెట్టినను అంకురము మొలవవచ్చును గదా. అట్లామొలుచుటలేదు. కనుక సజాతీయమగు బీజాంకురములకు నియత సంబంధము ఉండునని అదంతయు కారణరూపములో నుండుననియు అదియే సూక్ష్మ స్థూలరూపములను తాల్చుననియు, ఆ మహావృక్షమందు మరల కాయలు, అందులో విత్తనములు, ఆ విత్తనములలో వృక్షములు ఈ విధముగా బీజాంకుర న్యాయము ఆశ్చర్యముగా కనిపించుచున్నది. విత్తనములో నుండి అంకురసృష్టి పరిణామ రూపముగా బయలుదేరినది. అటులనే పరమాత్మలో నుండి ప్రపంచసృష్టి భ్రమరూపముగావివర్తరూపముగా, బయలు దేరినది. బీజాంకురదృష్టాంతములో గ్రహించవలసినవిశేషమేమంటే వృక్షముపుట్టే ముందు బీజమందే ఉన్నదని స్థూలవికార రహితమైన దని గ్రహించదగిన విషయము. ఆరోప ప్రపంచమంతయు సృష్టికంటే పూర్వమందు అధిష్ఠానమగు బ్రహ్మరూపముగానే యున్నదని, బ్రహ్మ నుండి ఈ వివిధ ప్రపంచము బయలు దేరినదని గ్రహించవలయును. అందు వలననే ''మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం'' అని శంకరభగవత్పాదులవారు మాయావాదమునే చెప్పిరి.

''మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్స్వేఛ్ఛయా'' అని కూడా మాయా వాదమునే బలపరచిరి. ఇంద్రజాలికుడు తయారు చేయుటకు ఏసాధనములు లేకపోయినను తనలోనుండే ఐంద్రజాలిక శక్తిచేత, అనేక రకములయిన దృశ్యములను చూచేవారికి చూపించి ఆశ్చర్యమును గలుగ జేయును. మన దేశంలో శంకరాచార్యులవారు అవతరించిన కాలమందు అనగా రెండువేల సంవత్సరములకు పూర్వము, ఇంద్రజాలవిద్య చాలా ఎక్కువగా ఉండేది. ఇంద్రజాల విద్యలోనే సూత్రప్రసారాది విద్యలని అనేకరకములుగా ఉండేవి. ఒకప్పుడు ఒక ఐంద్రజాలికుడు ఒక మహారాజు గారి దగ్గరకు వెళ్లి, అయ్యా ! సూత్రప్రసార ఐంద్రజాలికవిద్యను తమ సన్నిధిలో ప్రదర్శించెదను దయచేసి చూడండని కోరెను. అంతట రాజు గారు ఆ పట్టణంలో ప్రజలనందరిని ఈ ఇంద్రజాలమును చూచుటకు పిలిపించినారు. ఆ మహాసభలో ఐంద్రజాలికుడు రాజుగారి సన్నిధిలో నిలబడి, అయ్యా! ఇక ఇంద్రజాల విద్యను చూపిస్తున్నాను చూడండి అని వెంటనే మాయమయినాడు (కనిపించలేదు). ఆ వెంటనే ఆకాశము మీదికి అతిదీర్ఘమయిన నిచ్చనవలె ఇనుపతీగెలు వ్యాపించినవి. ఆ తీగలమీదుగా ఒక విచిత్రమైన పురుషుడు ఎక్కిపైకిపోయినాడు. ఆతరువాత మరి యొకడు అటులనే పైకెక్కెను. ఆతరువాత మరియెకడు ఎక్కిపోయినట్లు, ప్రేక్షకులకు కనిపిస్తూనే యున్నది. ఇదియే గాక ఆకాశమందు మహానగరము, ఉద్యానవనములు, అనేక రకములగు ఆటలు పాటలు మొదలగు అద్భుతదృశ్యములను సభలోని రాజు మొదలగువారు చూచి పరమాశ్చర్యమును పొందిరి. ఈ రీతిగా కొంత సేపు ఇంద్రజాల విద్యా సృష్టిని ప్రేక్షకులకు చూపించి, ఆ ఇంద్రజాలసృష్టిని ఉపసంహరించెను. ఆ ఇంద్రజాలము ఆగేటప్పటికి, ఇద్రజాలవిద్యా ప్రసారమునకు పూర్వమందు, ఐంద్రజాలికుడు రాజుగారిదగ్గర ఎక్కడైతే ఉన్నాడో అక్కడనే అందరికీ కనుపించెను. చూచువారందరు ఐంద్రజాలికుడు ఇక్కడ ఉండియే ఇంతదృశ్యమును చూపించెనని ఆశ్చర్యపడిరి.

ఐంద్రజాలికుడియందున్న ఇంద్రజాల విద్య ఆవరణశక్తి, విక్షేప శక్తియని రెండు శక్తులతో కూడియున్నది. ఆవరణశక్తితో ఐంద్రజాలికుడు ఆవరింపబడి కనిపించకుండా పోయినాడు. విక్షేపశక్తిచేత తన ఆత్మయందే అనేకరకములగు ఇంద్రజాల దృశ్యములను సృష్టించి మరల తనయందే ఉపసంహరించుకొనెను. అందుచేత ఐంద్రజాలిక ప్రపంచసృష్టి స్థితిలయములకు ఐంద్రజాలికుడే కారణమని ఆధారమని చెప్పవలయును. ఐంద్రజాలిక విద్య ఐంద్రజాలికుడి నుండి విడదీయుటకు అవకాశము లేదు. ఐంద్రజాలికుడికంటే అన్యము గాదనికూడా చెప్పవచ్చును. అటులనే సచ్చిదానందరూపమగు పరమాత్మ ఐంద్రజాలికుని వలె ఉన్నాడు. పరమాత్మయందలి మాయాశక్తి ఆవరణ విక్షేపశక్తులతో కూడి ఇంద్రజాలవిద్య వలెయున్నది. అందులోఅవరణశక్తితోపరమాత్మఅవరింపబడి గోచరించుటలేదు. అట్టి పరమాత్మయే విక్షేపశక్తి చేత ఆకాశాది సమస్త ప్రపంచమువలె, జీవులవలె గోచరించుచున్నాడు. కనుక ఈ ప్రపంచమంతయు మాయా సృష్టియనే శంకరభగవత్పాదులవారు చెప్పిరి.

ఇదియేగాక విద్యారణ్యులవారుకూడా వేదాంత పంచదశిలో చిత్రదీప ప్రకరణమందు

శ్లో|| ఏతస్మాత్కిమివేంద్రజాల మపరం యద్గర్భ వాసస్థితం

రేతశ్చేతతి హస్తమ స్తకపద ప్రోద్భూత నానాంకురం

పర్యాయేణ శిశుత్వ ¸°వన జరావేషై రనేకైర్వృతం

పశ్యత్యత్తిశృణోతి జిఘ్రతి తధా గచ్ఛ త్యధాగచ్ఛతి ||

శ్లో|| దేహ వద్వటధానాదౌ సువిచార్య విలోక్యతాం |

క్వధానా కుత్రవా వృక్షః తస్మాన్మాయేతి నిశ్చిను ||

అని మాయా వాదమునే చెప్పిరి. పురుషుడి యొక్క రేతస్సు స్త్రీగర్భమందు ప్రవేశించి శుక్ల శ్రోణితములు కలసి, యేవిధమైన శరీరాకారములేని స్థితిలో నుండి క్రమక్రమముగా కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖము, శిరస్సు మొదలగు ఆకారముతో నవమాసములు పూర్తి అయినతరువాత మాతృగర్భము నుండి పుట్టి, బాల్యావస్థ, కౌమారావస్థ, ¸°వనావస్థ, వార్థకావస్థ ఈ అవస్థలలో విశేషమైన మార్పును చెంది, చూచుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రాణించుట, మాటలాడుట, నడచుట మొదలగు జ్ఞానక్రియాచేష్టలను చేయుచున్నది.

గనుకనే భౌతిక పదార్థసారమునుండి బయలు దేరిన ఈ శరీరములు అచేతనములేగాని, చేతనములవలె సర్వవ్యవహారములను చేయుచున్నవి. మాటలాడుచు, చూచుచు వ్యవహరించుచున్న చేతనుడు, అచేతనమగు శరీరముకంటే వేరుగా కనిపిస్తున్నాడా అంటే, కనిపించుటలేదు. మట్టితో చేసిన బొమ్మలు కదులుతూ, మాట్లాడుతుంటే ఆశ్చర్యపడమా? అటులనే ప్రపంచమంతా భౌతిక దేహములు వ్యవహరించుట ఆశ్చర్యముకాదా? తండ్రి కుమారుని అబ్బాయీ అంటాడు. కుమారుని శరీరంలో ఒక వ్యక్తి ఉండి పలుకుతాడు, మాట్లాడుతాడు. అటులనే తండ్రి శరీరమందు నాయనా అని పిలిచిన పలుకుతాడు. మాట్లాడుతాడు. అటులనే భార్య భర్తనుగాని, భర్త భార్యనుగాని పిలిచినపుడు ఆయా శరీరములయందున్న చేతనములు పలుకుట, మాటలాడుట మొదలగు వ్యవహారములు జరుపుచున్నవి గాని, ఆ శరీరములకన్న వేరుగా ఆ వ్యవహరించు చేతనవ్యక్తులు కనిపించుట లేదు.

మరణకాలమందైనను శరీరమును విడిచిపెట్టి వెళ్ళునపుడు కూడా ఆత్మ పక్కన ఉన్నవారికి కనిపించటలేదు. కనుక ఈ లోకవ్యవహార మంతయు మాయామయమని చెప్పవలయును. విశ్వామిత్రమహర్షి ప్రత్యేకం సృష్టిచేసినట్లు గాథలు కలవు. ప్రత్యేకం స్వర్గమును సృష్టించినట్లు ఇంద్రాదులను సృష్టించినట్లు, భోగభూములను సృష్టించినట్లు రామాయణములోనే కథకలదు. విశ్వమిత్ర మహర్షి తనయొక్క తపోమహిమచే సంకల్ప మాత్రముచేతనే సృష్టించెనేకాని ఆ సృష్టికి ఇతర సాధనములు లేవు. అటులనే పరమేశ్వరుడు త్రిగుణాత్మకమైన తన మాయచేతనే తన ఆత్మనే, వివిధ ప్రపంచరూపముగా భాసింపచేసెనని, అటుల భాసింపచేయుటయే సృష్టియని గ్రహించవలయును.

ఇదియే మాయావాదమని గ్రహించవలయును. జగత్తంతయు అనగా జీవేశ్వర జగద్రూపమగు దృశ్యమంతయు అధిష్ఠానమగు సచ్చిదానంద రూపమయిన పరమాత్మయొక్కఅన్యధాభానమే, అనగా ప్రతి భాసయే, మరియొక విధముగా కన్పించుటయే. కాని పరమాత్మకంటే వేరుకాదని ముఖ్యముగా గ్రహించవలసిన విషయము.

ఇది మూడవ శ్లోకముయొక్క తాత్పర్యవివరణము సమాప్తమము.

అవతరణిక:

ప్రపంచములో విత్తనము భగ్నమైనపిమ్మటనే అంకురము పుట్టుచున్నది. మృత్పిండము యేస్థితిలో ఉన్నదో ఆ స్వరూపము నశించిన తరువాతనే కుండలు మొదలయిన కార్యములు పుట్టుచున్నవి. ప్రళయకాల మందు అంతా నశించిన తరువాత అంతయు శూన్యమే అగును కనుక ఆ శూన్యస్థితిలో నుండే ప్రపంచము పుట్టుచున్నది. అందుచేత అసత్తులోనుంచే సత్తు పుట్టును. అనగా అభావములోనుండియే ప్రపంచము పుట్టునుగాని సద్రూపమైన బ్రహ్మనుండి ప్రపంచము పుట్టుట నిర్యుక్తికమని, ఈ అసద్వాదమునే శ్రుతికూడా చెప్పుచున్నదని, ఆసద్వాదమును కొంత మంది ఆశంకింతురేమో యనే దృష్టితో దానికి సమాధానముగా ఈ శ్లోకమును శంకరభగవత్పాదులవారు వ్రాసిరి.

శ్లో|| యసై#్యవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్ధగం భాసతే

సాక్షాత్తత్వమసీతి వేదవచ సాయో బోధయత్యాశ్రితాన్‌

యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోవిధౌ

తసై#్మశ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||

ప్రతిపదార్థ నిరూపణము:-

యస్య=ఏ పరమాత్మయొక్క; సదాత్మకం=సద్రూపమైన; స్ఫురణమే=చైతన్య స్వరూపమే; అసత్కల్పార్ధగం-అసత్కల్పాః=అసత్కల్పములు అనగా స్వయముగా సత్యత్వములేని అనిర్వచనీయములైనవి, అవి ఆకాశాది భూతభౌతిక పదార్థములే, అట్టి కార్య భూతములగు పదార్థములను; గం=పొందినది, అనగా కారణమైన పరమాత్మ కార్యములగు ఆకాశాది పదార్థములయందు అనుగతమై; భాసతే=ప్రకాశించుచున్నది; యః=యేగురురూపమైన పరమేశ్వరుడు; ఆశ్రితాన్‌= యథావిధిగా గురు సమీపమునకు వచ్చి ఆశ్రయించిన శిష్యులను; తత్వ మసీతి వేదవచసా=జగత్కారణమైన సచ్చిదానందరూపమైన, అద్వితీయమైన బ్రహ్మవే నీవు కాని వేరుకావని; వేదవచసా= మహావాక్యముచేత; సాక్షాత్‌= అపరోక్షముగా తత్వమును; భోధయతి= బోధించుచున్నాడో; యత్సాక్షాత్కరణాత్‌= యే సచ్చిదానందరూపమగు బ్రహ్మయొక్క నేను బ్రహ్మను అనే సాక్షాత్కారమువలన; భవాంభోనిధౌ= సంసార సముద్రమందు; పునః= తిరిగి; ఆవృత్తిః= సంసారప్రాప్తి; నభ##వేత్‌= కాదో; తసై#్మ శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే= ఆ శ్రీ గురుమూర్తియైన శ్రీ దక్షిణామూర్తియగు పరమాత్మకు ఈ నమస్కారము.

తాత్పర్య వివరణము:-

లోకంలో ఒక అనుభవముకలదు. అది యేమనగా ఉపాదాన కారణము అన్ని కార్యములయందు అనుగతమై తెలియబడుచుండును. ఎటుల ననగా మట్టి- కుండలు, మూకుళ్ళు, ముంతలు మొదలగు వికారములయందు, మట్టికుండ, మట్టి మూకుడు, మట్టిముంత అని ఈ అనుభవములలో కార్యములందు అనుగతమై గోచరించుచున్నది. అటులనే బంగారు వికారములైన భూషనములయందు, ఉపాదాన కారణమగు బంగారము బంగారు గొలుసు, బంగారు ఉంగరము, బంగారు పాత్రయని గోచరించుచుండును, జగత్తుకు ఆసత్తే అనగా శూన్యమే ఉపాదన కారణమయ్యే యడల ''ఆకాశః అసన్‌'' అనగా ఆకాశము లేనది. ''వాయుః అసన్‌'' అనగా వాయువు లేనిది. ''తేజః అసత్‌'' అనగా తేజస్సు లేనిది. అని ఆసత్తు, అనే ఉపాదాన కారణము. ఆకాశాదికార్యములయందు అనుగతమై గోచరించవలసియుండును. అటుల గోచరించుటలేదు. ఎటుల గోచరించుచున్నదనగా ఆకాశః అస్తి అనగా ఆకాశమున్నది; వాయురస్తి అనగా వాయువు ఉన్నది. 'తేజఃఆస్తి' అనగా తేజస్సు ఉన్నది. 'జలమస్తి' అనగా జనలమున్నది. 'పృధివీ అస్తి' అనగా పృధివి ఉన్నది. 'ఆకాశంభాతి' 'వాయుర్భాతి' తేజఃభాతి, జలంభాతి, 'పృధివీభాతి' అనగా ఆకాశం ప్రకాశించుచున్నది. వాయువు ప్రకాశించుచున్నది.

ఈ రీతిగా సద్రూపమైన, చిద్రూపమైన అనగా జ్ఞానస్వరూపమైన ప్రపంచమునకు ఉపాదానభూతమైన పరబ్రహ్మతత్వము అనగా అధిష్ఠానము ఆరోపితమగు ఆకాశ వాయు తేజస్సు మొదలగు కార్యములయందు అస్తిఅని, భాతి అని ఈ ప్రకారము సద్రూపముగాను చిద్రూపముగాను ప్రతీతిలో గోచరించుచున్నది. అయితే కొన్ని పదార్థములయందు అస్తి అని, కొన్ని పదార్థములయందు భాతి అని, కొన్ని పదార్థములయందు ఆ వస్తువు నాకిష్టము, ఈ వస్తువు నాకిష్టము అని ఇష్టమనగా ఆనందతాదాత్మ్య సూచకము. అందుచేత పరమాత్మ సద్రూపముచేత చిద్రూపముచేత ఆనంద రూపముచేతను అస్తి, భాతి, ప్రియం అను సంస్కారముల ననుసరించి, యేయే పదార్థములయుందు అస్తి అనిగాని, భాతిఅనిగాని, ప్రియమనిగాని అనాదినుండి అనుభవములుండునో ఆ అనుభవముల వలన ఏర్పడిన సంస్కారములు కలవో ఆయా పదార్థములయందు అస్తి అని, భాతి అని, ప్రియమని ఆరోపమైన పదార్థములయొక్క అనుభవములు కలుగు చుండును.

కనుక అన్ని పదార్థములయందును అస్తి అనేగాని, భాతిఅనేగాని, ప్రియమని మాత్రమేగాని, ఎందుకు అనుభవము కలుగకూడదు అని ప్రశ్నించనవసరములేదు. వెనుకటి సంస్కారమునుబట్టియే ఈ భ్రమరూపమైన అనుభవములు కలుగుచుండును. అయితే సూక్ష్మముగా ఒక విషయమును గ్రహించవలయును. అధ్యాసయందు అధిష్ఠానము సామాన్య రూపముగా ఆరోపతాదాత్మ్యమును పొంది గోచరించుచుండును. అది ఎటులననగా శుక్తి రజత భ్రమలో చూడవలయును. అధిష్ఠానమునకు రెండు అంశములు అనగా రూపములు ఉండును. ఒకటి సామాన్యాంశ రెండు విశేషాంశ, ఇదంరజతం అనే భ్రమలో అధిష్ఠానమగు శుక్తియందు ఇదంత్వం అనగా ఇది అనేరూపము అధిష్ఠాన సామాన్యాంశ యనబడును. శుక్తిత్వము అనగా శుక్తి అనే స్వరూపము విశేషాంశ యనబడును. అధిష్ఠానము విశేషరూపముగా పూర్తిగా తెలియబడిన భ్రమ కలుగదు. అధిస్ఠానము సామాన్యరూపముగా కూడా తెలియబడని స్థితిలో భ్రమ కలుగదు.

ఎటులననగా దృష్టి పథమునకు బొత్తిగా కనిపించని వస్తువుయందు భ్రమ కలుగదు. బాగుగా ఫలానావస్తువని కనిపించినను భ్రమ కలుగదు. శుక్తి అని విశేషరూపముగా కనుపించినపుడు రజతం అనే భ్రమకలుగదు. ఇదం అనగా ఇదియని తెలియనపుడు కూడా వెండి అనే భ్రమ కలగదు. తాడు అని విశేషముగా తెలిసినపుడు సర్పమనే భ్రమ కలుగదు. ఇదియని సామాన్యముగా తెలియనపుడుకూడ సర్పమనే భ్రమ కలుగదు. కనుక అధిష్ఠానము పూర్తిగా తెలియబడకూడదు. సామాన్యముగా తెలియబడి యుండవలయును. అందుచేతనే అధిష్ఠాన సామాన్యజ్ఞానము అధ్యాసకు కారణమగును. కనుకనే ఇదం రజతం అని, అయం సర్పః అని అధిష్ఠాన సామాన్య స్వరూపముతో తాదాత్మ్యమును పొంది ఆరోపవిశేషమగు రజతము, సర్పము గోచరించుచున్నవి. అంతేగాని శుక్తి వెండియని, తాడు సర్పమని అధిష్ఠానవిశేషరూపముతో తాదాత్మ్యమును పొంది రజతభ్రమ, సర్పభ్రమ మొదలగు భ్రమలు కలుగుటలేదు.

ఈ అనుభవమును బట్టియే భ్రమకు కారణమగు అజ్ఞానము అధిష్ఠానవిశేష రూపమగు శుక్త్యంశను, రజ్వంశను అనగా తాడు అనే స్వరూపమును, ఆవరించునుగాని ఇదం అనగా ఇది అనే సామాన్యాంశను, అజ్ఞానము ఆవరించినదని అనుభవానుసారముగా అద్వైత సిద్ధాంతమును గ్రహించవలయును. ప్రకృతములో పరమాత్మయందు జీవత్మ జగద్విషయక భ్రమలు కలుగుటలో సచ్చిదానందరూపమగు పరమాత్మయొక్క నిర్విశేష చైన్యమగు సత్యజ్ఞానానందరూపమగు పరమాత్మయొక్క నిర్విశేష చైతన్యమగు సత్యజ్ఞానానందాదది పదలక్ష్యమగు పరమాత్మ స్వరూపము సాక్షాత్కరింపబడిన యడల భ్రమ కలుగదు. అట్టి స్వరూపము అజ్ఞానముచేత ఆవరింపబడియున్నది. సదంశ, చిదంశ ఆనందాంశయగు అధిష్ఠాన సామాన్య అంశ##లే భ్రమలలో గోచరించుచున్నవి. అందుచేతనే ఆకాశః అస్తి, వాయురస్తి, భాతి సన్‌ఘటః సన్‌పటః అనగా ఉన్నది ఘటము ఉన్నది, పటము ఉన్నది, ఇది నాకు ప్రియము. అహంకర్తా, భోక్తా ఇత్యాది భ్రమలు కలుగుచున్నవి. ఆకాశోస్తి అన్నపుడు అస్తి అని అధిష్ఠాన సామాన్యాంశ ఆకాశః అని ఆరోప విశేషాంశ. ఈవిధముగా భ్రమలయందు ఉపాదానమగు, అనగా అధిష్ఠానమగు పరమాత్మ స్వరూపము ఆకాశాతది కల్పిత వస్తువులయందు అనుగతమై గోచరించుచున్నది. గనుక పరమాత్మయే జగత్కారణముకాని శూన్యము జగత్కారణము కాదు, కనుక శూన్యవాదము నిర్యుక్తికము, ఈ విషయమంతయు 'యసై#్యవస్ఫురణం సదాత్మకససత్కల్పార్థగం భాసతే' అను శ్లోకభాగము వలన గ్రహించతగియున్నది. ''సాక్షాత్తత్వమసీతి వేదవచసా యోబోధ యత్యాశ్రితాన్‌'' దక్షిణా మూర్తి స్వామి తమ శిష్యులకు తత్వమసి అనే మహా వాక్యముచేత జీవబ్రహ్మైక్యమును బోధించిరి. జీవ బ్రహ్మైక్యము ఎట్లు కుదురునని విచారించవలయును. జీవుడనగా అంతఃకరణావచ్ఛిన్న చైతన్యము అనగా అంతఃకరణతో కూడుకున్న చైతన్యమని యర్థము, ఈశ్వరుడనగా మాయా వచ్ఛిన్న చైతన్యము అనగా మాయతో కూడుకున్న చైతన్యము. జీవుడు కించిజ్ఞుడు. అనగా కొద్దిజ్ఞానము కలవాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అనగా సర్వము తెలిసినవాడు. ఈశ్వరుడు జగజ్జన్మస్థితి లయకారణభూతుడు. జీవుడు జగత్కారణత్వము లేనివాడు. ఇంతతేడావున్న జీవేశ్వరులకు ఐక్యము ఎటుల సంభవించును. ఈ యనుభవమును బట్టి చూడగా జీవేశ్వరులు ఒకరికంటే ఒకరు అత్యంతము భిన్నులని స్పష్టముగా చెప్పవచ్చును. మహావాక్యము జనీవునకు సాక్షాత్పరమాత్మతో ఐక్యమునే బోధించుచున్నది. కనుక శ్రుతి చెప్పిన జీవబ్రహ్మైక్యమే యథార్థముగాని భ్రమరూపమైన మన అనుభవమువల్ల సిద్ధించుచున్న జీవబ్రహ్మ భేదము పరమార్థము కాదు. ఇదియే గాక భేదము రెండురకములుగా నున్నది. ఒకటి నై సర్గిక భేదము. రెండు ఔపాధిభేదము. నై సర్తికభేదమనగా స్వత సిద్ధముగా నున్న భేదము. ఎటులననగా గోవుకంటే అశ్వమువేరు. అశ్వము కంటే గోవు వేరు అని ఒక ఉపాధిసంబంధము లేకుండానే గోవుకు అశ్వమునకు భేదము అనుభవములోనున్నది కనుక ఈ భేదము నైసర్గిక భేదమని గ్రహించవలయును.

ఔషాధిక భేదమనగా అసలు వస్తువుకు భేదము లేకపోయినప్పటికి, ఉపాధులద్వారా ఏర్పడుభేదమే ఔపాధిక భేదము. అది యెటులనగా ఘటా కాశమునకును మఠాకాశమునకుగల భేదము. ఘటమును పగలగొట్టి మఠమును పగలగొట్టినపుడు ఆ ఘటములోని ఆకాశము, మఠములోని ఆకాశము మహాకాశస్వరూపముతో ఏకమగుచున్నవి. కనుక ఘటాకాశ మఠాకాశములకు గల భేదము ఔపాధికమగు భేదమేకాని నైసర్గిక భేదము కాదు. జీవేశ్వరులకుగల భేదము కూడా నైసర్గిక బేధముకాదు. మాయావిశిష్ట చైతన్యమగు ఈశ్వరుడు అంతఃకరణవిశిష్ట చైనత్యస్వరూపుడగు జీవుడు, ఉభయులు మాయాఅంతఃకరణలనే ఉపాధులను వదలిపెట్టినయడల చైతన్య స్వరూపముతో ఏకీభవింతురు. ఇట్టి ఔషాధిక భేదమును పురస్కరించుకొనియే శ్రుతిస్మృత్యాదుల యందు జీవేశ్వరులకు భేదమున్నటుల కనిపించు చున్నది కాని, ఆ భేదము పారమార్ధికముకాదు.

జీవేశ్వరులకు ఉపాధులయిన అంతఃకరణ మాయలు కూడా ఆరోపితములుగాని సత్యములు కావు. ఆరోపితము లనగా భ్రమవలన ఏర్పడినవి. అనగా మిధ్యాభూతములు. మిధ్యాభూతము లనగా యదార్థజ్ఞానముచే నశించునవి. అందువలననే మహావాక్యము, ఓ జీవ! త్వం = నీవు; తదసి సర్వజ్ఞుడవైన పరమేశ్వరుడ వగుచున్నావు, అని సర్వజ్ఞుడగు ఈశ్వరునితో ఐక్యమును బోధించుచున్నది. ఇట్టి ఐక్యము మాయా అంతఃకరణ అను కల్పిత ఉపాధి ప్రయుక్త భేదమున్నను విరుద్ధముకాదు. కనుక సాధకుడు మహావాక్యమునకు లక్ష్యమైన పరమాత్మయొక్క సాక్షాత్కారమును శ్రవణమనన నిధిధ్యాసనములవలన సంపాదించిన యడల అట్టి సాక్షాత్కారము వలన జీవత్వభ్రమకు ప్రపంచ భ్రమకు కారణమగు మూలాజ్ఞానము నశించును. మూలా జ్ఞానము నశించినయడల జీవత్వభ్రమ, ప్రపంచభ్రమ నశించును. భ్రమలు నశించగానే జీవుడు పరమాత్మ స్వరూపుడై అనగా సచ్చిదానంద స్వరూపుడై యుండును. ఇదియే మోక్షస్థితి. జీవుడు పరమాత్మ స్వరూపడు అయియుండే, అజ్ఞానముచేత నేను జీవుడనని భ్రమించెనుగాని జీవత్వము పరమార్ధికముగాదు.

ఘటాకాశమునకు మహాకాశ##మే పరమార్థము. ఘటాకాశము ఔపాధికము. కనుకనే ఘటాకాశము మహాకాశముకన్న వేరుకాదు. జలమందు గల సూర్యప్రతిబింబమునకు బింబమైన ఆకాశమందు కనిపించు సూర్యుడే పరమార్థము. జలమందలి సూర్యప్రతిబింబము ఔపాధికమే. అనగా జలము అనే ఉపాధివలన ఏర్పడిన ఔపాధిక స్వరూపమే. ఇట్టి ప్రతిబింబము, బింబమైన సూర్యునికంటే వేరుకాదు. అటులనే అంతఃకరణ ఉపాధిగాగల జీవచైతన్యము, అనగా అంతఃకరణ విశిష్టచైతన్యమనిగాని, అంతఃకరణ ప్రతిబింబిత చైతన్యమనిగాని అనవచ్చును. ఇట్టి జీవచైతన్యము బింబమైన ఉపాధిలేని పరమాత్మకంటే వేరుకాదు. ఇట్టి ఆత్మ సాక్షాత్కారమును పొందిన వ్యక్తి భ్రమ వలన ఏర్పడిన జీవత్వరహితుడై పరమాత్మ స్వరూపుడగును. మరల సంసారమును, జనన మరణములను పొందడు.

ఎటులననగా రాగిని బంగారము చేసిన తరువాత మరల ఆ బంగారమురాగి కాదు. చెట్టుయందు తొడిమపూడిన పండు మరల తొడిమకు అతుక్కొనదు. స్వప్నమందు స్వప్నపదార్థములు సత్యమని భ్రమించిన వ్యక్తి మెళుకువ వచ్చిన తరువాత మరల స్వప్నపదార్థములు సత్యమని భ్రమించడు. ఇట్టి అనాది సిద్ధమగు సంసారభ్రమను పోగొట్టు జ్ఞానమును అనుగ్రహించు, దక్షిణామూర్తికి నిత్యము నమస్కరించుచుండవలయునని తాత్పర్యము, ఇక్కడికి నాల్గవశ్లోక తాత్పర్య వివరణము సమాప్తము.

అవతరణిక :

అద్వైతసిద్ధాంతమందు, జగత్తుకు, ఆత్మసత్యత్వముచేత సత్యత్వము, ఆత్మ ప్రకాశముచేతనే ప్రకాశము గోచరించుచున్నవని చెప్పెదరు. కాని ఆత్మవలె జగత్తుకూడా స్వయముగా సత్తాప్రకాశలు కలదని చెప్పకూడదు. అటులైన ఆత్మవలె జగత్తుకు ఉత్పత్తినాశములు లేకపోవలసి వచ్చును. ఆత్మకు కారణములేనట్లు జగత్తునకు కూడా కారణము లేకపోవలసివచ్చును. ఆత్మ స్వయం ప్రకాశమానముగా జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలయం దున్నట్లు జగత్తుకూడా అవస్థాత్రయమందు స్వయంప్రకాశ మానముగా గోచరించవలసియుండును. అట్లుండుటలేదు. అందుచేత అధిష్ఠానమగు బ్రహ్మసత్తాప్రకాశములచేతనే ఆరోపితమగు ప్రపంచమునకు సత్తాప్రకాశములు కలుగుచున్నవని చెప్పవలయును. సత్తా ప్రకాశలనగా అస్తి, భాతియని గోచరించునవే.

అయితే మరియొక ప్రశ్న. పరమాత్మయందు ప్రపంచము కల్పితమయినయడల ఇతర కారణసంబంధము లేకుండానే ప్రతివస్తువు తయారై కనిపించవలయును. స్వప్రకాశమాన మయిన ఆత్మయందే కల్పింపబడుచున్నది గనుక. ప్రపంచమునకు అధిష్ఠానగు పరమాత్మ సంబంధం యెల్లపుడు వుండును గనుక. అందరికిని సర్వకాలములయందు ప్రపంచం ఏల గోచరించదు. ఈ విషయములో సమాధనం అధిష్ఠానమనగా ఆరోపితమునకు మూలమగు అజ్ఞానముచే నావరింపబడినది యని అర్థము. పరమాత్మ ప్రపంచమునకు మూలమగు అజ్ఞానముచేత ఆవరింపబడియున్నది.

ఆవరింపబడినందువలన ప్రపంచమును ప్రకాశింపచేయలేదని సమాధానం చెప్పవచ్చును. కాని అటులైన ఒకప్పుడు ఒక వస్తువు గోచరించును. ఒకప్పుడు గోచరించదు. ఈ విధముగా మనకు అనుభవమున్నది. ఇట్టి అనుభవము ఎటులకుదురును. (దీపముకంటే) వెలుతురుకంటే, చీకటిని పోగొట్టుసాధనం వేరే లేనట్లు జ్ఞానరూపమగు పరమాత్మకంటే అజ్ఞానమును పోగొట్టు సాధనం వేరులేదుకదా యని ప్రశ్నించవచ్చును గనుక ఇట్టి ప్రశ్నలకు సమాధానముగా యీ క్రింది శ్లోకమును రచించిరి.

శ్లో|| నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం,

జ్ఞానం యస్యతు చక్షురా కరణద్వారా బహిస్పందతే

జనామీతి తమేవ భాన్తమనుభాత్యేతత్సమ స్తంజగత్‌

తసై#్మ శ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||5||

ప్రతిపథార్థము.

నానాచ్ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం-నానాచ్ఛిద్ర= అనేక రంధ్రములతో కూడిన, ఘట=కుండయొక్క, ఉదర=లోపల, స్థిత=ఉన్నటువంటి, మహాదీప=పెద్దదీపముయొక్క, ప్రభా=వెలుతురువలె, భాస్వరం=ప్రకాశించుచున్న, యస్య=ఏపరమేశ్వరునియొక్క, జ్ఞానంతు= నవరంధ్రములతో కూడిన శరీరమందున్న అంతఃకరణయందు ప్రతిబింబించియున్న సాక్షిచైతన్యము, చక్షురాదికరణద్వారా= నేత్రములు శ్రోత్రములు మొదలగు ఇంద్రియములద్వారా, బహిః=బయటికి, స్పందతే=ఇంద్రియములకు విషయములకు సంబంధము కలుగగానే ఆ ఇంద్రియములద్వారా విషయదేశమునకు వెళ్ళుచున్నది. జానామీతి=నేను దీనిని తెలుసుకొనుచున్నానని, భాంతం=ఇతరాపెక్షలేకుండా విషయములను ప్రకాశింపచేయుచు స్వయముగా ప్రకాశించుచున్న, తమేవ=ఆ సాక్షిచైతన్యమునే, అను=అనుసరించి, ఏతత్‌=ఈ, సమస్తం=సమస్తమయిన, జగత్‌=ప్రపంచము, భాతి=ప్రకాశించుచున్నది. ఏ పరమేశ్వరుని యొక్క స్వరూపభూతమయిన జ్ఞానము ప్రకాశించుచున్నదో, తసై#్మ=ఆ, శ్రీగురుమూర్తయే=శ్రీ గురుమూర్తియైన, శ్రీ దక్షిణామూర్తయే= దక్షి ణామూర్తిస్వామికొరకు, ఇదం =ఈ, నమః=నమస్కారము.

తాత్పర్యవివరణము.

ముఖ్యముగా జ్ఞానము కలుగ ప్రక్రియను విచారించవలయును. పరమాత్మ జ్ఞానస్వరూపము గనుక, అట్టి జ్ఞానస్వరూపమయిన పరమాత్మయే సకల ప్రపంచమునకు అధిష్ఠానముగనుక. ఒక మట్టి బొమ్మయందు మట్టియను ఉపాదాన కారణము. ఆ బొమ్మలోపల, బైటకాళ్ళు, చేతులు మొదలగు అవయవములయందు నిండి ఆ బొమ్మరూపముగా నున్నట్లు ప్రపంచమంతయు ఆరోపితమయిన, అనగా వివర్తమయిన విగ్రహమను కొనండి. ఈ ప్రపంచమనే వివర్త విగ్రహంలో అధిష్ఠానరూపమయిన పరమాత్మ, లోపలను, బైట సర్వపదార్థములయందును నిండి సర్వప్రపంచ రూపముగా మనకు అతిచిత్రముగా గోచరించుచున్నది.

అసలు (వస్తువు) స్వరూపము గోచరించుటలేదు. గనుక అధిష్ఠాన చైతన్యరూపమయిన జ్ఞానము మనలోనే కాదు. బైటకూడా వున్నదని గ్రహించవలయును. అయితే శరీరంలోఅంతఃకరణ ఉండుటచే ఆయంతఃకరణయందు చైతన్యము ప్రతిబింబించియుండుటచే మనలోనే జ్ఞానము అనగా చైతన్యము ఉన్నది. బైట. జడపదార్థములయందు లేదని మనకు ఒక భ్రమ కలదుగాని చైతన్యము అధిష్ఠానమై సర్వత్ర ఉన్నదని శాస్త్రదృష్టితో గ్రహించవలయును.

జీవచైతన్యము శరీరము మొదలగు ఉపాధులయందే ఉన్నదిగాని జడపదార్థములయందు లేదని చెప్పవచ్చును. మనకు నేత్రములు మొదలగు ఇంద్రియములకు విషయసంయోగం కలిగినపుడు నేత్ర గోళక ద్వారా మన శరీరములో చేరిన హృదయ పుండరీకదేశమందున్న అంతఃకరణ, విషయములున్న ప్రదేశమునకు వెళ్ళును. అంతఃకరణతోపాటు అంతఃకరణయందు ప్రతిబింబించిన చైతన్యముగూడా విషయదేషశమునకు వెళ్ళును విషయములనగా, యేవస్తువులను చూచుచున్నామో ఆ వస్తువు లన్నమాట. (అనగా) ఘటాదివిషయములు కనిపిస్తున్నవి. ఆ విషయ ములయందు అధిష్ఠాన చైతన్యము ఉన్నదికదా. అంతఃకరణ వెళ్ళి తదా కారాకారితమగును. అనగా ఆ విషయమునిండ వెలుతురు వ్యాపించినట్లు వ్యాపించును.

ఆ సమయమందు మనలోనించి వెళ్ళిన అంతఃకరణయందు ప్రతి బింబించిన చైతన్యము అనగా జీవచైతన్యము విషయదేశమందలి అధిష్ఠాన చైతన్యము, ఘటము, అంతఃకరణ కలసినందువలన అన్నియు ఏకీభవించుచున్నవి ఆ సమయమందు ఘటాకారమగు అంతఃకరణ వృత్తి యందు (సాక్షి) చైతన్యము ప్రతిబింబించును. చైతన్యములు విషయదేశ మందు ఏకీభవించినందువలన అధిష్ఠాన చైతన్యము ప్రతిబింబించిన దన్నను పరవాలేదు. జీవచైతన్యము అనగా అంతఃకరణతో తాదాత్మ్యమునుపొంది అంతఃకరణ ధర్మములతో కూడియున్నచైతన్యముకూడా, విషయదేశమం దుండును.

అపుడు ఆ యంతఃకరణయొక్క ఘాటాకారవృత్తివలన ఆఘటమునకు అధిష్ఠానచైతన్యమందుగల అజ్ఞానావరణ నివర్తించును. ఆవరణ నివృత్తికాగానే అధిష్ఠాన చైతన్యముతో ఏకీభవించి వృత్తియందు ప్రతిబింబించిన (సాక్షి) చైతన్యముచేత ఆ ఘటము తెలియచేయబడుచున్నది.

దూరముగానున్న చంద్రమండలమునుగాని, సూర్యమండలమును గాని, నక్షత్రములనుగాని, ఇతరపదార్థములనుగాని మనము ఇంద్రియములతో చూచుచున్నామంటే ఇదేరీతిగా అంతదూరము అంతఃకరణ పోవునని, జీవుడుకూడా వెళ్ళునని, సాక్షిచైతన్యముకూడా, అనగా జీవసాక్షికూడా వెళ్ళునని, అంతఃకరణ శరీరములో నుండియే యడతెగకుండా సూర్యచంద్రమండలాదులలో ప్రవేశించి తదాకారాకారితమగునని, అచట మనలో నుండి వెళ్ళిన చైతన్యముకూడా యడతెగకుండా వెళ్ళి అచటి అధిష్ఠానచైతన్యముతో కలసి ఆ వృత్తి యందు ప్రతిబింబించునని, ఆ వృత్తియందు ప్రతిబింబించిన చైతన్యమగుజ్ఞానముచేతనే సూర్యచంద్రాదులుకూడా తెలియబడుచున్నారనియు తెలిసికొనవలయును.

లోకంలో స్వప్రకాశరూపులై చీకటిని పోగొట్టి ప్రపంచమును ప్రకాశింపచేయు సూర్యచంద్రులుకూడా తదాకారవృత్తి యందు ప్రతిబింబించిన ఆత్మచైతన్య ప్రకాశ##చేతనే ప్రకాశింపచేయబడుచున్నారు. కాని సూర్యచంద్రాదులచేత ఆత్మ ప్రకాశింపచేయబడుటలేదు. ఈ విషయమునే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్‌. అని భగవత్పాదులవారు. చెప్పిరి.

ఇక దృష్టాంతమును విమర్శింతము. అనేక చిల్లులుగల ఒక పాత్రలో పెద్దదీపము వెలుగుచున్నది. ఆ దీపము వెలుతురు ఆ చిల్లులద్వారా బైటికి వచ్చి దగ్గరనున్న వస్తువులను వ్యాపించును. ఆ చిల్లులద్వారా బైటికి వచ్చిన వెలుతురులో కొన్ని వస్తువులను చూడగలుగుచున్నాము. చీకటిలోనైనను పెద్ద చిల్లులలోనుండి బైటికి వచ్చిన వెలుతురు వల్ల ఆవెలుతురు వ్యాపించినంతవరకు చీకటి నశించును. ఆ చీకటి నశించినంతవరకున్న పదార్థములు ఆ వెలుతురులో కనిపించుచుండును. చిల్లిపాత్రలో నున్న పెద్ద దీపమే యడతెగకుండా చిల్లులద్వారా బైటికివచ్చినది అదియే ప్రకాశింపచేయుచున్నది. లోపల ఆ దీపము వెలుతురుకంటే బైటికి వ్యాపించిన వెలుతురు వేరుకాదు అని గ్రహించవలసియున్నది.

మరియొక విషయము: చిల్లిపాత్రలోనున్న అసలు దీపము కనిపించకపోయినను చిల్లుల - ద్వారా బైటికివచ్చిన వెలుతురు దీపమను మూలము లేనిది ఉండదు గనుక చిల్లులద్వారా బైటికివచ్చిన వెలుతురు మనకు గోచరించినను దీనినిబట్టి దీనికి మూలమగు పాత్రలోనున్న పెద్దదీపమున్నట్లు గుర్తించవలయును.

అటులనే మనశరీరము ఒక పాత్ర. నేత్రములు శ్రోత్రములు మొదలగు యింద్రియ గోళకములు, శరీరమునే పాత్రకు గల చిల్లులు, ఈ ఇంద్రియద్వారములనే చిల్లులలోనుండి శరీరములోపలనున్న జ్ఞానరూపమయిన మహాదీపము యొక్కప్రకాశ బైటికి వ్యాపించి సకలవిషయములను తెలియచేయుచున్నదని గమనింపవలయును. అయా విషయాకార వృత్తియందు ప్రతిబింబించిన చైతన్యమే విషయజ్ఞానము. అదియే బైటికి వ్యాపించిన వెలుతురువలె నున్న జ్ఞానము.

ఈ జ్ఞానమునుబట్టి మనకు ప్రత్యక్షముగా గోచరించకపోయినను లోపననున్న అఖండజ్యోతిరూపమయిన జ్ఞానరూపమయిన ఆత్మ, స్వయం ప్రకాశమానముగా నున్నదనియు, అట్టి ఆత్మప్రకాశ##చేతనే సకల విషయమునలను మనం తెలుసుకొనుచున్నామనియు. అట్టి దృక్కు అనే ఆత్మను దృశ్యముకంటే వేరుగా తెలిసికొని ముర్తులము కావలయుననియు ఇట్టి విజ్ఞానమునకు దక్షిణామూర్తి యనుగ్రహమే ప్రధానకారణమనియు తాత్పర్యము.

ఇట్లు అయిదవశ్లోకమునకు తాత్పర్యనిరూపణము సమాప్తము.

అవతరణిక:

ఒక ప్రశ్న. కనిపించే ప్రపంచమంతయు మిధ్యాయని , అనగా భ్రమయని, కనిపించని ఆత్మయే సత్యమని, కనిపించే శరీరము ఆత్మకాదని మన అనుభవములోనున్న ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణము మొదలగునవికూడా ఆత్మకాదనియు మనకు ఆగోచరమయిన ఆత్మ వేరుగా నున్నదనియు చెప్పుచున్నారు. అది చాలా అనుభవవిరుద్దము. ఎటులననగా , నేను కృశించితిని. నేను లావుగానున్నాను. నేను పొడవుగా నున్నాను. నేను పొట్టిగానున్నాను. నేను కూర్చున్నాను. అనుభవమునుబట్టి నేను అనునదే ఆత్మగనుక, లావుగానున్నది, సన్నముగా నున్నది, పొట్టిగానున్నది, పొడవుగానున్నదియు, శరీరమే గనుక నేననే శబ్దమును శరీరముందే వాడుచున్నాము గనుక శరీరమే ఆత్మయని చార్వాకులందరు.

వారిమతంలో ప్రత్యక్షమే ప్రమాణము. అనగా ఇంద్రియములకు గోచరించుననే వున్నవిగాని, గోచరించనివి లేవు. హేతువులతో కొన్ని ఊహించినను శబ్దములతో విన్నను ప్రత్యక్షానుకూలమయినపుడే అంగీరించతురు. అవి ప్రత్యక్షప్రమాణముగానే అంగీకరింతురు. పృధివీ, జలము, తేజస్సు, వాయువు నాలుగే భూతములు. ప్రత్యక్ష ప్రమాణముతో గ్రహింపబుడచున్నవి గనుక ఈ నాల్గింటినే అంగీకరిస్తారు. ఆకాశము భూతముకాదు, ఈ నాలుగుభూతములకలయిక వలన శరీరమందు తాంబూల ద్రవ్యములలో ఆ ద్రవ్యములను నవిలినపుడు యెరుపు మదనశక్తి పుట్టినట్లు జ్ఞానశక్తి పుట్టును. ఆ జ్ఞానశక్తి ఉన్నంతవరకు శరీరము పనిచేయును. తరువాత పడిపోవును. మరణమే మోక్షముకాని వేరులేదు. శరీరమే ఆత్మ గనుక, శరీరము పడిపోయినతరువాత జీవుడు లోకాంతరములకు వెళ్ళుట లేదు. చార్వాకమతంలో అర్థము, కామము, రెండే పురుషార్థములు. పరలోకములు లేవుదేవుడు లేడు. వేదశాస్త్రములు ప్రమాణములు కావు. అని నాస్తికులగు చార్వాకులు చెప్పెదరు.

అందులోనే కొందరు నేను చూచుచున్నాను. నేను వినుచున్నాను. నేను అస్వాదించుచున్నాను. అనే అనుభవమును బట్టి నేను అనే శబ్దమును ఇంద్రియములందే వాడుచున్నాము గనుక, ఇంద్రియములే ఆత్మ యని అందురు.

మరికొందరు. నేత్రములు మొదలగు ఇంద్రియములు లోపించినను బ్రతుకుచున్నారు గనుకనను, నాకు ఆకలిగానున్నది, నాకు దప్పికగానున్నదని ప్రాణధర్మములగు ఆకలి దప్పికలను నా అనే ఆత్మయం దున్నటుల వ్యవహరించుటను బట్టియు ప్రాణమే ఆత్మయని అంటున్నారు.

మరికొందరు. ప్రాణము వాయురూపముగనుక, జడము. అట్టి జడమగు ప్రాణమునకు సుఖదుఃఖాదు లనుభవించుట అను భోక్తృత్వము సంభవించడు గనుక మనస్సునే చేతనము ఆత్మయని నిరూపించుచున్నారు.

నా మనస్సు యని ఆత్మను, మనస్సును వేరుగా వ్యవహరించు చున్నందువలన క్షణికమగు విజ్ఞానమే ఆత్మయని, బుద్ధుని యొక్క నలుగురు శిష్యులలో యోగాచారుడను శిష్యుడు చెప్పుచున్నాడు.

''నేను నేను అని అనుభవములోనున్నది ఆలయ విజ్ఞానం. దీనినే ఆత్మయందురు. ఇది ఇది యని వ్యవహరింపబడుచునది ప్రవృత్తి విజ్ఞానం. మొత్తం మీద అంతయు విజ్ఞానస్వరూపమే. దీపజ్వాల ప్రతిక్షణం ఎటుల మారనో మేఘము మెరుపులు ప్రతిక్షణం మార్పును ఎట్లు చెందుచున్నవో అట్లే విజ్ఞానము మార్పుచెందును. ఇట్టి క్షణిక విజ్ఞానమందు స్థాయిత్వ బుద్ధి వలన దుఃఖము కలుగుచున్నది. క్షణికత్వ విజ్ఞానము వలన ముక్తి కలుగునని ఈ విధంగా బైద్ధమత రీత్యా సాదనసంపత్తిని సంపాదించిన యడల కృతార్థులగురదురని యోగాచారులందురు.

అయితే క్షణికమగు విజ్ఞానమునకు నిన్న ఒకపని ప్రారంభించితిని. ఈ రోజు దానిని నేనే పూర్తిచేయుచున్నాను. అని ఆత్మస్థాయిగానున్నట్లు కలుగుచున్న అనుభవమునుబట్టి ఆత్మత్వము సంభవించదు. సుషుప్త్యవస్థయందు యే విజ్ఞానమము వుండదు గనుక ఆ సమయముందు శూన్యముగా నుండును గనుక శూన్యమే ఆత్మయని అంతయు శూన్యమే నని అనగా ఏదీలేదని బుద్ధుని శిష్యులలో నొకడైన మాధ్యమికుడను బౌద్ధుడు చెప్పెను.

వీరందరు ఆయా యుక్తులను కొన్ని వచనములను వారివారి మత ములకు అనుకూలముగా ఉదహరించుచు మామతమే మోక్షసాధనమని చెప్పుచున్నారు.

అందువలనకొందరు వేదశాస్త్ర ఇతిహాస పురాణములకు విరుద్ధ మగు ఆ మతములను ఆశ్రయించి మోక్షమార్గమునకు దూరమై జీవితమును వ్యర్థము చేసికొని నరకముల పాలగుదరని దయతో జీవులను వుద్ధరించు టకై శంకర భగవత్పాదులవారు ఆ మతములను నిరాకరించుటకై స్వమతమును ప్రదర్శించుటకై ఈ శ్లోకమును ఉదహరించిరి.

శ్లో|| దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాంబుద్ధించశూన్యంవిదుః

స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః

మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణ

తసై#్మ శ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||

ప్రతిపదార్థ నిరూపణము:-

దేహం=కాళ్ళు, చేతులు, శిరస్సు మొదలగు అవయవములతో కూడిన స్థూలశరీరమును; ప్రాణం=ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములను పేరుతో వ్యవహరింపబడుచు, శరీరముతోనుండి, ముక్కులోనుండి, బైటికి లోపలికి సంచరించుచున్న ప్రాణవాయువును; ఇంద్రియాణ్యపి=ఆయా స్థానములయందుండి రూపాదులను గ్రహించు, నేత్రములు మొదలగు ఇంద్రియములను; చలాం బుద్ధించ=యల్లప్పుడు పుట్టుచు నశించు చున్న క్షణికమగు బుద్ధిని; శూన్యం=అభావమును; స్త్రీ బాలాంధ జడోపమాస్తు= స్త్రీలు , బాలురు, ననగా పిల్లలు, అంధులు=గుడ్డివాళ్లు జడులు=జడబుద్ధులు; లేక పిశాచగ్రస్తులవలె, వివేకజ్ఞానము లేనివారు, భ్రాంతాః=ఒక విధముగా నున్న తత్వమును మరియొక విధముగా తెలిసికొనినవారై; భృశంవాదినః=గట్టిగా ఇతరులకు బోధించుచున్నవారై, అహమితి=శరీ రమే నేనని, ఇంద్రియములే నును అని, ప్రాణమే నేనని, విదుః = తెలిసికొనుచున్నారు.

మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహసంహారిణ||

మాయాశక్తి=సత్వరస్తమోగుణాత్మకమైన పరులను భ్రమింపచేయు మాయాశక్తి యొక్క; విలాస=పరిణామమగు భాగముచేత, కల్పిత=కల్పింపబడిన , మహావ్యామోహ=అనాదియైన అనంతమై పరిమతిలేని, దేహేంద్రియాదులే ఆత్మయనే గొప్పభ్రమను; సంహారిణ=నశింపచేయు; తసై#్మ=ఆ; శ్రీగురుమూర్తియే=శ్రీ గురుమూర్తియైన; శ్రీ దక్షిణామూర్తయే=శ్రీదక్షిణామూర్తిస్వామి కొరకు; ఇదం నమః=ఈ నమస్కారము

తాత్పర్యవివరణము:

శ్లో|| ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా|

పాపోపహత బుద్ధీనాం తద్వార్తాపి నరోచ తే||

అని ప్రమాణవచనమున్నది. అనగా పూర్వజన్మలయందుగాని, ఈ జన్మయందుగాని, అతిభక్తితో, భగవదర్పణబుద్ధితో శాస్తోక్తకర్మలను ఆచరించినవారికే ఈశ్వరానుగ్రహము కలుగును. అట్టి ఈశ్వరానుగ్రహము కలవారికే అద్వైతశాస్త్రమందు ఆదరము శ్రద్ధ కలుగును. అట్టి శ్రద్ద కలిగినపుడే శాస్త్రోక్తప్రకారము గా శ్రవణ మనములను చేయుదురు. నిది ధ్యానమును కూడా చేయుదురు. అట్టివారికే పరమాత్మ సాక్షాత్కారము కలుగును. అట్టి సాక్షాత్కారమువలననే మూలాజ్ఞానము. దానివలన ఏర్పడిన దేహేంద్రియములయందు నేను అను భ్రమ మొదలగు సర్వభ్రమలు నశించును.

అపుడే ముక్తుడగును. ఈస్థితిని పొందవలెనంటే ఈశ్వరానుగ్రహమే ప్రధానకారణం కాని పాపాముచేసినవారికి ఈశ్వరానుగ్రహం కలుగదు. ఈశ్వరానుగ్రహం లేనిది శాస్త్రమందు శ్రద్ధకలుగదు. అందుచేతనే పరమార్థమును తెలుసుకొనలేక శరీరం, ఇంద్రియములను, ప్రాణం మొదలగు భౌతికమగు నశించుపదార్థములనే ఆత్మయని అభిమాన నిశ్చయము కలవారై అనేక మందిని శిష్యులను సంపాదించి ఇట్టి ప్రమాణవిరుద్ధమగు అనుభవమునే బోధించుచు వారు పాడగుచు. ఇతరులను కూడా పాడుచేయుదురు.

అగ్ని యందు దహింపచేసే శక్తియున్నటుల, విత్తములయందు మొక్కలను పుట్టించే శక్తియున్నటుల మణి, మంత్ర, ఓషధులయందు. ఇతర కార్యములను ప్రతిబంధించే శక్తియున్నటుల సచ్చిదానందరూపమగు పరమాత్మయందు సత్వరజస్తమోగుణములతో కూడిన మాయాశక్తి ఆశ్రాయించియుండును. అగ్నికంటే దహింపచేసే శక్తి, విడదీయు టకు వీలులేదు గనుక వేరుకాదు. అటులనే మాయాశక్తి పరమాత్మకంటే వేరుకాదు. అట్టి మాయాకూడా అనాదియైన అరోపమే గనుకను అదిష్ఠానమగు పరమాత్మకంటే వేరుకాదని పరమార్థము.

వ్యవహారదశయందు అనగా అజ్ఞానదశయందు మాయాశక్తియుక్తమగు పరమేశ్వరుని ఆరాధించవలసినదే. ఈశ్వరానుగ్రహమును పొందవలసినదే పరమాత్మ సాక్షాత్కారమును పొందిన తరువాత అజ్ఞానమువలన ఏర్పడిన జీవత్వము, ఈశ్వరత్వము కూడా అజ్ఞానముతో సహా నశించును గనుక, నిర్గుణమగు స్వప్రకాశానందస్వరూపమగు పరమాత్మే మిగులును. ఇట్టి మహా పరమార్థమును తెలిసికొనుటకు ఈశ్వరారాధన చేసి పెద్దలను సేవించి; నిష్కామకర్మానుష్ఠానముచేసి, ఈశ్వరానుగ్రహమును సంపాదించవలయును.

ఆధ్యాత్మికదృష్ఠి మనుష్యజన్మలో చాలా శ్రద్ధచే సాధించవలసిన విషయం. ఆధ్యాత్మిక విద్య చాలా కష్టము గనుక సులభముగా అందరికి అర్థముగుటకు వ్రాసిన విషయములనే కొన్ని విశేషములతో మరల వ్రాసితిని. ఇట్లు ఆరవశ్లోక తాత్పర్య వివరణం సమాప్తం.

అవతరణిక:

స్వప్నావస్థయందు కళ్ళుమూసుకొని ప్రపంచమును మరచి నిద్ర పోవుచున్న సమయములో అనేక పదార్థములు, చిత్రవిచిత్రములగు అనేక విషయములు కనిపించుచున్నవి. అవి యన్నియు అదిష్ఠానములేనిది గోచరించవు గనుక ఆత్మయనే అదిష్ఠానమందు కల్పితమై కనిపించుచున్నవి. అటులనే జాగ్రదవస్థయందు కూడా పరమాత్మయందే సకల ప్రపంచం కల్పించబడినదియు అట్టి ఆత్మయే జాగ్రదవస్థయందు, స్వప్నావస్థయందును దృశ్యములను చూచున్నాడనియు అద్వైతులు చెప్పెదరు కదా.

జాగ్రదవస్థయందు, స్వప్నావస్థయందును చూడబడే ప్రపంచం, చూచే ఆత్మ ఉన్నవని శూన్యముకాదని చెప్పుట కవకాశమున్నది. కాని సుషుప్త్యవస్థయందు అనగా గాఢనిద్రయందు ఏమియు కనిపించుటలేదు. వినిపించుటలేదు. ఆత్మకూడా వేరుగా గోచించుటలేదు కనుక ఆ సమయమందు శూన్యమేకాని ఏమియు లేదు. అందుచేత శూన్యమే ఆత్మయని బౌద్ధులు చేయు ప్రశ్నకు సమాధానముగా ఈ క్రిందిశ్లోకమును ఆచార్యస్వాములువారు రచించిరి.

శ్లో|| రాహుగ్రస్తదివాక రేందు సదృశోమాయాసమాచ్ఛాదనా

త్సన్మాత్రఃకరణోపసంహారణతో యో7భూత్సుషు ప్తఃపుమాన్‌

ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తసై#్మశ్రీ గురుమూర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే||2

ప్రతిపదార్థము:-

యః=యే; పుమాన్‌ (అనృత జడమగు ప్రపంచముకంటే విలక్షణమగు) పరమేశ్వరుడు; కరణో పసంహరణతః=రూపాది విషయజ్ఞానములకు కారణమగు నేత్రములు మొదలగు ఇంద్రియములయొక్క ఉపసంహారమువలన అనగా ఇంద్రియములు పనిచేయకుండా ఆగినందువలన; సన్మాత్రః=ఏవిధమైన భేదములేకండా సచ్చిదానందరూపుడుగా నుండి, సుషుప్తః=సుషుప్త్యవస్థను పొందినవాడు; అభూత్‌=ఆయెను; ముక్తుని కంటే; సుషుప్త్యవస్థయందున్న ఆత్మకు తేడా ఏమనగా; మాయా సమాచ్ఛాదనాత్‌=మాయా అనాది అయిన అజ్ఞానముచేత; సమాచ్ఛాదనాత్‌=అవరణ వలన, అందువలన సన్మాత్రుడయి యున్నాడు.

ఈ విషయములో దృషాంతము ''రాహుగ్రస్త దివాకరేందు సదృశః '' రాహు= రాహువుచేత; గ్రస్త= గ్రసింపబడిన (ఆవరింపబడిన); దివాకరేందు-దివాకర=సూర్యునితో ఇందు చంద్రునితో ; సదృశ్యః=సమానుడైః సుషుప్తిని పొందియుండెను. గ్రహణము పట్టినప్పుడుకూడా సూర్యచంద్రులున్నారు. సూర్యచంద్రు లున్నారు. సుషుప్త్యవస్థయందు ఆత్మ వుండుటలో ప్రమాణమేమనా- ''ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే''- యః=సుషుప్తిసమయమందు; సన్మాతృడుగా నున్న సత్మ; ప్రభోద సమయే=మెళుకువవచ్చిన సమయమందు; ప్రత్యభిజ్ఞాయతే=ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడు; ఎటులగనగా ప్రాగస్వాప్సమితి, యే=నేను, ఇంతకు ముందు సుషుప్త్యవస్థయందు సుఖముగా నిద్రపోతినో; ఆ నేనే ఇపుడు మేలుకొనుచున్నాను. అని ప్రత్యభిజ్ఞను పొందుచున్నాడు తసై#్మ=ఆ శ్రీగురుమూర్తయే= గురుమూర్తి అయిన, శ్రీ దక్షిణామూర్తయే =దక్షిణామూర్తిస్వామికొరకు; ఇదం= ఈ, నమః= నమస్కారము.

తాత్పర్య వివరణము||

జాగ్రదవస్థయని, స్వప్నావస్థయని, సుషుప్త్యవస్థయని జీవునకు మూడు అవస్థలు కలవు. బాహ్యేంద్రియములతో జ్ఞానము కలిగే అవస్థ జాగ్రదవస్థ, అనగా బైటిఇంద్రియములతో ప్రపంచవిషయములను తెలుసుకొను సమయము, నిద్రాసమయమునందు ఇంద్రియములు పనిచేయవు. ఇంద్రియములు పనిచేయకపోయినను, అంతరాత్మయందు మనస్సుయొక్క పరిణాములవలన ఏర్పడు స్వప్నపదార్థములను తెలుసుకున్నే సమయముస్వప్నావస్థ. జ్ఞానేంద్రియములు మనస్సుకూడా పనిచేయక, అజ్ఞానమందు అంతయు లీనమయి అవిద్యావృత్తియందు ప్రతిఫలించిన ఆనందమును ఆవిద్యాకారావిద్యావృత్తియను అజ్ఞానానుభవమును పొందు అవస్థ, సుషుప్త్యవస్థ.

ఈ మూడు అవస్థలయందును ఆత్మ అనుగతమై, నేను జాగ్రద్దశయందు ఆయా విషయములను చూచితిని, స్వప్నదశయందు మంచి ఆశ్చర్యకరమగు దృశ్యములను చూచితిని. సుషుప్త్యవస్థయందు ఏమి తెలియదు. సుఖముగా నిద్రించితినని జాగ్రద్దశయందు ఈనుకొనుచున్నాడు. జాగ్రద్దశయందు స్వప్నము, స్వప్నదశయందు జాగ్రద్దశ, సుషుప్త్యవస్థయందు ఈ రెండును, అనుగతమై గోచరించకపోయినప్పటికిని తెలుసుకొను ఆత్మ ఒకే వ్యక్తి మూడు అవస్థలయందును స్పష్టముగానున్నట్లు సర్వజనులకును అనుభవమున్నది. అందువలన సుషుప్త్యవస్థయందు కూడా ఆనందరూపుడయిన అత్మయున్నది.

ఏమి తెలియలేదన్నాడు గనుక ఆజ్ఞానముకూడా ఉన్నది. గనుక సుషుప్త్యవస్థయందు ఏమియు లేదు. శూన్యమేయని, శూన్యమే ఆత్మయని చెప్పుటకు అవకాశములేదు. శూన్యమని చెప్పినను శూన్యమును గుర్తించే జ్ఞానమున్నట్లే కదా. జ్ఞానమే ఆత్మజ్ఞానముంటే ఆత్మ వున్నదనియే చెప్పవలయును. ఇదియేగాక బంగారులోనుండి తయారయిన భూషణములు బంగారురూపముగానే యుండును. రాగినుండి తయారయిన పాత్రలు రాగి పాత్రలుగానే కనిపించుచున్నవి. వికారములన్నియు ప్రకృతికి సజాతీయములుగానున్నవి. గనుక శూన్యములోనుండి ప్రపంచం పుట్టినయడల అంతయు శూన్యముగా నుండవలసి వచ్చును. ప్రపంచమంతయు సత్యముగా కనిపించుచున్నది. అంతా శూన్యమని చెప్పినపుడే అంతా శూన్యమని గుర్తించి చెప్పువాడున్నాడు కదా వాడే ఆత్మ, అట్టి ఆత్మ శూన్యమని చెప్పుట యుక్తిలేని మాట గనుక శూన్యవాదమును భోదించు బౌద్ధమతము ప్రమాణ విరుద్ధమని, యుక్తివిరుద్ధమని వదిలివేయవలయును. గ్రహించతగినది కాదు. ఇట్లు ఏడవశ్లోక తాత్పర్యవివరణము సమాప్తము.

అవతరణిక.

ముంజ గడ్డిలోనుండి వెన్నును విడదీసినట్లు ఆరోపితములగు శరీరేంద్రియములకంటే ఆత్మను వేరుజేసి బోధించుటకును పరమాత్మైక్యాను భవము గుర్వనుగ్రహమువలన, ఈశ్వరానుగ్రహమువలనను సంపాదించవలయును. అనే విషయమును తెలియజేయుటకును, పూర్వశ్లోకమందు ప్రాగస్వాప్సమితి ప్రబోధనసమయే యః ప్రత్యభిజ్ఞానయతే'' అని చెప్పిరి. ప్రత్యభిజ్ఞవలన అనగా సుషుప్త్యవస్థయందు నిద్రించిన నేనే మేలుకొను చున్నాను. అను అనుభవమువలన ఆత్మ సర్వావస్థలయందు స్థాయిగానున్నటుల ఎట్లు తెలిసికొనవలయును. అనేప్రశ్నకు సమాధానం చెప్పుటకు ఈశ్లోకమును వ్రాసిరి.

శ్లో|| బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి|

వ్యావృత్తా స్వనువర్త మానమహమిత్యంత స్ఫురంతం సదా|

స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం, యోభద్రయాముద్రయా|

తసై#్మశ్రీ గురుమూర్తయే నమఇదంశ్రీ దక్షిణామూర్తయే||8||

ప్రతిపదార్థము:-

బాల్యాదిషు =బాల్యము, కౌమారము, ¸°వనము, ముసలితనము మున్నగు స్వరూపముగానున్న; తథా= అట్లే; జాగ్రదాదిష్వపి =జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ; జన్మ జరామరణాది రూపముగానున్న; సర్వాసు= సమస్తమయిన; అవస్థాసు= నేత్రములతో చూచుట, చెవులతో వినుట మొదలగు భిన్నభిన్న జ్ఞానములు కలిగే అవస్థలయందును - అనగా ఆయా దశలయందుకూడా; వ్యావృత్తాసు =పరస్పరం వేరుగానున్న అవస్థలయందు; అనువర్తమానం= అనుగతముగా వుంటున్న, సదా =యల్లపుడు; అంతః= లోపల; అహమితి =నేనని, స్పరంతం =భాసించుచున్న అనగా తెలియుచున్న ప్రత్యగాత్మను; యః= ఏ పరమేశ్వరుడు; స్వాత్మానం =సచ్చిదానందస్వరూమయిన, తన ఆత్మస్వరూపముగా, భద్రయా= శుభరూపమయిన (మంగళప్రదమయిన) ముద్రయా= జ్ఞానముద్రతో, భజతాం= భక్తులకు; ప్రకటీకరోతి =తెలియజేయుచున్నాడో అనగా భక్తులకువారిలో నేను నేను అని గోచరించుచున్న ఆత్మను , కర్తృత్వాది ధర్మరహితమైన సచ్చిదానందరూపమయిన పరమాత్మకంటే అభిన్నముగా ఏపరమేశ్వరుడు బోధించుచున్నాడో; తసై#్మ= ఆ ; శ్రీగురుమూర్తయే = శ్రీగురుమూర్తి రూపమయిన; శ్రీ =దక్షిణామూర్తియే దక్షిణామూర్తి స్వామికొరకు, ఇదం =ఈ; నమః= నమస్కారములు.

తాత్పర్యవివరణము.

ఒకపుష్పమాల ఉన్నది. ఆ మాలయందు వందల పుష్పములున్నవి. ఆ పుష్పములు పరస్పరం ఒక పువ్వుకంటే మరొకపువ్వువేరు. అయినను దారం అన్ని పువ్వులలో గుచ్చబడి అన్ని పువ్వులయందును ఉన్నది. అందువలన పరస్పరం వేరువేయిన పుష్పములకంటే అన్ని పువ్వులలో అనుగతమైన దారము వేరుగా నున్నదని అనుభవసిద్ధమే.

అటులనే మరీ బాల్యావస్థకంటే కౌమరావస్థవేరు, కౌమారావస్థకంటే ¸°వనావస్థవేరు,. ¸°వనావస్థకంటే వార్థకావస్థ వేరు. అట్లే జాగ్రదవస్థకంటే స్వప్నావస్థవేరు, స్వప్నావస్థకంటే సుషుప్త్యవస్థ వేరు, అట్లే మూర్ఛావస్థవేరు. మరణావస్థవేరు, చూచే సమయముకంటే వినే సమయము వేరు, అస్వాదించే సమయమువేరు, ఈ దశలు పుష్పములవలె ఒకదశకంటే మరియొకదశ వేరు. అట్లు అన్ని దశలు సరస్పరం వేరువేరుగా నున్నవి.

అయినను బాల్యదశలో నా తల్లిదండ్రులు నన్ను ఆడించిరి. కౌమర దశయందు ఆ నన్నే చదివించిరి. ఆ నేనే ¸°వనావస్థయందు సర్వభోగములను అనుభవించితిని. ఆ నేనే ముసలితనమందు కొడుకులచేత, మనుములచేత, సేవచేయుంచుకుంటిని. నేనే జాగ్రద్దశను, స్వప్నదశను, సుషుప్తిని అనుభవించుచున్నాను. నేనే చూచుచుంటిని, ఆ నేనే వినుచుంటిని అని, పువ్వులలో దారమువలె అన్ని దశలయందు ఒకే ఆత్మ ''నేనే నేనే'' యని అనుగతమై గోచరించుచున్నాడు. అట్టి అనుగతమైన ఆత్మ అన్ని దశలకంటే ఆ దశలతో కూడిన శరీరేంద్రియములకంటే వేరుగా నున్నట్లు గ్రహించవలయును.

ఇట్టి ఆత్మ శరీరేంద్రియములయందు బుద్ధి ధర్మములగు కర్తృత్వభోక్తత్వాదులతో బుద్ధివృత్తిలో గోచరించుచుండును. పూర్వపుణ్యవిశేషముచేత అంతఃకరణశుద్ధికలవారై, గురుసేవచేసి, ఈశ్వరారాధన చేసి, పరమపవిత్రులై, తమ సమీపమునకు పరమభక్తులై వచ్చినవారికి, తత్వబోధచేయుటకుగాను, అవతరించిన దక్షిణామూర్తి స్వామివారు మౌనముగా నుండి బొటనవ్రేలు, చూపుడువ్రేలు కలిపిన జ్ఞానముద్రతో మీలో నేను నేను అని గోచరించు ఆత్మ, సచ్చిదానందస్వరూపమగు నాస్వరూపమే నని జీవబ్రహ్మైక్యమును బోధించిరి. దక్షిణామూర్తి స్వామివారి యనుగ్రహమువలన ఇట్టి జీవబ్రహ్మైక్యసాక్షాత్కారమునుపొంది ముక్తులు కావలయునని తాత్పర్యము. తాత్పర్య వివరణము సమాప్తము.

అవతరణిక:

అద్వైతులు అంతయు పరమాత్మయేగాని పరమాత్మకంటే వేరైన వస్తువు ఏమీ లేదని చెప్పెదరు. అయితే పరిపాలించే రాజున్నట్లు పరిపాలింపబడే ప్రజలు దేశమున్నట్లు మనం అనేకపనులు చేసుకొనుచున్నట్లును మనం చూస్తున్నాముకదా! అద్వైత సిద్ధాంతప్రకారం ఆత్మకంటే వేరు ఏమియు లేనపుడు బంధమునుపొంది సంసార దుఃఖమును అనుభవించే వాడు లేడుకదా! అసలు బంధమే లేదుకదా! అయినపుడు బంధనివృత్తి కొరకు ఎవరికి ఎవరు జ్ఞానోపదేశం చేయవలయును. జ్ఞానంకలవానికే కదా మోక్షం, ఆ జ్ఞానం కలుగుటకు ఆధ్యాత్మిక శాస్త్రోపదేశం కావలయును. కదా! శాస్త్రోపదేశం చేయుటకు గురువు అవసరంకదా! పరమాత్మ కంటే వేరుగా ఏమిలేని పక్షంలో శాస్త్రంలేదు. గురువు లేడు ఉపదేశం లేదు. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. ఏమీలేదుకదా! ఏమీ లేనపుడు శిష్యులకు , గురువు శాస్త్రమునుపదేశించి జ్ఞానమును కలుగజేయుట మొదలగు సంప్రదాయము ఎట్లు కుదురును?

ఇదేగాక లోకవ్యవహారములు ఎట్లు కుదురును. అను ప్రశ్నకు సమాధానము గా అనాది అయిన, అనిర్వచనీయమయిన పరమాత్మయందు కల్పితమయిన మాయవలననే, అనగా అజ్ఞానమున్నంతవరకు జీవత్వాభి మాన మున్నంతవరకు, ఆత్మసాక్షాత్కారము కలిగేంతవరకు, సర్వవ్యవహారములు ఉండునని సూచించుచు ఈ దక్షిణామూర్తిశ్లోకములలో వెనుక చెప్పిన శ్లోకముల అర్థమును సంగ్రహముగా ప్రతిపాదించుటకు ఈ శ్లోకమును వ్రాసిరి,

శ్లో || విశ్వం పశ్యతి కార్యకారణ తయాస్వ స్వామిసంబంధత

శ్శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః|

స్వప్నె జాగ్రతివా యఏష పురుషోమాయా పరిభ్రామితః

తసై#్మశ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||9

ప్రతిపదార్థ నిరూపణము.

యః =ఏ ఉపనిషత్తులయందు ప్రసిద్థమయిన, పురుషః= పరిపూర్ణమయిన పరమాత్మ; మాయాపరిభ్రామితః= మాయా తనకు ఉపాధిభూతముగానున్న సత్వరజస్తమోగుణాత్మకమయిన, ఆవరణవిక్షేపశక్తితోకూడిన శరీరేంద్రియరూపముగా పరిణమించిన , తను ప్రవేశించిన (ఆవిద్యారూపమగు) మాయాశక్తిచేత, పరిభ్రామితః =భ్రమను పొందించబడినవాడై, ఏషః=సర్వులకు ప్రత్యక్షముగా నున్న జీవుడై. కర్తృత్వ భోక్తృత్వాది సంసారమును పొందినవాడై; విశ్వం= ప్రపంచమును; భేదతః= అనేకభేదములతో, అనేక విధములుగా భ్రాంతుడై; పశ్యతి= చూచుచున్నాడు.

భేదముగా చూచుట ఎటులననగా కార్యకారణతయా= కార్యము, కారణము అనే స్వరూపముతో , స్వస్వామిసంబంధతః స్వ= హక్కుగల గృహము, ధనము, స్వామి వాటికి అధిపతి, రెంటికి గల సంబంధ స్వరూపముతోను, శిష్యాచార్యతయా= విద్యను నేర్చుకునే శిష్యుడు, విద్యనుచెప్పే గురువు అనే స్వరూపముతోను, తథైవ =అలాగే; పితృపుత్రాద్యాత్మనా= తండ్రి, కుమారుడు, తల్లి, అనే స్వరూపముతోను, స్వప్నే =స్వప్నమందు గాని; జాగ్రతివా= జాగ్రద్దశయందుగాని, ప్రపంచమును చూచునో, తసై#్మ =ఆ శ్రీగురుమూర్తయే= గురుమూర్తిఅయిన; శ్రీదక్షిణామూర్తియే =దక్షిణామూర్తిస్వామి కొరకు; ఇదం =ఈ నమః= నమస్కారము.

తాత్పర్య వివరణము.

అంతయు పరమాత్మయేయని, పరమాత్మయే సృష్టించి శరీరముల యందు ప్రవేశించాడని శరీరములయందు ప్రవేశించి జీవభావమును పొందెనని, మాయోపాదియుడై ఈశ్వరుడుగా నున్నాడని శాస్త్రం చెప్పుచున్నది. ఈ శ్లోకంలో స్వప్నే జాగ్రతివాయ ఏషపురుషో మాయా పరిభ్రామితః అని యున్నది స్వప్నమును విమర్శింతము. నిద్రపోయినవాడు బాహ్యప్రపంచమును చూడకుండా తన అంతరాత్మనే నిద్రాదోషముచేత అనేక చిత్రములుగా ప్రపంచమునుగా చూచుచున్నాడు.

ఎటులననగా ఒక కారణంలోనుండి ఒకకార్యం పుట్టినట్లు అనగా విత్తనములు నాటినట్లు అందులోనుండి మొక్కలు మొలచినట్లు, అగ్ని వలన జ్వాలకలిగినట్లు, నీరువలన తడిసినట్లు, వర్షములుకురిసి ప్రవాహములు వచ్చినట్లు తనకు చాలా ధనమునండి ఆ ధనమునకు తాను యజమానిగానుండి పరిపాలించుచు, ఖర్చుపెట్టుకొనుచు, అనుభవించుచున్నట్లు ఒక శిష్యుడు ఒక గురువువద్దకు వచ్చి విద్యను చెప్పుమని కోరినట్లు, ఆ గురువు శిష్యునకు విద్య చెప్పినట్లు, ఒకవ్యక్తి పెళ్ళిచేసుకున్నట్లు, సంతానం కలిగినట్లు, కుటుంబము అభివృద్దిని పొందినట్లు అనేక కార్యములు చేసినట్లు, కష్టములను , సుఖములను అనుభవించినట్లు ఈ బంధము దుఃఖమునకు కారణముగనుక దీనీని వదలివేయవలెనని వైరాగ్యముకలవాడై ఒక గురువు నాశ్రయించి బ్రహ్మవిద్యను శ్రవణము, మననము చేసి ధ్యానముచేసి బ్రహ్మసాక్షాత్కారమునుపొంది ముక్తుడయినట్లు స్వప్నదశయందు కనిపించినది.

ఇట్టి దృశ్యమంతయు స్వప్నమందు ప్రత్యక్షముగా కనిపించు చున్నదికదా. వస్తువులు లేనిది యదార్థమగా ప్రత్యక్షం కలుగదుకదా. అప్పుడు వస్తువులు లేవు కదా. అందుచేత స్వప్నదశయందు కనిపించు దృశ్యమంతయు ఆత్మాధిష్ఠానక భ్రమయే గాని వేరుకాదు. అనగా ఆత్మయే ఆజ్ఞానము యొక్క పరిణామమయిన నిద్రచేత ఆవరింపబడినదై తను ఒకచోట నిద్రపోయినను మరియొకదేశమునకు వెళ్ళినట్లు, దృశ్యములను చూచినట్లు అనేకవిధములుగా ద్రష్టవలె, దృశ్యమువలె కనిపించుచున్నది. గాని ఆత్మకంటే వేరయినది ఏమియి లేదు.

స్వప్నదశయందున్న పదార్థములను చూచుటకు ఇంద్రియములు పనిచేయుటలేదు గనుక సాక్షిచైతన్యముచేతనే తెలుసుకుంటున్నామని, అందుచేతనే సాక్షి ప్రత్యక్షమని గ్రహించవలయును. స్వప్నమందు కనిపించే పదార్థములన్నియు ప్రాతిభాసికములే. అనగా దృష్టికాలమందే గోచరించును. అగంతుకమైన నిద్రాదోషములవలన కలుగు భ్రమగనుక ప్రాతిభాసిక భ్రమయని గ్రహించవలయును.

మెళుకువ వచ్చినతరువాత నిద్రాదోషములతో సహ స్వప్నభ్రమ నశించును. ఇటులనే జాగ్రద్దశయందుకూడా సచ్చిదానందరూపమగు పరమాత్మయే. అజ్ఞానముచేత ఆవరింపబడి చూచే జీవులవలె, చూడబడే ప్రపంచమువలె, కార్యమువలె, కారణమువలె, కారణములోనుండి కార్యం పుట్టినట్లు, గృహారామక్షేత్రములకు తను అధిపతియైయున్నట్లు , గురువు వలె, శిష్యునివలె, తండ్రివలె, కొడుకువలె, భార్యవలె, శరీరేంద్రియముల వలె, సుఖదుఃఖములవలె గోచరించుచున్నది.

కాని అదిష్ఠానమగు పరమాత్మకంటే ఆరోపితమగు ప్రపంచం లేదు. బ్రహ్మసాక్షాత్కారం కలిగినపుడు అజ్ఞాననిద్రతో సహా స్వప్నభ్రమవలెనున్న జాగ్రద్దశయందలి ప్రపంచభ్రమపూర్తిగా నశించును. ఆత్మయే మిగులును. గనుక ఆత్మయే సర్వం. ఆత్మకంటే భిన్నమయినది ఏమియు లేదని అతిశ్రద్ధతో గ్రహించవలసిన విషయం.

ఒకప్రశ్న. ఆద్వైతమతంలో ఇదంతయు అజ్ఞానమువలన కలిగిన భ్రమయేకదా. అజ్ఞానం ఎక్కడనుండి వచ్చినది, ఎవరికున్నది , అని ప్రశ్నచేయవచ్చును.

సమాధానం: అజ్ఞానం ఎవరికనగా ఎవరికి భ్రమకలిగినదో ఒక వస్తువు మరియొక వస్తువుగా కనిపించినదో వారికే అజ్ఞానం. భ్రమ ఎప్పుడు అసలువస్తువుబాగా (కనిపించనపుడే) తెలియనపుడే కలుగునుగనుక. భ్రమకలిగినదంటే అజ్ఞానమున్నట్లే ముత్యపుచిప్పయందు వెండి అనే భ్రమకలిగినదంటే ముత్యపుచిప్పను తెలియకుండా చేసే అజ్ఞానమున్నట్లే. తాడు యందు సర్పబ్రమ కలిగినదంటే తాడుయందు తాడును తెలియకుండా చేసే అజ్ఞానమున్నట్లే. మంట మండిందంటే కారణమయిన నిప్పు ఉన్నట్లే. భ్రమ కలిగిందంటే భ్రమకు కారణమయిన అజ్ఞానమున్నట్లే. కలవరించాడంటే కలవరింతకు కారణమయిన నిద్ర వున్నట్లే , కలవరించిన వ్యక్తి కేకలు వేసి భయపడుచున్నాడు. మేలుకున్న మరియొకవ్యక్తి కలవరించేవానిదగ్గరకు పోయి నాయనా! కలవరించవద్దు భయపడవద్దు, అని నిద్రలే అని. నిద్రలేపె ననుకుందాం. ఆనిద్రలేపిన వ్యక్తిని కలవరించి భయపడిన మనిషి నాకెందుకు భయం కలిగినది. నేనెందుకు కలవరించితినని అడిగినపుడు సమాధానము ఏమిచెప్పవలయును.

కలవరించినది నీవేకదా, భయపడినది నీవేకదా, ఇవి నిద్రామూలముగా నేర్పడినవి, భయానికి కారణాలేమిలేదు, నీకేమయినా కనిపిస్తే భ్రమయేకాని వేరుకాదని చెప్పవలయును. నేనెందుకు కలవరించానంటే నేనెందుకు భయపడితినంటే నీయనుభవం చేతనే నీవు తెలుసుకో. భయం లేదు అని నేను చెప్పుచున్నాను అవియే చెప్పవలయును. నాకేమి భయం లేదు మెళుకువ వచ్చినది, కల అబద్ధమని తెలుసును, 'నేను కలవరించలేదంటే' భయపడవద్దని నేను చెప్పనవసరములేదనియే చెప్పవలయును.

అటులనే నేను జీవుడను సంసారదుఃఖము ననుభవించుచున్నానంటే జీవత్వం సంసారదుఃఖం అజ్ఞానంవలన ఏర్పడినవి భ్రాంతిగనుక, నేను జీవుడనుకాదు పరమాత్మను అని తెలుసుకొనుము. అట్లు తెలుసుకున్నయడల అజ్ఞానం, జీవత్వం సంసారదుఃఖం అన్నియు నశించును. నిత్యానందస్వరూపుడవుగా నుందువు అని చెప్పవలయును. నాకు భ్రాంతి లేదు, నాకు అజ్ఞానం లేదు, నేను జీవుడను కాదంటావా, అయితే నీకు ఏమీతత్వమును చెప్పనవసరం లేదు, భ్రాంతిని పొందేవానికి నాయానా నీకు అసలు వస్తువును తెలిసికొనని అజ్ఞానముచేతనే భ్రాంతి కలిగినది. ఆత్మతత్వమును తెలిసికొనినయెడల అజ్ఞానం లేదు, భ్రాంతిలేదు. భ్రాంతుని దృష్టిని బట్టి భ్రాంతి, అజ్ఞానం అని మాట్లాడుచున్నాము కాని మాదృష్టిలోపరమాత్మకంటే వేరైనవస్తువు లేదుగనుక, అజ్ఞానం లేదు, భ్రాంతిలేదు. అనియే సమాధానం చెప్పవలయును.

అయినపుడు అజ్ఞానం ఎవరికి? భ్రాంతి ఎవరికి? అని ఎవరినడుగుతావు. అజ్ఞానమును దానివలన ఏర్పడిన సంసారదుఃఖమును పొగొట్టు కొను సాధనమును శాస్త్రం చెప్పుచున్నది. గనుక ఆచరించమనికూడా సమాధానం చెప్పవచ్చును. మరియొక విషయం. జీవుడు నిజముగా పరమాత్మ అయియండి అజ్ఞానమువలన జీవత్వమును పొంది తన మనస్సుతో కల్పింబడిన ప్రపంచమును చూస్తున్నాడు. అంతయూ భ్రమే. గురువు, శాస్త్రము, ఉపదేశము, బంధము శ్రవణమనాదులు అన్నియు భ్రాంతిలో చేరినవే. తన అజ్ఞానకల్పితమగు గురుశాస్త్రాదులవలననే ఆత్మజ్ఞానమును సంపాదించి అజ్ఞానమును పోగొట్టుకొని స్వస్వరూములో నుండవలయును. ఇదియే పరమార్ధము.

మరియొక విషయం. పరమాత్మ స్వప్రకాశం, దీపంవలె ప్రకాశించునది. అజ్ఞానం చీకటిలాంటిది, దీపమున్నయెడల చీకటి నశించును గాని దీపాన్ని వెల్తురును చీకటి ఆవరించడం అనుభంలోలేదు. అట్లే స్వప్రకాశమానమైన ఆత్మను అజ్ఞానం ఎట్లా ఆవరించింది. అజ్ఞానం ఆత్మను ఆవరిస్తేకదా, జీవత్వభ్రమ ప్రపంచభ్రమ పుట్టడం. దీపంలాంటి స్వప్రకాశమానమయిన ఆత్మను అజ్ఞానాంధకారము ఆవరించుట అనుభవ విరుద్ధమే కదా.

పోనివ్వండి. ఆజ్ఞానం ఆత్మను ఆవరిచలేదందామా, స్వప్రకాశ ఆనందరూపమయిన ఆత్మమనమేగనుక మనకు ఆ స్వరూపం అనుభవములోలేదు. శరీరేంద్రియ సంఘాతంకంటే పంచకోశములకంటే నేను వేరు అస్వరూపం యేది అని మనం విచారించినపుడు ఆత్మ తెలియక తెలియ లేదని అజ్ఞానమే గోచరించుచున్నది. అందువలన ఆత్మను అజ్ఞానం ఆవరించినదని అనుటకు వీలులేదు. ఆవరించలేదని అనుటకు వీలులేదని చేసిన ప్రశ్నలకు అనుభవము ననుసరించియే సమాధానం చెప్పవలయును.

సమాధానం, గుడ్లగూబ గుడ్డిదికాదు. దానికి రాత్రిపూట కనిపిస్తుంది పట్టపగలు మధ్యాహ్నకాలమందు బాగుగా సూర్యుడు ప్రకాశించునపుడు గుడ్లగూబకు కళ్ళు కనిపించవు. కనిపించక బాధపడుతుంది. అతిచిత్రమయిన విషయము దాని దృష్టిలో స్వప్రకాశమానమయిన సూర్యుని కూడా కనిపించకుండా ఆవరించే చీకటి అడ్డుపుడచున్నదని చెప్పక తప్పదు.

అటులనే జీవులకు కూడా, స్వప్రకాశమానయిన తమకు ఆత్మ స్వరూపమై సర్వప్రపంచమునకు ప్రకాశ##మైన సచ్చిదానందరూపమగు పరమాత్మనుకూడా ఆవరించి ఆత్మను తెలియనివ్వకుండా చేయు అజ్ఞానుమ మాకు తెలియదు అనే అనుభవమును బట్టి ఉన్నదని అంగీకరింపక తప్పదు.

మరియొక సమాధానం. చీకటివలెనున్న రాహువుతో నావరింపబడిన సూర్యునిచేతనే రాహువు ప్రకాశింపజేయుబడుచున్నాడు. అటులనే ఆజ్ఞానముచేత నావరింపబడిన స్వప్రకాశమగు పరమాత్మచేతనే ఆత్మను ఆవరించిన అజ్ఞానము తెలియచేయబడుచున్నది. అజ్ఞానమును ప్రకాశింపచేయు జ్ఞానరూపమయిన ఆత్మ అజ్ఞానమును నశింపచేయదు.

సూర్యుడు తన ప్రకాశ##చేత పుల్లలను ఆకులను ప్రకాశింపచేయును గాని, తగులబెట్టడు. అట్టి సూర్యప్రకాశ##మే సూర్యకాంత మణియందు ప్రతిబింబించినయడల అగ్నిప్రాయమై పుల్లలను ఆకులను తగులపెట్టును.

అట్లే ఆత్మ అజ్ఞానము చేత ఆవరింపబడి అట్టి ఆజ్ఞానమును నాకు తెలియదు అనే అనుభవంలో జీవులకు తెలియచేయుచున్నను ఆ పరమాత్మ శ్రవణాదులు చేసినతరువాత కలుగు అఖండ బ్రహ్మాకారవృత్తి యందు ప్రతిఫలించినపుడు జ్ఞానాగ్నియై అజ్ఞానమును దహింపచేయును. కనుక శుద్ధచైతన్యము అజ్ఞానమునకు విరోధికాదు. అఖండాకార వృత్తి యందు ప్రతిబింబించిన చైతన్యమే, అజ్ఞానమునకు విరోధిగనుక వృత్తి. యందు ప్రతిబింబించిన చైతన్యమును అజ్ఞానం ఆవరించదు. కాని వృత్తియందు ప్రతిబింబించని చైతన్యమును అజ్ఞానం ఆవరించుటలో విరోధం లేదని కూడా సమాధానరమ చెప్పవచ్చును. విక్షేపమున్నచోట అంతట ఆవరణ ఉన్నట్లే, ఆవరణఉన్నచోట అదిష్ఠానమున్నట్లే, గనుక అదిష్ఠాన మగు ఆత్మదృశ్యమున్నచోటనంతట ఆజ్ఞానముచేత ఆవరింబడి సర్వత్రనిండియున్నట్లే గ్రహించవలయును. ఆవరణవిక్షేపములు రెండును చైతన్యముచేతనే భాసించునవిగనుక దృశ్యములే. దృక్కులేనిది, దృశ్యములు గోచరించవుగనుక సర్వప్రపంచమందు దృక్కుగానున్న పరమాత్మ సర్వాత్మకమైన సర్వవ్యాపకమై పరిపూర్ణమై యున్నట్లే.

శాస్త్రమునుబట్టి ఈ యనుభవమునుబట్టి విచారిస్తే ఇందతయు ఆత్మయే అదిష్ఠానముగాగల భ్రమయని చెప్పే అద్వైతసిద్ధాంతంలో మన ఆత్మఎక్కడలేదు? ఏదికాదు? ఏదిమనయందులేదు? అంతట మనమే అంతయు మనమే. అంతయు మనయందేనని మనకంటే వేనేమీలేదని ఆత్మచింతన చేయవలయును. ఈ శాస్త్రంలో కొన్ని కొన్ని పదములను అనగా అద్వైతబోధకు అనుకూలమగు శాస్త్రమందున్న పారిభాషికపదములను వాటి యర్థములను బాగుగా తెలిసికొనవలయును. అందుకొరకే చాలా చోట్ల అనగా యని వివరణచేసి వ్రాసితిని. శ్లో|| తచ్చింతనం తత్కధనం అన్యోన్యం తత్ప్రబోధనం, ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్భుదాః|| అని విద్యారణ్యస్వాములవారు చెప్పిరి. ఎల్లప్పుడు బ్రహ్మచింతన చేయవలయును. తెలుసుకొనే వారున్నపుడు వారికి చెప్పవలయును. తెలిసినవారున్నపుడు అన్యోన్యం. కొన్నివిషయములను వారికి చెప్పుచు, వారికి తెలిసిన విశేషములను వారివలన వింటూ విచారించుటయే బ్రహ్మభ్యాసమన బడును. ఆవాఙ్మానస గోచమగు పరమాత్మను తెలిసికొనవలెనంటే ఆరోపనిషేధము చేయుచనే తత్వవిచారం చేయవలయును గనుక. ఆరోప స్వరూప స్వభావములను గర్తించియే ఆరోపనిషేధము చేయవలయును.

అందుచేతనే శృతులు సృష్ఠిని ముందు చెప్పి తరువాత నిషేధించి పరమాత్మ యందు పర్యవసానమును చూపించినవి గనుక ముందు అధ్యాసయనగా ఏమీ? మాయ అనగా ఏమి? జీవుడనగా ఎవడు? ఈశ్వరుని స్వరూపమేమి? యని విచారించవలయును. ఈస్తోత్రంలో విశ్వం దర్పణదృశ్య మాననగరీతుల్యం అని విశ్వం పశ్యతి కార్యకారణఱ తయా అని, ఆరోపమగు ప్రపంచమును అభాసమయని చెప్పుచు అదిష్ఠానమగు పరమాత్మయందే తాత్పర్యమును ప్రబోధించిరి.

ఇక్కడ కొంచెము విమర్శించవలయును. మాయావాదము చాలా ఆశ్చర్యకరమైనది. అట్టి మాయావాదమునే అద్వైతులు జగత్తు మిధ్యా భూతమని, అద్వైతమే సత్యమని చెప్పుట కనుకూలముగా అంగీకరింతురు. మాయా వాదమనగా అంతయు మాయాకల్పితమని చెప్పుటయే. వివర్తవాదమును సమర్థించుటకు మాయావాదము గొప్పసహకారి. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో భగవత్పాదులవాదు మాయా వాదమునకు సూచక మైన, మాయా అను పదమును చాలా శ్లోకములయందు వాడిరి.

శ్లో|| విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అను శ్లోకములో పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా అని చెప్పి, అంతయు మాయావిజృంభితమేనని ప్రబోధించుచు నిద్రావిజృంభితమగు స్వప్నమును దృష్టాంతముగా చెప్పియస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం అని మెళుకువ అను ప్రబోధతో నిద్రావిజృంభిత స్వప్నభ్రమ నివర్తించినట్లు బ్రహ్మసాక్షాత్కారమనే ప్రబోధతోన్మిధ్యాత్వమును చెప్పి, జగన్మిధ్యాత్వ ప్రతిపాదనద్వారా అద్వైతసిద్ధిని స్థిరపరచినట్లు కనిపించుచున్నది.

బీజాస్యాంతరివాంకురో అను శ్లోకంలో మాయాకల్పిత దేవకాల కలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి అని సృష్టి కంటే పూర్వమందు అద్వైతస్థితితో నారంభించి విచిత్రమగు ప్రపంచమంతయు మాయాకల్పితమని చెప్పి, ఈశ్వరుడు ఐంద్రజాలికునివలె మహా మాయావి అని చెప్పి, ఆయనకుకల సృష్టికర్తృత్వము మాయామయమని చెప్పి, జగన్మిధ్యాత్వ ప్రతిపాదనద్వారా అద్వైతమందు తాత్పర్యమును స్పష్టముగా ప్రతిపాదించిరి.

దేహం ప్రాణమపీంద్రాయాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః అను శ్లోకములో మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణ అని చెప్పిరి. ప్రపంచమంతయు మహావ్యామోహమనియు అనగా భ్రమయని యర్థము. ఈ వ్యామోహమంతయు మాయాశక్తి విలాసచేతనే కల్పితమనియు ప్రబోధచేయుచు, మాయావాదమును చూపించుచు, ప్రపంచమిధ్యాత్వమును చూపించుచు అద్వైతమందు పర్యవసానమును చూపించిరి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్ఛాదనాత్‌ అను శ్లోకమునందు గ్రహణముపట్టిన సూర్యచంద్రులవలె సచ్చిదానందరూపమగు పరమాత్మమాయచేత అచ్ఛాదనచేయబడినట్లుచెప్పిరి. అజ్ఞానముచేత పరమాత్మ ఆవరింపబడినట్లు కొన్నిచోట్ల చెప్పబడియున్నది. కొన్నిచోట్ల మాయచేత నావరింపబడియున్నట్లు చెప్పబడినది.

ఈ విధముగా చెప్పుటను బట్టి కొన్ని చోట్ల అజ్ఞానమునకు మాయాకు కొద్దిభేదం చెప్పియున్నను రెంటికిని భేదం లేదని కూడా చెప్పవచ్చును. అద్వైతులలోనే కొందరు మాయకు అజ్ఞానముకు భేదంలేదని చెప్పిరి. గనుక అజ్ఞాన కల్పితమన్నను మాయాకల్పితమున్నను భేదం లేదనియే గ్రహించవలయును, అద్వైతమందే ప్రధానతాత్పర్యము నుంచుకొని ప్రతి పాదనచేయు విధానములలో తేడా యున్నను పరవాలేదనియే శంకరభగవత్పాదులవారి తాత్పర్యము, అందుచేతనే సురేశ్వరాచార్యులవారు శ్లో||యయా యయా భ##వేత్పుంసాం వ్యుత్పత్తిః ప్రత్యగాత్మని , సాసైవప్రక్రియేహ స్యాత్సాద్వీ సాచానవస్థితాయని చెప్పిరి. అనగా ఆత్మతత్వమును తెలుసుకొన తలచినవారికి యేయే ప్రక్రియలతో ఆత్మతత్వజ్ఞానము కలుగునో అద్వైతము నకు విరుద్ధముగాని ఆ ద్వైతజ్ఞానానుకూలమగు ఆయా ప్రక్రియలన్నియు గ్రహింపతగినవేనని తాత్పర్యము.

మరియు ''విశ్వంపశ్యతి కార్యకారణతయా'' అను శ్లోకములో స్వప్నేజాగ్రతివాయ ఏషపురుషో మాయాపరిభ్రామితః అని చెప్పిరి. స్వప్నావస్థయందుగాని, జాగ్రదవస్థయందుగాని మాయచేత పరిభ్రమింపచేయబడినవాడై మాయకల్పిత ప్రపంచమునే చూచుచున్నాడు. అనగా స్వప్నము జాగ్రదవస్థ అంతయు మాయాపరికల్పితమేనని తేలుచున్నది. ఉపనిషత్తులలోఅవస్థాత్రయమందును స్వప్నపదమే వాడబడియున్నది. ఒక ప్రమాణవచనము; తరత్యవిద్యాం వితతాం హృదియస్మిన్ని వేశితే. యోగీమాయామమే యాయతసై#్మ విద్యాత్మ నేనమః అని యున్నది. పరమాత్మను హృదయమందు ప్రవేశ##పెడితే అనగా పరమాత్మ సాక్షాత్కారమును పొందినయడల అవిన్యాం మాయాంతరతి అనగా ఆవిద్యారూపమయిన మాయను దాటుచున్నాడు అని చెప్పుచున్నది. ఆవిద్యను మాయను దాటడమనగా ఆత్మజ్ఞానముచేత అవిద్యను మాయను పోగొట్టుకొనుటయే నని యర్థము.

శ్లో|| మాయా మయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదంత్వం ప్రవిశవిదిత్వా అని భగవత్పాదులవారే చెప్పిరి. ఈవచనములనుబట్టి మాయకు ఆవిద్యకు పెద్దతేడా లేకుండానే శాస్త్రందు ప్రతివాదనకలదని తోచుచున్నది. ''మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మహేశ్వరం'' అని విద్యారణ్యస్వాములవారు కూడా మాయను ప్రపంచమునకు ఉసాదాన కారణముగా ఉదహరించిరి. గౌడపాదాచార్యులవారుకూడా మాండుక్యకారి కలయందు'' ప్రపంచో యదివిద్యేత నివర్తేన సంశయః మాయామాత్ర మిదంద్వైతం అద్వైతం పరమార్థతః'' అని చెప్పిరి.

అనగా అద్వైతసిద్ధాంతంలో సర్వాధిష్ఠానమగు పరమాత్మకంటే వేరుగా మరియొకటిలేదని మాటిమాటికి నలుగుతున్న విషయమే. ప్రపంచం లేనే లేదు జ్ఞానం కలిగితే నశించునా అంటే వుంటేకదా నశించటానికి, రజ్జుసర్పం పోయిందంటే పోయిందని చెప్పవచ్చునా, చెప్పకూడదు. అక్కడ తాడేగాని సర్పములేదాయే. సర్పముకాదు తాడేనని భ్రమపడ్డాడని చెప్పవలయునుగాని సర్పము పోయినదని చెప్పరాదు. ప్రపంచో యదివిద్యేతనివర్తేత నసంశయః ప్రపంచం వుంటేకదా నశించడానికి. అయితే యేమనవలయును. మాయామాత్రమిదం ద్వైతం ఈ ప్రపంచమంతయు మాయామాత్రం, అనగా మాయయేగాని ఏమియులేదు, ఇంద్రజాలిక సృష్ఠివలె, శుక్తిరజతుమువలె, రజ్జుసర్పమువలె, స్వప్నమువలె కనిపించినదేగాని సత్యముకాదు. అద్వైతం పరమార్థతః అద్వితీయమైన పరమాత్మయే సత్యమని తాత్పర్యము.

మరియు మాండూక్యకారికలలోనే ''మాయయా, భిద్యతేహ్యే తన్నాన్య థా7జం కథంచన అని యున్నది. ఒకవిషయం. మాయాసంబంధం లేకుండా పరమాత్మయే ప్రపంచరూపముగా తయారయితే పరమాత్మవలె ప్రపంచంకూడా సత్యమే కావలసివచ్చునని ప్రశ్నించవచ్చును. అంతమాత్రంతో ప్రపంచం మిధ్యాభూతమని చెప్పుటకు వీలులేకపోవును. మాయయాభిద్యతే అని చెప్పుటవలన జన్మాదివికారములేని పరమాత్మకూడా మాయాచేతనే నానారూపముగా భాసించుచున్నదిగాని పరమార్థముగా పరమాత్మకు నానాత్వములేదని తాత్పర్యం.

మరియు ''నేహనానేతి చామ్నాయాదింద్రోమాయాభి రిత్యపి, అజాయమానో బహుదామాయయాజాయతే తుసః'' అని యున్నది. వేదము పరమాత్మయందు ఏమియులేదులేదు అని దృఢముగా చెప్పుచున్నది. పరమేశ్వరుడు మాయచేతనే బహురూపములుగా గోచరించుచున్నాడు. ఆజాయమానః జన్మలేనివాడు, అయినను మాయయాజాయతేతుసః = మాయచేతనే అనేకవిధములుగా పుట్టుచున్నాడు అనేక విధములుగా కనిపించుచున్నాడని మాయావాదమునే దృఢపరచుచున్నది. మాయావాదము లేనిది జగత్తులేదని మిధ్యాభూతమని చెప్పుటకు వీలులేదు గనుక మాయావాదమును ఆధారంగాచేసుకుని అద్వైతసిద్ధాంతమును తెలిసికొనవలయుననితాత్పర్యం.

''సతోహి, మాయయాజన్మ యుజ్యతే, నతుతత్వతః'' అని మాండూక్యకారిక, నద్రూపమయిన పరమాత్మకు జన్మ అనగా ప్రపంచకార్యమంతయు మాయచేతనే పుట్టినదిగాని, సతుతత్వతః =నిజముగా సృష్టి లేదనియే అర్థము. మాయాసృష్టి ఎప్పుడు ఒకటి సత్యమయియుంటేగాని బయలుదేరదు. ఐంద్రజాలికుడు సత్యమయి ఉండుటవలననే వానిలోనుండి ఐంద్రజాలికసృష్టి బయలుదేరినది అటులనే శుక్తి సత్యమయినది ఉండుట వలననే రజతభ్రమ బయలుదేరినది. రజ్జవు సత్యముగా నుండుటవలననే సర్పభ్రమ బయలుదేరినది, నిద్రపోయినవాడు స్యతముగా ఒకడుండబట్టే వానిని ఆధారంగా చేసికొని స్వప్నప్రపంచం బయటుదేరినది.

అటులనే సత్యమయిన పరమాత్మ ఒకడుండబట్టే ఆయనను ఆధారంచేసికొని భూతభౌతిక ప్రపంచసృష్టి బయలుదేరినది. మాయా సృష్టి అనడంతోటే కనిపించేదంతయు మాయామయమని, ఈ సృష్టికి ఆధారమైన అనగా అదిష్ఠానమైన సత్యమైన ఒక వస్తువు మనకు కనిపించపోయినను వున్నదని అనుభవంగా అంగీకరించవలసినదే. గనుక మాయావాదము అద్వైతసిద్ధికి చాలా అనుకూలమని ప్రపంచం మిధ్యయని బ్రహ్మసత్యమని బహుప్రమాణ వచనములను బట్టి నిశ్చయమగుచున్నది.

మరియొక వచనం

శ్లో|| అసతో మాయయా జన్మతత్వతో నైవ యుజ్యతే

వంధ్యా పుత్రోనత త్వేన మాయయావాసి జాయతే||

లేని వస్తువునకు మాయచేతగాని, నిజముగాగాని ఉత్పత్తిలేదు. వంధ్యాపుత్రునికి మాయచేత ఉత్పత్తిలేదు. నిజముగా కూడా ఉత్పత్తిలేదు. గనుక అసత్తునుండి మాయా సృష్టి చెప్పుటకు వీలులేదు. సత్తుయందే మాయాసృష్టిని అంగీకరించవలయును. అటులైన బ్రహ్మసత్యం జగన్మిధ్యా యని తేలునని తాత్పర్యం.

శ్లో|| యథాస్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః

తథాజాగ్రద్ద్వయాభాసం స్పందతే మాయయామనః||

మనస్సు పనిచేస్తే ప్రపంచమున్నది. లేకపోతేలేదు. స్వప్నవస్థయందు మనస్సు మాయచేతనే శరీరంలోపనే విస్తారమైన ప్రపంచరూపముగా పరిణమించినది. మనస్సు స్వప్నరూపముగా విజృంభించుటలో మాయాయేకారణం. అటులనే జాగ్రదవస్థయందు కూడా మనస్సు పనిచేయుచున్నది గనుకనే ప్రపంచమంతయు కనిపించుచున్నది. దీనికిని మాయయే కారణం. మనస్సు పనిచేయక మాయయందు లీనమైనపుడు కార్యప్రపంచమేమిలేదని ప్రసంగవశముగా చెప్పుకొనవచ్చును. మాయామూలకమే సర్వప్రపంచమని ఇట్టిమాయను ముందు అర్థం చేసికొని మాయను మాయా కార్య ప్రపంచమును మిధ్యాభూతమని గుర్తించి పరమాత్మ సాక్షాత్కారమును పొంది ముక్తిని పొందమని తాత్పర్యము.

శ్లో|| యథా మాయామయో జీవో జాయతేమ్రి యతేపిచ

తథా జీవా అమీసర్వే, భవంతి సభవంతిచ||

జీవుని ఉత్పత్తి నాశములు మాయవలన ఏర్పడినవిగాని పరమార్థమయినవి కావు. ఎలాగంటే ఐంద్రజాలికుడు ఇంద్రజాలవిద్యతో కొంత మంది జీవులను సృష్టించినట్లు మరల అదృశ్యం చేసినట్లు చూపిస్తున్నాడు. మరికొందరు మణిమంత్రాది సిద్ధినిపొందినవారుకూడా పూర్వకాలములయందు విచిత్రప్రపంచమును జీవులను సృష్టించి ఉపసంహరించినట్లు , రాక్షసులు యుద్ధసమయంలో మాయతో సేనలను సృష్టించినట్లు కొన్ని చరిత్రల వలన వింటున్నాము. అటులనే ఈ ప్రపంచమంతయు మాయామూలకమగు మనోవిజృంభితమని తాత్పర్యము.

శ్లో|| స్వప్నమాయాయథాదృష్టే గంధర్వనగరం యథా

తథా విశ్వమిదం దృష్టం వేదాంతేషు విచక్షణౖః||

ఈ కారికకూడా చిత్రవిచిత్రముగా కనిపించిన స్వప్నప్రపంచముఎటుల మిధ్యాభూతమో. ఐంద్రజాలిక మాయా సృష్ఠి ఎటుల మిధ్యాభూతమో, ఆకాశమందు కనిపించే గంధర్వనగరం కనిపించి ఎటులమాయమైపోవునో ఈ మాయా కల్పిత ప్రపంచమంతయు ఆత్మప్రబోధచేత లయించి ఆత్మయే మిగులునని తాత్పర్యము.

శ్లో|| అనాది మాయయాసుప్తో యదాజీవః ప్రబుధ్యతే

అజమ నిద్ర మస్వప్నం అద్వైతం బుధ్యతే తే తదా||

అనాదియగు మాయా అనే నిద్రలో స్వరూపమును మరచి ప్రపంచభ్రమ అనే కలలో జీవుడేననుకున్నాడు. సర్వభ్రాంతిరహితమైన స్వప్రకాశమగు ఆత్మను ఎపుడు గురూపదేశముచేత అవరోక్షముగా తెలుసుకొనునో అనగా ప్రభోధను పొందునో అపుడే పరమాత్మ స్వరూపముగా నుండును.

శ్లో|| మేఘచ్ఛన్నొంశుమానలీవ మాయయామోహితో7ధికం

కించిత్కర్తా చకించిజ్‌జ్ఞో లక్ష్యతే పరమేశ్వరః||

మేఘముచేత నావరింపబడిన సూర్యునివలె, మాయచేత పరమాత్మ ఆవరింపబడి మోహితుడై, సర్వకర్తృత్వ సర్వజ్ఞత్వములు లేక కించిత్‌జ్ఞత్వకించిత్కచర్తృత్వములతో నున్నట్లు కనిపించుచున్నాడు. అనగా సచ్చిదానందస్వరూడైనను కొద్దివిజ్ఞానము కలవానివలె కొన్ని కార్యములయందే కర్తృత్వము కలవానివలె కనిపించుచున్నాడు. జ్ఞానముచేత అజ్ఞానమనే మాయానిద్ర పోగానే జీవభావం పోవునని ఈ స్తోత్రంలనే అనేకమారులు ప్రసక్తి వచ్చినపుడు ప్రతిపాదించితిని. మాయాసృష్టివలన పరమాత్మకు మార్పునిజముగా కలిగేది లేదు. మేఘముచేత గాని , రాహువుచేతగాని సూర్యుడు ఆవరింపబడినను సూర్యప్రకాశమునకు హానిలేదు. ఆవరించు మేఘము, రాహువు, ఆవరింపబడే సూర్యునితో సమానసత్యములై యున్నవి. పరమాత్మను ఆవరించు అజ్ఞానమావరణమకూడా పరమాత్మయందే కల్పితమైన దని పరమాత్మతో సమసత్యముకాదు, పరమాత్మకంటే వేరుకాదని దృష్టాం తముకంటే తేడాను గమనించవలయును గనుకనే శాస్త్రసమస్వయజ్ఞానం కల గురువులవలన విని విమర్శించి తెలుసుకొనవలయునని శాస్త్రం చెప్పుటయే గాక పెద్దలుకుడా చెప్పెదరు. బ్రహ్మవిద్యయందు గురుశిష్యసంప్రదాయం చాలా పాటించదగినదికూడా పెద్దలు చెప్పెదరు.

స్పష్టముగా శాస్త్రము చెప్పుచున్నను, పెద్దలు చెప్పుచున్నను మాయ విశ్వాసం కలుగకుండా చేయును.

శ్లో || ఏవ మేషా మహామాయావాదినా మపి మోహినీ

యస్మా త్సాక్షాత్కృతే సద్యో లీయతేచ సదాశివే||

గొప్ప గొప్ప శాస్త్రకర్తలను కూడా మాయ వ్యామోహింపచేయును. ఈశ్వర సాక్షాత్కారము కలిగినపుడే ఆ మాయ అంతర్థానమగును. అంత వరకు ఒకటి ఉంటే మరియొకటిగా భ్రాంతిని పొందుట తప్పదు. గనుక ఈశ్వర సాక్షాత్కారమునే కాంక్షించవలయును. ఇంత హృదయములో నుంచుకొని మాయా పరిభ్రామితఃఅని చెప్పిరి. శంకర భగవత్పాదులవారి హృదయమంతయు మనకు అర్థమయినట్లు అనుకొనుట అపచారం. వారనుగ్రహముతో చెప్పినవిషయములో కొంతయే మనకు అర్థమగుచున్నదని నిరహంకారముగా అనుకొనవలయును.

భగద్గీతలో కూడా'' అవ్యక్తాదీవి భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక నిధనాన్యేవ తత్రకాపరివేదనా'' సమస్తభూతములు పుట్టుకముందు కనిపించక అవ్యక్తమైనమాయలో నుండియే పుట్టుచున్నవి. సృష్టికాలమందు మాత్రమే స్పష్టముగా గోచరించుచున్నవి. తిరిగి అవ్యక్తస్థితిలోనే చేరిపోవుచున్నవి గనుక, పరవివేదన పడవద్దు. నాయనా! ఈ సృష్టి స్వభావ మిది యని అర్జునునకు కృష్ఠపరమాత్మ మాయావామును చూపించుచు అద్వైతపర్యవసానమును చూపించిరి.

శ్లో|| దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా

మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే! అని అర్జునునకు కృష్ణపరమాత్మ ఉపదేశించెను. మాయను దాటుట శక్యము కాదు. అనగా అనేక కార్యరూపములుగా విజృంభించుచున్న మాయను ఎవ్వరును నశింపచేయలేరు. ఎటులననగా ఒక ఐంద్రజాలికుడు ఇంద్రజాలవిద్యతో అద్భుతమగు ప్రపంచమును సృష్టించి చూచేవారికి చూపించేసమయంలో చూచేవారు ఆ ఐంద్రజాలిక సృష్టిని చూచి ఆశ్చర్యపడుదరురేగాని దానిని అణచివేయజాలరు. ఆ సృష్టిని ప్రసరింపచేసిన ఇంద్రజాలికుడే ఉపసంహరించగలడు. అటులనే ఈ మాయ. దాని కార్యమగు ప్రపంచం. నాలో నుండి బయలుదేరినవిగనుక నేనే దీనిని ఉపసంహరించవలయునుగాని, నామాయనుచూచి ఆశ్చర్యపడే జీవులునశింపచేయజాలరు. కాని, నన్ను సేవించి నన్ను నిజముగా నేనే పరమాత్మ నని తెలిసికొన్నవారు మాత్రం నామాయను దాటి నాలో ఐక్యమును పొందగలరు. అనగా వారకి పరమార్థ స్వరూపుడను గనుక జ్ఞానులకు అజ్ఞానమును పోగొడుదనునని తాత్పర్యము.

''నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః'' అని చెప్పిరి. యోగమాయ అనగా సత్వరజస్తమోగుణముల కలియక రూపముగానున్న మాయ. అట్టి మాయచేత నేను ఆవరింపబడుటచేత, నన్ను ఎవ్వరు తెలుసుకొనలేకున్నారు. అని చెప్పినందువలన, పరమాత్మ మాయ చేత ఆవరింపబడి, మాయా సృష్టి బయలుదేరినట్లు స్పష్ఠమగుచున్నది. శంకర భగవత్పాదులవారు భగవద్గీత భాష్య ప్రారంభమందు

''త్రిగుణాత్మికాం, వైష్ణవీం, స్వా, మయాం మూలప్రకృతిం,

వశీకృత్య, అజో, అవ్యయః, భూతానా, మీశ్వరః|

నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, స్వభావో7పిసన్‌, స్వమాయయా

దేహవానివ, జాతిఇవ లోకానుగ్రహం, కుర్వన్నివ, లక్ష్యతే||'' అని చెప్పిరి. అనగా మాయయే పరిణామ్యుపాదానమని ప్రపంచమంతయు మాయామయమనే నని, పరమేశ్వరుడు సచ్చిదానంతస్వరూపుడు, నిర్వికారుడు అయినను, స్వమాయచేతనే దేహము కలిగియున్నట్లు, జన్మించినట్లు దుష్టులను నిగ్రహించుచున్నట్లు, శిష్టులను పరిపాలించున్నట్లు కనిపించుచున్నడు. గాని, పారమార్థికముగా ఇదేమియు లేదు. పారమార్థికం ఎవ్వరికిని తెలియుట లేదని స్పష్టమగుచున్నది.

శ్లో|| నమాందుష్కృతినో మూడాః ప్రపద్యన్తే నరాధమాః

మాయయాపహృత జ్ఞానా అసురం భావమాశ్రితాః||

పాపాత్ములగు, మూఢులగు అధమస్థితిలోనున్న మనుష్యులు నన్ను తెలిసికొనలేరు. మామయాపహృతజ్ఞానాః అంటే - అపహరించడం అంటే దొంగిలించడమని యర్థము. మాయ మన జ్ఞానాన్ని అపహరించినది. జ్ఞానమంటే తన స్వరూప చైతన్యమగు. పరమాత్మ యని అర్థము. అనగా మాయ మన స్వప్రకాశానందస్వరూపమును అపహరించినది మనకు తెలియకుండా చేసినది. అందుచేతనే పాపాచారులై పరులను హింసించుట, అబద్ధములాడుట మొదలగు ఆసురభావమును పొంది నన్ను తెలుసు కొనలేకున్నారని, మాయ ఆత్మను ఆవరించినదని అందచేతనే ఆసుర భావం కలిగినదని అనగా ఆవరణమూలముగానే విక్షేపము కలిగినదని, మాయయే సర్వభ్రాంతికి మూలమని శ్రీకృష్ణపరమాత్మ సూచించెను.

శ్లో|| మాయాహ్యేషా మయాసృష్టా యన్మాం పశ్యసి నారద

సర్వభూత గుణౖ ర్యుక్తం మైవం మాం జ్ఞాతుమర్హసి||

ఓ నారదా! ఈ ప్రపంచమంతయు మాయగానే సృష్టింపబడినది. అనగా మాయ చేతనే నేను అనేక విధములగు ప్రపంచముగా కనిపించుచున్నాను. అట్టి మాయా కల్పితస్వరూపమునే నీవు చూస్తున్నావు. గాని, ఇట్టి మాయా కల్పితమైన ఈ నా స్వరూపమే పరమార్థమని గ్రహింపవద్దు. అని నారదులవారికి భగవంతుడు చెప్పెను. గనుక ఇదంతయు మాయా వ్యామోహమని పరమార్థము కాదని గ్రహించవలయును.

మాయా స్వభావమును విచారించుట, తత్వమును తెలిసి కొనతలచిన వారికి చాలా ముఖ్యముగనుక, మాయా పంచకమను అయిదుశ్లోకములను ఉదహరించుచున్నాను.

శ్లో|| నిరుపమ నిరంశ##కేప్యఖండే మయిచితి సర్వవికల్పనాది శూన్యే

ఘటయతి జగదీశ భేదభావం త్వ ఘటిత ఘటనా పటీయసీ మాయా||

పరమాత్మ అసదృశ##మైనది. అవయవములు లేనిది. అఖండం = కండములేనిది అనగా - దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనిది. సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిది. అనగా - ఒక దేశంలో ఉన్నది. ఒక దేశంలో లేదని. దేశపరిభేదము (అల్పత్వము) లేనిది. ఒక కాలమందున్నది. ఒక కాలమందు లేదు, అను కాలపరిచ్ఛేదము లేనిది. పరమాత్మ ఒక వస్తువు అగును. ఒకటి కాదని వస్తుపరిచ్ఛేదము లేనిది. చెట్టుకు సజాతీయమగు మరియొక చెట్టున్నట్లు. పరమాత్మకు సజాతీయమగు మరియొక పరమాత్మ లేదు. చెట్టుకు భిన్న జాతీయమగు రాళ్ళు మొదలగునవి ఉన్నట్లు, పరమాత్మకు విజాతీయములు వేరుగా లేవు. చెట్టులో స్వగతమైన కొమ్మలు ఆకులు, కాయలున్నట్లు పరమాత్మలో అవయవములు వేరుగా లేవు. గనుక పరమాత్మ అఖండం అంతయు అదియేగనుక అఖండమని గ్రహించవలయును.

అట్టి స్వప్రకాశ##మైన ఏ కల్పనలు లేని ఆత్మయందు జీవులని, ఈశ్వరుడని, ప్రపంచమని నానా దృశ్యములను అఘటిత ఘటనాపటీయసీ_ ఘటన కానిదానిని కూడా ఘటన చేయు సామర్థ్యముకలది. అనగా కుదరని దానిని కుదిర్చేది. అసంభవంను సంభవం చేయు సామర్థ్యముగల మాయ కల్పనచేయుచున్నది. లేనిదానిని ఉన్నట్లు, ఉన్నదానిని లేనట్లు మాయచేయగలదు. లేని ప్రపంచమును ఉన్నట్లు, ఉన్నపరమాత్మను లేనట్లు చేసినది. ఇంతకంటే అఘటిత ఘటనాసామర్థ్యం వేరుగా చెప్పనవసరం లేదు. మాయా రూపమైన అజ్ఞానములో నుండి బయలు దేరిన నిద్రాదోషము స్వప్నమందు ఒకచోట ఉన్నవానిని మరియొకచోట నున్నట్లు, రాత్రి పగలువలె, పగలు రాత్రివలె చిత్రవిచిత్రములైన మార్పులను చూపించుచున్నదికదా. ఇది కూడా అఘటిత ఘటనా సామర్థ్యమే. అసలు మాయకు చెప్పేదేమిటి? అందుచేత మాయా వాదం చాలా ఆశ్చర్యకరమైనదని, అద్వైతస్థితి పరమానందమని గుర్తించవలయును.

శ్లో|| శృతిశత నిగమాంత శోధకానప్యహ రహరాహరతో ధనాని సధ్యః|

కలుషయతి చతుష్పదాద్యభిన్నాన ఘటిత ఘటనా పటీయసీ మాయా||

వేదములను చదివి, శాస్త్రములను చదివి. వేదాంతములను పరిశీలించిన వారికి కూడా అనగా వేద శాస్త్రముల వలన ఆత్మానాత్మ పరిశీలనకొంత చేసినవారిని కూడా ప్రతిరోజు పొట్టకొరకు, దారాపుత్రాదుల పోషణకొరకు, ధనం కావలెననే కోరికతో దైన్యమును పొందించి, ఆయా వృత్తుల యందు ప్రవర్తింపచేసి, పశువులతో సమానముగా చేయుచున్నది మాయ. పశువులు ఇష్టానిష్టములు సంభవించినపుడు సంతోషమును, దుఃఖమును పొందుచుంటవి. మంచి గడ్డిచూపించి, దా యని పిలిస్తే దగ్గరికి ప్రీతిగా వస్తవి. కర్రతీసుకొని వెంటబడితే పరిగెత్తి వెళ్లిపోతవి. అటులనే మనుష్యులై బాగా చదువుకున్న వారుకూడా ఇష్టము లభించినపుడు సంతోషిస్తారు. అనిష్టము సంభవించినపుడు దుఃఖమును పొందుచు క్లేశపడుదురు.

ఒకరేమిటి సర్వజీవరాసులు ఆయా శరీరములయందు అభిమానము కలవై అనేక పనులు చేయుచు సర్వకాలములయందు ఏదో ఆందోళన తోను అనేక కోరికలతోను, నిద్రాహారాదులతోను పరామార్థమును గురై రుగక పరిభ్రమించుచున్నారు. పిపీలకాది బ్రహ్మపర్యంన్తం అన్ని భూతములను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క జీవునియొక్క దృష్టి, కోరిక, ప్రవృత్తి, జన్మపరంపర, సుఖదుఃఖములు, అవస్థాత్రయము అందులో జరిగే మార్పులు మొదలగు జీవగతిని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఖగోళం భూగోళం, భూతభౌతిక ప్రపంచమును ఇట్టి ప్రపంచంలో తిరుగు చున్న నేననే ఆత్మను ఈ విషయములను ఆలోచించినయడల చాలా ఆశ్చర్యంగా నుండును. ఇదంతయు మాయావిలాసమే. మాయకుగల అఘటిత ఘటనాల సామర్థ్యమని తాత్పర్యము.

శ్లో|| సుఖచిదఖండ బోధమద్వితీయం వియదనలాది వినిర్మితే వియోజ్య

భ్రమయతి భవసాగరేని తాంతం త్వఘటిత ఘటనా పటీయసీ మాయా||

ఏమీ ఆశ్చర్యము !

సుఖరూపమయిన, స్వప్రకాశ##మైన, అఖండమైన, అద్వితీయమగు ఆత్మను ఆకాశాది భూతములతో తయారయిన ప్రపంచంలో శరీరం కల వానినిగా జేసి ఉన్న రూపమును తెలియకుండా జేసి లేని స్వరూపము కల్పించి దానినే సత్యమనిపించి ఈ అనిర్వచనీయమైన సంసారసముద్రమందు పరిభ్రమింపచేయుచున్నది ఈ మహామాయ. ఇంతకంటే ఈ మహామాయకుగల అఘటితఘటనా సామర్థ్యం వేరే చెప్పవలసినదేమున్నది. యని తాత్పర్యం.

శ్లో|| అపగతగుణకర్మన జాతి భేదే, సుఖచితి విప్రవిదాద్యహం కృతించ

స్ఫుటయతి సుతదార గేవా మోహం త్వఘటిత ఘటనా పటీయసీ మాయా||

అబ్బా! ఏమిది పరమాశ్చర్యము.

పరమాత్మకు కర్తృత్వ భోక్తృత్వాది ధర్మములు లేవు. గుణములు లేవు, దోషములు లేవు, పుణ్యపాపాది కర్మలు లేవు, ఏవిధమైన వికారములు లేవు, స్వప్రకాశమానమైన, ఆనందరూపమయినది. ఇట్టి నిర్వికారమయిన ఆత్మయందు నేను బ్రాహ్మణుడనని, క్షత్రియుడనని జాతిభేదమును, నేను పండితుడను, తెలిసినవాడను, గొప్పవాడను, ధనవంతుడను, రూపవంతుడను, దానశీలుడను, అని ఈ విధముగా అహంకారమును దేహమందు, ఇంద్రియములయందు, మనస్సుయందు కూడా నేననే అహంకారమును పుత్రులయందు, భార్యయందు, గృహమందు, భ్రమను నాభార్య, నాపుత్రుడు, నాయిల్లు అను మమకారమును కలుగజేసి ఆత్మను మరిపించి జీవభావంలో పరవశులనుగా చేసినది మాయ. ఇదంతయు మాయకుగల అఘటిత ఘటనా సామర్థ్యమేనని తాత్పర్యము.

శ్లో|| విధి హరిహర భేదమప్యఖండే, బతవిరచయ్య బుధానపి ప్రకామం

భ్రమయతి దురహంకృతి ప్రమత్తా సఘటిత ఘటనాపటీ యసీమాయా||

ఆహా ! ఏమీ మాయాసామర్థ్యము.

అఖండమయిన ఏభేదములేని, పరమాత్మయందు బ్రహ్మయని, విష్ణువని, ఈశ్వరుడని భేదమును కల్పించి దేవతలను, పండితులను కూడా దురహంకార పూరితులను చేసి ప్రపంచంలో భ్రమింపచేయుచున్నది మాయ. అనగా బ్రహ్మయే పరమార్థమని అనగా కార్యబ్రహ్మ ఉపాసనయే పరమముక్తికి సాధనమని అంతకన్న మోక్షమునకు వేరు సాధనం లేదని అహంకారంతో కొందరు భ్రాంతిని పొందిరి. మరికొందరు విష్ణువే పరమార్థము. అట్టి విష్ణుమార్తి సేవచేత, భక్తిచేతనే తరించవలయునుగాని, వేరు మార్గమేమియు లేదని అభిమానముతో భ్రమించిరి. ఈశ్వరుడే పరమార్థమని ఈశ్వరసేవయే ముక్తికి సాధనమని కొందరు గ్రహించి భ్రమించిరి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులగు ముగ్గురు మూర్తులలో నిండియున్న ఈ ముగ్గురికంటె అతీతమైన సచ్చిదానంద రూపమగు పరమాత్మను తెలిసి కొనలేక సంసారములో మాయకు స్వాధీనులై పరిభ్రమించుచున్నారంటే మాయయే కారణం, అట్టి మాయ సంఘటన కానిదానిని సంఘటనచేయు సామర్థ్యము కలది. ఇట్టి మాయను దాటవలయునంటే పరమాత్మ సాక్షాత్కారమే సాధనం, కాని మరియొక సాధనం లేదని ఉపనిషత్తులకు తాత్పర్యమని, ఈ దక్షిణామూర్తి స్తోత్రమునకు కూడా ఇదియే తాత్పర్యమని గట్టిగా గుర్తుపెట్టుకొనవలసిన విషయం.

పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా, మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్యచిత్రీకృతం అని మాయావీవ విజృంభ యత్యపి మహాయోగీవ యస్స్వేచ్ఛ, యాయని, మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణయని, రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయాసమాచ్ఛాదనాత్‌ అని, స్వప్నే జాగ్రతివాయ ఏ షపురుషోమాయా పరిభ్రామితః అని. మాయా కల్పనను ప్రతిపాదించుచు యేమహానుభావుని మాయావిలాస. ఈరీతిగా వివిధముగా ప్రతిపాదించుచున్నదో, అట్టి దక్షణా స్వామివారికి నమస్కారమని చెప్పుచు ఈ దక్షిణామూర్తి స్వామి వారి యనుగ్రహమువలన కలిగిన జ్ఞానము చేతనే ఈ మాయా భ్రాంతి సంసారమును దాటవలయునుగాని వేరు మార్గము లేదని సూచించిరి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తత్వమును బోధించునది, జ్ఞానము నిచ్చునది గనుకనే ఇతరస్తోత్రముకంటే ఈస్తోత్రమునకు మొట్టమొదటనే ప్రతిపదార్థతాత్పర్య వివరణములను వ్రాసితిని.

అద్వైతబోధకు ముందు మాయా స్వరూప విచారముచేసి ప్రపంచము మాయయని తెలిసికొనుట ఆవశ్యకము గనుకనే శంకరభగవత్పాదుల వారు బ్రహ్మసూత్రములకు భాష్యం వ్రాయుచు ముందు అధ్యాసభాష్యం వ్రాసియే సకల శాస్త్రార్థమును వ్రాసిరి. ఇది ముఖ్యముగా గమనించవలసిన విషయం. ఈ అద్వైత వేదాంత శాస్త్రమందు విషయం జీవబ్రహ్మైక్యం, ప్రయోజనం అజ్ఞాన తత్కార్య రనూపముగానున్న సంసార బంధనివృత్తియై స్వరూపావస్థితికదా. ఈ విషయప్రయోజనములు సిద్ధించవలయునంటే అంతా మాయామయమని ఆరోపితమేనని భ్రమను వర్ణించుట చాలా అవసరమే. ఈ యధ్యాసను మొదట తెలుసుకొనకపోతే ప్రపంచం సత్యమయితే జీవత్యం పోదు గనుక జీవుడు పరమాత్మతో ఐక్యమును పొందుట కుదరదు.

ఇదంతయు భ్రమకానియడల సత్యమగు సంసారబంధము ఎప్పుడును నశించదు గనుక. జీవునికి అజ్ఞాన తత్కార్య రూపముగానున్న సంసారబంధ నివృత్తియనే ప్రయోజనం కూడా సిద్ధించుట కవకాశంలేదు. ఇట్టి విషయప్రయోజనములే లేకపోతే విషయప్రయోజనములులేని శాస్త్రమును ఎవరు చదువుదురు, గనుక విషయప్రయోజన సిద్ధికొరకు ముందు అధ్యాసను అనగా అంతయు మాయామయం. భ్రమయని వర్ణించుట చాలా అవసరం. జ్ఞానముచేతనే జీవుడు బ్రహ్మయగునని సంసారబంధము పోవునని శాస్త్రం చెప్పుచున్నది. గనుక. జీవత్వంతో సహా ప్రపంచమంతయు అజ్ఞానంచేతనే యేర్పడినదని చెప్పవలయును. అజ్ఞానం వలన యేర్పడుటయే అధ్యాసకదా. అటులయినయడల అజ్ఞానముచేతనే అజ్ఞానం, దానివలన ఏర్పడిన జీవత్వభ్రమ, సంసారభ్రమలు, నిశ్శేషముగా పోవును. అటులైన యడల జీవబ్రహ్మైక్యమనే విషయము. బంధనివృత్తి యనే ప్రయోజనం రెండును బాగుగా కుదురును. గనుకనే సమస్త వేదాంతములు అద్వితీయమగు బ్రహ్మయందు సమన్వయించునని తెలుసుకొనవచ్చును.

అందుచేతనే శంకరభగవత్పాదులవారు ఈస్తోత్రమందు మాయా పదమును అనేక పర్యాయములు వాడిరి, చివరకు మాయా పరిభ్రామితః అనిరి. అందుచేత ఈ విశ్వం పశ్యతి కార్యకారణ తయా అను శ్లోకం క్రింద మాయా విమర్శచేసి మాయా పంచకము నుదహరించి మరికొన్ని వచనుములను కూడా ఉదహరించి, సాధ్యమైనంతవరకు సులభముగా తెలియునటులనే వ్రాసితిని. ఇంతకన్నను అతి గంభీరమైన శాస్త్రచర్చలను వ్రాసినయడల చదువువారికి క్లేశముగానుండును గనుక అట్టి చర్చలను వ్రాయక, వాటి సారమును, కొన్ని విశేషములను కూడా వ్రాసితిని. విరక్తులై జిజ్ఞాసువులైన మహాపురుషులు ఈ తత్వ విచారమును, నడుచుచున్నను, నిలుచున్నను, మేల్కున్నను, పడుకున్నను సర్వకాలముల యందును చేయుచు, ఆనందమును పొందుచునే యుందురు. ఇట్టి అనుభవమునకు దగ్గరగానున్న ఆత్మానుభూతిని సంపాదించి తరించుట చాలా ప్రధానమని భావించి సర్వసంగత్యాగులై ఈ బ్రహ్మవిద్యయందే నిమగ్నులై కృతకృత్యులైరి. గనుక సర్వులు పరమాత్మను తెలుసుకొని తరించవలయునని తాత్పర్యము.

ఇట్టి జీవబ్రహ్వైక్యమును తెలుసుకొనుటకు సద్గురువు వద్దకే వెళ్ళి వారి శుశ్రూషచేసి, వారి యనుగ్రహమును పొంది, వారు చెప్పిన తత్వమును విని, గ్రహించి, మరువక, మననము చేయుచు, అనుభవమునకు వచ్చు నటుల చేసుకొనవలయును. తన రోగం పోవడానికి తను మందు పుచ్చుకున్నట్లు ''ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్‌ ఆత్మైవహ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః'' అని గీతలో చెప్పిరి, తనను తను ఉద్దరించవలయును, ఉద్ధరించడమనగా పైకి తీయడం. జీవుడు ఎక్కడ పడిపోయినాడు పైకి తీయడాకంటే అజ్ఞానమూలకమగు సంసారసముద్రంలో పడిపోయినాడు. అజ్ఞానమూలకసంసారసముద్రంలో నుండి ఉద్ధరించవలెనంటే జ్ఞాన మును సంపాదించవలయును. ఆ జ్ఞానం తన స్వరూప సాక్షాత్కారమే గనుక అట్టి సాక్షాత్కారమును సంపాదించిన స్వరూపాజ్ఞానం, సంసార బంధం పోవును గనుక ఉద్ధరింపబడుతాడు. అజ్ఞాననివృత్తియే ఉద్ధరణ. అంతేగాని మనుష్యజన్మలో ఆత్మజ్ఞానమును సంపాదించకుండా ఆత్మను పాడు చేసుకొనకూడదు.

ఆత్మయే ఆత్మకు బంధువు. ఆత్మయే ఆత్మకు శతృవు, గురువులు ఎంత చెప్పినను స్వప్రయత్నముతో తను చాలా శ్రద్ధాభక్తులతో తత్వచింతన చేయవలయును. ఏ ఉపనిషత్తును చూచినను జ్ఞానకాండ అతి లోతుగాను, రహస్యంగాను కనిపిస్తుంది. చాలా కట్టుబాట్లతో సిద్ధాంతమును తెలుసుకొనవలయునుగాని, ఇతిహాసములనువలె గ్రహించకూడదు. ఇట్టి జ్ఞానమునకు సాధనంగా శంకరభగవత్పాదులవారు భజగోవింద శ్లోకములలో ''త్రిజగతి సజ్జనసంగతి రేకా భవతి భవార్ణ వతరణ నౌకా'' యని చెప్పిరి. సంసార సముద్రమును దాటవలయునంటే మూడు లోకములలో సజ్జనసాంగత్యమనే ఒక పడవ కలదు. ఆ పడవను ఎక్కియే ఈ సంసారసముద్రమును దాటవలయునని తాత్పర్యము. గనుక ఈ మాయ పరిభ్రమణమును నివర్తింపచేయు సచ్చిదానందాద్వితీయ బ్రహ్మసాక్షాత్కారమును సంపాదించి తరించవలయునని పరామార్థము.

తాత్పర్య వివరణం సమాప్తం.

అవతరణిక.

ఇంద్రియములకును, మనస్సుకును ఇతర ప్రమాణములకును గోచరించనిది పరమాత్మ. అట్టి నిర్వికారమగు పరమాత్మను వేదములు కూడా ఈ రూపముగా నున్నదని విధిరూపముగా బోధింపజాలక, ఆరోపనిషేధపూర్వకముగానే ప్రతిపాదించుచున్నవి. అట్టి పరమాత్మను తెలిసికొనుటకు శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన చేసి, అట్టి పరమాత్మ నేనే నై తినని ఆపరోక్షజ్ఞానమును సంపాదించుటకు అసమర్థులైన మందాధికారులకు, అనగా రెండవరకమైన అధికారులకు, క్రమముగా ముక్తి లభించుటకు సాధనమైన అష్టమూర్త్యుపాసన చెప్పుటకు, సాధన చతుష్టయసంపత్తి కలిగి సూక్ష్మబుద్ధి కలిగిన ఉత్తమాధికారులకు, జీవబ్రహ్మైక్య విషయక శ్రవణాది వేదాంతవిచారమే సాధనమని చెప్పుటకును ఈ శ్లోకమును రచించిరి.

శ్లో|| భూరంభాం స్యనలోనిలోంబరమహర్నాధోహిమాంశుః

పుమానిత్యాభాతిచ రాచరాత్మకమిదంయసై#్యవమూర్త్యష్టకం

నాన్యత్కించ నవిద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

స్తసై#్మ శ్రీగురుమూర్తయేనమ ఇదం శ్రీదక్షిణామూర్తియే||೧೦||

ప్రతి పదార్థము.

భూః= భూమియు, అంభాంసి= జలము, అనలః= అగ్నియు, అనిలః= వాయువు, అంబరం= ఆకాశము, అహర్నాధః= సూర్యుడు, హిమాంశుః= చంద్రుడు, పుమాన్‌= కర్మకాండకు, జ్ఞానకాండకు అధికారి యైన జీవుడు, యసై#్యవ= ఏపరమేశ్వరుడైన, సర్వజ్ఞుడైన, సర్వశక్తిగల సచ్చిదానందరూపుడైన సదాశివుని యొక్కయే, మూర్త్యష్టకం _ మూర్తి= మూర్తులయొక్క, అష్టకం=ఎనిమిదింటి యొక్క సముదాయము, ఆభాతి= అంతట ప్రకాశించుచున్నదో, అనగా_ఈ ఎనిమిది స్వరూపములుగల ఈశ్వర స్వరూపుడనే నేనని అహంగ్రహోపాసన చేయమని యర్థము. విమృశతాం=ఈశ్వరానుగ్రహమువలన కలిగే తత్వ సాక్షాత్కారమే మోక్ష సాధనమని శ్రవణాది విచారణ చేయువారికి, పరస్మాత్‌=సర్వకారణమైన, విభోః=అనేకరూపములుగల ప్రపంచరూపముగా వివర్తమానమైన, దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితమైన, యస్మాత్‌=యేసకల ప్రపంచాధిష్ఠానమైన సచ్చిదానందరూపమైన పరమాత్మకంటే, అన్యత్‌=వేరు, కించన=కొంచెము కూడా, నవిద్యతే=కాదో (లేదో), తసై#్మ=ఆ, శ్రీ గురుమూర్తయే=గురుమూర్తి అయిన, శ్రీ దక్షిణామూర్తియే=దక్షిణామూర్తి స్వామికొరకు, ఇదం=ఈ, నమః=నమస్కారము.

తాత్పర్య వివరణము.

నిత్యానిత్య వస్తువివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్కసంపత్తి ముముక్షుత్వమను సాధన చతుష్టయ సంపత్తి కలవారై సూక్ష్మబుద్ధికలవారై సర్వకాలములయందు బ్రహ్మవిచారము చేసి, అనగా పరమాత్మయందే ప్రపంచమంతయు ఆరోపింపబడినదిగనుక ఆరోపింపబడిన ప్రపంచము అధిష్ఠానమైన పరమాత్మకంటే వేరుకాదు గనుక. అధిష్ఠానమైన బ్రహ్మయే సత్యం. ఆరోపిత ప్రపంచమంతయు మిధ్యయని భావించి శ్రవణ మనన నిదిధ్యాసనలు చేసి అహం బ్రహ్మస్మీ అని బ్రహ్మ సాక్షాత్కారమును పొంది ముక్తిని పొందువారు. ఉత్తమాధికారులు.

సాధనసంపత్తి సరిగాలేక, సూక్ష్మబుద్ధిలేక శ్రవణాదులు చేయలేనివారు మందాధికారులు, శ్రవణమనగా సమస్త వేదాంతములు అనగా ఉపనిషత్తులు. అద్వితీయమైన పరబ్రహ్మను తాత్పర్యముతో బోధించుచున్న వని విని, మనస్సులో నిశ్చయజ్ఞానం కలుగునట్లు చర్చచేయుట. మనన మనగా శ్రవణము చేసిన విషయమును అనేక హేతువులతోను, అనేక దృష్టాంతములతోను సంశయములేకుండా మనస్సులో దృఢపరచుకొనుట, నిదిధ్యాసనమనగా శ్రవణమననములతో సందేహములేకుండా నిశ్చయింపబడిన పర బ్రహ్మ స్వరూపమును నేను జీవుడను కాదు. పరబ్రహ్మ నేనే నని ధ్యానము చేయుట.

ఇట్టి కష్టతరమైన శ్రవణమనన నిదిధ్యాసలను సూక్ష్మబుద్ధి లేని వారు చేయజాలరు గనుక ఇట్టి రెండవరకమగు అధికారులకే ఉపనిషత్తుల యందు సగుణ బ్రహ్మోపాసనలుచెప్పబడినవి. ఆ సగుణ బ్రహ్మోపాసనల వలన పరిపక్వస్థితిని పొంది, దేహము పడిపోయిన తరువాత సగుణ బ్రహ్మలోకమునకు పోయి ఆ లోకమందు ఆ సగుణ బ్రహ్మ అనుగ్రహము వలన నిర్గుణ బ్రహ్మ విచారం చేసి, ఆలోకమందే నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొంది, ఆ సగుణ బ్రహ్మతోకూడా ఈ సగుణ బ్రహ్మోపాసకులు నిర్గుణ బ్రహ్మస్వరూపముతో ఐక్యమును పొందుదురు. ఇదియే క్రమముక్తి. ఈ క్రమముక్తి సగుణ బ్రహ్మోపాసనవలన కలుగును.

ఆ సంప్రదాయానుసారముగా శంకర భగవత్పాదులవారు ఈ శ్లోకమందు సగుణోపాసన చెప్పిరి. ఉపాసన ఎటులననగా, కొద్దిదాని యందు గొప్పదృష్టిని ఉంచుట ఇదియే ఉపాసనకు మొదటి లక్షణము; పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఈ పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, కర్మజ్ఞానాధికారియగు జీవుడు, ఈ ఎనిమిది అష్టమూర్తులు, ఈ అష్టమూర్తులతో కూడి అనగా ఈఅష్టమూర్తులు ఈశ్వరునికి శరీరమని అనుకుందాము. ఇట్టి ఈశ్వరుడు సమష్ట్యుపాధికుడు. ఇట్టి ఈశ్వరునితో తనకు ఐక్యమును భావించి ఉపాసన చేయవలయును.

ఎటులననగా! తన శరీరం పంచభూతములతో తయారైనది గనుక శరీరంలో పంచభూతములున్నవి. ప్రపంచంలో నున్న సమష్టి మహాపంచ భూతములను, తన శరీరంలోనున్న వ్యష్టి పంచభూతములను ఒకటిగా భావించవలయును. అష్టమూర్తులలోని సూర్యచంద్రులను, తన శరీరములోనున్న ప్రాణాపానవాయువులను ఒకటిగా భావించవలయును జీవుడు తనే అయియున్నాడు. గనుక వ్యష్టి శరీరము ఉపాధిగాగల తనకు అష్టమూర్తులనే సమష్టి ప్రపంచము ఉపాధిగాకల పరమేశ్వరునుకు, ఐక్యమును భావించవయును.

అనగా సర్వవ్యాపకమై అష్టమూర్త్యభిమానిఅయిన సదాశివుడనే నేనని అహంగ్రహోపాసన చేయవలయును. ఇట్టి ఉపాసనవలన, ఈశ్వర సాయుజ్యమును పొంది, ఆ ఈశ్వరానుగ్రహమువలన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారమును పొంది, ముక్తిని పొందుదురు. ఇదియే క్రమ ముక్తి సాధనమని, శంకర భగవత్పాదులవారు అతిదయతో అనుగ్రహించిరి. ఇట్లు తాత్పర్యవివరణ సమాప్తం.

అవతరణిక.

ఇపుడు ఈ దక్షిణామూర్తిస్తోత్రమును చదువుటకు అర్థమును తెలిసికొనుటకు ప్రవర్తించిన ఉత్తమజీవులకు కలుగబోవు ఫలమును చెప్పుచు ఈ స్తోత్రమును పూర్తి చేయుచు. ఈ శ్లోకమను ఫలశృతి స్థానీయముగా కూడా చెప్పిరి.

శ్లో|| సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే,

తేనాస్యశ్రవణాత్త దర్థమననార్థ్యనాచ్చ సంకీర్తనా|

త్సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతస్సిద్ధ్యే

త్తత్సునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం||೧೧||

ప్రతిపదార్థ నిరూపణము:

ఇతి=ఈ చెప్పినరీతిగా; యస్మాత్‌= ఏ కారణమువలన; అముష్మన్‌= ఈ, స్తవే=దక్షిణామూర్తిస్తోత్రమందు; ఇదం =ఈ, శృతులయందు చెప్పబడిన (ప్రత్యేక్షమైన); సర్వాత్మత్వం =పరమాత్మకు సర్వరూపత్వము (సర్వరూపమగుస్థితి); స్ఫుటికృతం =స్పష్టముగా తెలియచేయబడినది; తేన =ఆకారణముచేత; అస్య =ఈ దక్షిణామూర్తి స్తోత్రముయొక్క; శ్రవణాత్‌ =యధావిధిగా గురువువలన వినుటవలన; తదర్థమననాత్‌= శ్రవణంచేసి విషయమును అనేక దృష్టాంతములతోను, అనేక యుక్తుల తోను, మనస్సుతో చింతనచేసినందువలన; ధ్యానాచ్చ =శ్రవణమననములతో నిర్ణయింపబడిన సర్వాత్మకమయిన సచ్చిదానందమయిన నిత్యసిద్ధ బుద్ధ ముక్తస్వరూపమయిన పరమాత్మనే నేనని తైలధారవలె ఇతర వృత్తితో వ్యవధానములేని, పరమాత్మాకారవృత్తి ప్రవాహరూపమైన నిది ధ్యాసనవలన; సంకీర్తనాత్‌ =ఇతరులకు వేరుగా చెప్పుటవలన, లేక ఈ దక్షిణామూర్తి స్తోత్రమును చదివినందువలనగాని; సర్వాత్మత్వ మహా విభూతిసహితం-సర్వాత్మత్వ=సర్వాత్మభావమనే; మహావిభూతి =అణిమాద్యైశ్యర్యము కంటే గొప్ప ఐశ్వర్యముతో; సహితం =కూడిన; ఈశ్వరత్వం =సత్యజ్ఞానానందరూపమైన పరమాత్మభావము; తత్‌=ఆ శృతుల యందు ప్రసిద్ధమైన పరమాత్మభావము; స్వతః= సిద్ధమయినదే; స్యాత్‌=అగును అనగా పరమాత్మభావము సిద్ధమేగాని ప్రయత్న సాధ్యముకాదు. ప్రయత్న సాధ్యమయ్యే యడల అనిత్యమగునని యర్థము; పునః =తిరిగి; అష్టధా =ఎనిమిది విధములుగా : పరిణతం =మాయా పరిణామమయిన; ఐశ్వర్యం =అణిమాద్యైశ్వరము; అవ్యాహతం =అడ్డులేనిదై; సిద్ధ్యేత్‌ =సిద్ధించును;

తాత్పర్య వివరణము.

సకల వేదాంత సిద్ధాన్తమంతయు, ఈ దక్షిణామూర్తి స్తోత్రమందుండుటచేత ఈ దక్షిణామూర్తి స్తోత్రమును గురువుల వద్ద బాగుగా శ్రవణం చేసి, మననం చేసి శ్రవణమననములతో, నేను పరమాత్మను కాననే అసం భావనను, నేను జీవుడననే విపరీతభావనను పోగొట్టుకొని తరువాత నిశ్చితమగు పరమాత్మతత్వమును ధ్యానం చేసి, ఆత్మ సాక్షాత్కారము పొందిన వారికి ఆజ్ఞానము పోయి సచ్చిదానంద రూపమగు పరమాత్మస్థితియనే మోక్షము లభించును. ఇట్టి మోక్షమే మహావిభూతి యనబడును. ఇట్టి పరమాత్మభావము జీవునికి సిద్ధించియేయున్నది. గనుక ప్రయత్న సాధ్యము కాదు. సాలోక్యముక్తియు, సామీప్యముక్తియు, సారూప్యముక్తియు, సాయుజ్య ముక్తియు, ఉపాసనచేతను, కర్మచేతను సాధించతగినవి. గాని సిద్ధించియున్నవికావు. పరమాత్మస్వరూపమనే మోక్షముమాత్రమం సిద్ధించియే యున్నది. ఎందువలననగా ఆత్మస్వరూపమే గనుక.

ఆత్మను సంపాదించనవసరమలేదుకాదా! ఒక ప్రశ్న. మోక్షమనగా అవస్థాత్రయాతీతమగు ఆత్మయేకదా. అట్టి ఆత్మసిద్ధించి మన స్వరూపముగానేయున్నదికదా. అయితే అఖండానందరూపమగు మోక్షము మన కెందుకు గోచరించడంలేదు. అంటే అజ్ఞానం. ఆ స్వరూపానందమును అవరించి మనకు గోచరించకుండా చేసింది. అయితే ఆ మోక్షము ఎంత దూరములో నున్నది. అంటే ఆత్మస్వరూపమే. మోక్షమని చెప్పితిమికదా. ఆత్మకంటే దగ్గరిది లేదుకదా. అయితే ఎంతోదూరముగా నున్నట్లు లభించనట్లు దేనినైనా సంపాదింపవచ్చును గాని మోక్షమును సంపాదించుట చాలాకష్టమని, దేనినైనా పోగొట్టుకొనవచ్చునుగాని, జన్మమరణ సంసార బంధమును పోగొట్టుకొనుట చాలా అసాధ్యమని, చాలా బాధపడుచున్నామే అంటే అజ్ఞానంకంటే దగ్గర ఉన్న దానినికూడా దూరంచేసేది మరియొకటి లేదు, అజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లుచేసేది మరొకటిలేదు. ఇదియే కాదు అజ్ఞానంకంటే ఉన్నదానిని లేనట్లు చేయుటయేగాక ఎక్కడనోనున్నదని దానిని సంపాదించుటకు వెతికించేది. తిప్పేది, బాదపెట్టేది మరియొకటిలేదు. అజ్ఞాన ప్రభావమును గురించి లోకదృష్టాంతమును చూడండి.

ఒక పిల్లకు వివాహం చేయవలెనని వరనిశ్చయంకొరకు గృహస్థు వెతుకుచున్నాడు. అనేక ప్రాంతములు వెతికాడు. ఎక్కడను నిశ్చయం కాలేదు. ఎక్కడ అగునో తెలియదు. కాని పెళ్ళికొడుకు ఆగ్రామము లోనే దగ్గరనే యున్నాడు. విధి పిల్లకు భర్తను నిర్ణయించియే యున్నది. కాని తెలియదు అనగా అజ్ఞానమేకదా! ఈ తిరుగుటకు కారణం. సర్వత్ర ఇట్టి అజ్ఞానం తాండవిస్తున్నదికదా! అనేక ప్రయోజనములను సాధించుటకు అనేక ఉపాయములను సాధించి ప్రయత్నిస్తాము. కాని ఎట్లు సిద్ధించునో యెపుడు సిద్ధించినో తెలియదు. అనగా అజ్ఞానమే యెంతపని అయినా చేయించకలదు. మనం ఏ జన్మలోనుండి ఈ జన్మకువచ్చినది ముందు యచటికివెళ్లేది యెంత పాపమున్నది? యెంత పుణ్యమున్నది? తెలియదు ఎపుడు మరణము కలుగునో తెలియదు. యేదిచేస్తే మేలు కలుగునో, యేది చేస్తే కీడు కలుగునో తెలియదు. ఇదంతయు అజ్ఞానము వలననే జరుగుచున్నది.

సరే. మోక్షము ఆత్మస్వరూపమై సిద్ధించియే యున్నది గనుక ఆ మోక్షప్రాప్తికి ప్రయత్నమెందుకు? నిజమే ప్రాప్తమయియే యున్నది. అజ్ఞానం అడ్డమున్నది. అడ్డముగానున్న అజ్ఞానమును పోగొట్టుకొనుటకే ఈ ప్రయత్నమంతా. అయితే అజ్ఞానము పోగొట్టుటకు జ్ఞానమే కావలయును కాదా. అంటే నిజమే జ్ఞానంచేత అజ్ఞానమును పోగొట్టుకున్న యడల తరువాత చేయవలసినదేమియు లేదు. సరేకాని, ఆత్మస్వరూపమైన మోక్షమును పొందడమేమిటి? అంటే వినండి, పొందడం రెండు విధములు, పొందిన దానిని పొందడం, పొందని దానిని పొందడం, పొందినదానిని పొందడంలో జ్ఞానమే కారణం. పొందనిదానిని పొందడంలో కర్మకారణం, ఎటులననగా తన కంఠంలో ఒక మాలయున్నది. ఆ మాలపోయినదని భ్రమపడ్డాడు. వెతకడం మొదలుపెట్టెను. చాలా చోట్ల వెతికాడు. దొరకలేదు చాలా మంది యందు అనుమానించి అడిగెను కాని లభించలేదు. తిరిగాడు. అనేక ప్రయత్నములు చేసెను, గాని దొరకలేదు. ఇంతలో ఒకరు వచ్చి చూచి ఎందుకు తిరుగుతావు! నీకంఠంలోనే మాల ఉన్నది కదాయని చెప్పెను. అంతట చూచుకున్నాడు, కనిపించింది. కొందరు దొరికినదాయని అడుగగా దొరికినదన్నాడు.

మాలనుపొందియే యున్నాడు. పోయినదాని భ్రమకలిగిదేకాని పోలేదు. తన కంఠములోనున్న మాలను పొందుటకు జ్ఞానమే సాధనమై నదిగాని, వెతుకుట, తిరుగుట, ఇతరులను అడుగుట మొదలగు కర్మవలన లభించలేదు. ఇదియే ప్రాప్తప్రాప్తి ఇటులనే జీవునికి అసలు స్వరూపం పరమాత్మయే అయియున్నది. అజ్ఞానం చేత ఆత్మను తెలుసుకొనలేక జీవుడనని భ్రమపడ్డాడు. నాయనా! నీవు జీవుడవు కావు పరమాత్మవేనని శాస్త్రం చెప్పినది. నేనే పరమాత్మనని తెలుసుకున్నాడు. ఈ ఆత్మజ్ఞానము చేతనే పొందిన ఆత్మను పొందెను గనుక పొందిన దానిని పొందుటలో జ్ఞానమే కారణం, జ్ఞానంచేత అజ్ఞానం పోవుటయే మోక్షమని చెప్పవచ్చును. జీవత్వ భ్రమపోవుటయే పరబ్రహ్మ ప్రాప్తియని, దీనినే ప్రాప్తప్రాప్తి అనగా పొందిన పరమాత్మను జ్ఞానంతో పొందుట యని అంటారు.

పొందని దానిని పొందుటలో కర్మకారణముకదా. ఎటులననగా ఒక గ్రామంలో నున్న వ్యక్తి మరియొక గ్రామమును పొందవలయునంటే వెళ్ళుట అనే కర్మయే కారణం. స్వర్గాది లోకములు ఈ లోకమందున్న మనకు దూరమందుండుటచే అప్రాప్తములై యున్నవి కనుక, ఆప్రాప్తములైన స్వర్గాదిలోకములను పొందుటకు కూడ కర్మయే కారణం. ఒక పశ్న. ప్రపంచమంతయుఎక్కడ ఉన్నది? అంటే పరమాత్మయే ప్రపంచారోపమునకు అధిష్ఠానము గనుక ప్రపంచమంతయు పరమాత్మ యందే యున్నదియని చెప్పవలయును. అయితే స్వర్గలోకంగాని, బ్రహ్మలోకంగాని, కైలాసంగాని, వైకుంఠంగాని ఇలాంటి మహాలోకములు ఎక్కడ యున్నవి? అంటే ఇంకా సందేహమెందుకు? అద్వైత సిద్ధాస్తంలో సచ్చిదానంద రూపమగు పరమాత్మయందే జీవత్వం, ఈశ్వరత్వం, సకలదృశ్యములు ఆరోపితములైనపుడు బ్రహ్మాది సర్వలోకములు దృశ్యమగు ఆరోపములో చేరినవే గనుక అధిష్ఠానమగు పరమాత్మయందు యున్నవని చెప్పవలయును.

అయితే ఆ పరమాత్మ జీవునికి నిజమైన స్వరూపమే గనుక మనయందే ప్రపంచమంతా ఉన్నదని గ్రహించవచ్చును. అయితే ప్రపంచమంతయు మనయందే ఉన్నయడల అంతయు మనకు ప్రాప్తమే గనుక అప్రాప్తమేమిటి? అప్రాప్తప్రాప్తియేమిటి అంటే నిజమే. మనం పరమాత్మ స్వరూపుల మనుకున్నపుడు ఆరోపమంతయు మనయందే యుండును. గనుక, అంతయు మనకు ప్రాప్తమే గనుక, మనయందు లేనిది లేదు. మనకంటే వేరులేదని కూడా చెప్పవచ్చును. పరమాత్మను తెలిసికొనక జీవుల మనుకున్నపుడు ఆరోపితమగు ఉపాధిని బట్టి తయారయిన జీవభావంలో ప్రపంచం ప్రాప్తంకాదు. అధిష్ఠానమందే ఆరోపమంతయు ఉండును గాని. ఒక ఆరోపమందు అన్ని యారోపములు ఉండవు. అన్ని యారోపములు అందులో ఒక ఆరోప స్వరూపములు కావు. అన్ని యారోపములకు అధిష్టానమే పరమార్ధం గాని, అందులో ఒక ఆరోపం అన్నిటికిని పరమార్ధం కాదు.

శుక్తియందు రజతమని, రంగమని అనగా తగరమని భ్రాంతి కలిగినది. అక్కడ అధిష్ఠానం శుక్తియే. ఆరోపములు వెండి, తగరం, ఈ రెండు అందులో తగరమునకు వెండిగాని, వెండికి తగరంగాని పరమార్థం కావు. ఆరోపములగు, వెండి తగరములకు అధిష్ఠానమగు శుక్తియే పరమార్థం, అనగా నిజస్వరూపం. అటులనే పరమాత్మ యందే జీవత్వం, ప్రపంచమంతయు కల్పితమైనది, గనుక జీవుడుకూడా కల్పితుడనియే చెప్పవలయును అటులైన యడల జీవునికి ప్రపంచం గాని. ప్రపంచమునకు జీవుడుగాని పరమార్థములుకావు. ప్రపంచమునకు జీవునికి పరమార్థము అధిష్ఠానమగు పరమాత్మయే, గనుకనే పరమాత్మయందే యున్నవి. పరమాత్మకంటే వేరుకాదనియు చెప్పెదరు.

గనుక జీవభావమున్నంతవరకు అనగా నేను జీవుడనను భ్రమ ఉన్నంతవరకు బ్రహ్మాదిలోకములు అప్రాప్తములే గనుక ఆ లోకములను పొందుట అప్రాప్తప్రాప్తియే. ఆ లోకప్రాప్తికి కర్మయే కారణం, అనగా, ఒక గ్రామమునుండి మరియొక గ్రామమును గమనముతో పొందినట్లు ఈ లోకమునుండి బ్రహ్మాదిలోకములను ఒక మార్గమును అనుసరించి ప్రయాణం చేసి పొందవలసినదే. అందువలననే బ్రహ్మలోకమును పొందుటకు అర్చిరాదిమార్గమని, స్వర్గలోకమును పొందుటకు ధూమాధిమార్గమని శ్రుతులు చెప్పుచున్నవి. అయితే, అజ్ఞాన దశయందు జీవునకు కూడా పరమాత్మ అప్రాప్తమే కదా. అట్లయిన లోకాంతర ప్రాప్తివలె బ్రహ్మప్రాప్తికూడా అప్రాప్తప్రాప్తి యేలకాదు? అంటే ఏ వస్తువునకూ స్వరూపము అప్రాప్తము ఎప్పుడూ కాదు. ప్రాప్తమే అయియుండును. జీవునకు అజ్ఞానమున్నను పరమాత్మ పరమార్థస్వరూపమే గనుక అప్రాప్తము ఎప్పుడూ కాదు. నిత్యప్రాప్తమైనదే, గనుక జీవునికి పరమాత్మప్రాప్తి, ప్రాప్తప్రాప్తియే గాని లోకాంతర ప్రాప్తివలె అప్రాప్త ప్రాప్తి ఎప్పుడూ కాదని గ్రహించవలసిన విషయము.

అయితే అజ్ఞానం ఎక్కడ నున్నది. అంటే అన్ని ఆరోపములు అధిష్ఠానమందున్నట్లు అజ్ఞానంకూడా ఆరోపమే గనుక అజ్ఞానం కూడా అధిష్ఠానమగు పరమాత్మయందే యుండును. పరమాత్మకంటే వేరుకాదు పరమాత్మయందే ఉండునని పరమాత్మ కంటే వేరు లేదని అంటే ఏమిటి? అంటే అధిష్ఠానము లేనిది అనగా ఒక సత్యవస్తువు లేనిది భ్రమకలుగదు గనుక భ్రాంతి దృష్టితో చూస్తే ప్రపంచం ఉన్నట్లే భావించుచున్నాము గనుక ఈ ప్రపంచం అధిష్ఠానమందే ఆధారపడి యున్నదని చెప్పవలయును. శంకర భగవత్పాదులవారు. ఈ స్తోత్రంలోనే. శ్లో|| విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, నిజాంతర్గతం అని చెప్పిరి.

నిజాంతర్గతం అని చెప్పినందువలన అద్దంలో ప్రతిబింబించిన నగరం కనిపించినట్లు, ఉన్నట్లు ఆత్మయందే ప్రపంచమంతా ఉన్నదని అనగా భాసించుచున్నదని యర్థము, పరమార్థముగా విచారిస్తే, అధిష్ఠానమగు పరమాత్మకంటే ఆరోపమగు ప్రపంచం వేరేలేదని చెప్పవలయును.

ఒక ప్రశ్న, ఆరోపమనగా భ్రమకదా! సర్వప్రపంచ భ్రమకు అజ్ఞానం కారణం గనుక, అజ్ఞానం వల్ల ప్రపంచ భ్రమ కలుగవచ్చును. గాని అజ్ఞానం కూడా ఆరోపమేగనుక అజ్ఞానారోపమునకు కారణ మేమున్నది? మరియొక అజ్ఞానం లేదుకదా. అట్లున్నదన్నను, దానికి మరియొక అజ్ఞానం కారణం. దానికి మరియొక అజ్ఞానం కారణం అని చెప్పిన అనవస్థాదోషం వచ్చును (అనగా తెంపులేని కల్పన). అజ్ఞానారోపమునకు పరమాత్మయే కారణమంటే, మోక్షదశయందుకూడా కారణమగు పరమాత్మ ఉన్నదిగనుక అజ్ఞానారోపం కలుగవలయును. ఆ యజ్ఞానంవలన ప్రపంచభ్రమ కలుగవలసివచ్చును. అటులైన మోక్షమనేదే లేకపోవలసి వచ్చును. అంటే ఒకప్పుడు పుడుతుందంటే దానికి కారణమేమని అడుగవచ్చును చెప్పవచ్చునుగాని, అజ్ఞానం అనాది. దానికి ఉత్పత్తియే లేదంటే మీరు అజ్ఞానానికి కారణమేమని అడగడమేమిటి? అజ్ఞానం అనాది అన్నపుడు కారణం ఏమని అడుగకూడదు. చెప్ప నవసరం లేదుకూడా. అయితే అనాదియగు అజ్ఞానం ఆరోపం ఎట్లా అయినది అంటే. అనాదియని అనుకొనుటయే అనాద్యారోపము. సాది అనగా ఉత్పత్తికలది యని అనుకొనుటయే కార్యారోపము అని గ్రహించవలెను.

అందువలననే శంకరభగవత్పాదులవారు ''విశ్వం పశ్యతి కార్యకారణ తయా'' అన్నారు. కార్యంవలె, కారణంవలె, అనగా సాదివలె, అనాదివలె అనేకవిధములుగా మాయాపరిభ్రామితుడై చూచుచున్నాడని చెప్పవలయును. అనగా కార్యకారణాది రూపముగా ఆత్మయే భాసించు చున్నదని యర్థము. ఒక ప్రశ్న, చాలా ఆశ్చర్యకరముగా నున్నది. కల్పితములై చాలా దూరముగానున్న స్వర్గాది లోకములను పుణ్యకర్మలుచేసి పొందుటయే సులభముగా నున్నది. కాని చాలా దగ్గరగానున్న ఆత్మ స్వరూపమును పొందుట, తెలుసుకొనుట చాలా కష్టముగానున్నదే? వేదాంత శాస్త్రంలో తన స్వరూపాన్ని తెలుసుకోవడమేకదా ప్రధానం.

తన స్వరూపాన్ని తను తెలుసుకొనుటకు ఇంత శాస్త్రం, గురువులవల్ల శ్రవణం చేయటం, మననం చేయుట, నిదిధ్యాసనం చేయుట ఇంత ప్రయత్నం కావలయునా అంటే తాడుయందు సర్పమని భ్రాంతి కలిగితే. నాయనా! భయపడకు. ఇది తాడేగాని సర్పముకాదని చూపిస్తే, వెంటనే తాడునుచూచి పాము అనే భ్రమను, భయమును వదలి స్వస్థచిత్తు డగుచున్నాడు కాని, నాయనా! నీవు పరమాత్మవేగాని జీవుడవుకాదని శాస్త్రమును శిష్యునకు గురువు ఎంత బోధించినను తెలియుటలేదు. ఒక మాటు నీవు పరమాత్మ స్వరూపుడవని చెప్పిన మాత్రంతో తెలుసుకోగలిగిన అనేక పర్యాయములు శ్రవణాదులుచేయుట మొదలగు శ్రమ అవసరమే కాని, ఎంతకాలం తత్వ విచారం చేసినను ఆత్మసాక్షాత్కారం కలుగుటలేదు.

ఎక్కడ యున్నది ప్రతిబంధకం అంటే, అజ్ఞానము అంతబలమైనది, ఆవరణశక్తి చాలా గట్టిది. ఇదియే గాక ఇంద్రియములకుగాని, మనస్సునకుగాని, పరాగ్వస్తువులకు అనగా ఆత్మకంటే భిన్నమైన భూత భౌతికపదార్థములను తెలసుకునే అలవాటున్నది. శక్తియున్నదిగాని ప్రత్యగ్రూపమును అనగా ఆత్మను తెలుసుకున్నే అలవాటు లేదు. శక్తియులేదు. అందుచేత పరమాత్మను ఎవ్వరును త్వరగా తెలసుకొనలేక పోతున్నారు. అందువలన కర్మకంటే జ్ఞానము కష్టం. స్వరూపమును తెలసుకొనుట చాలా కష్టమని గ్రహించవలెను. ప్రతినిత్యము విక్షేపస్వరూపమగు జాగ్రత్ర్పపంచమును, స్వప్నప్రపంచమును దాటి అనగా జాగ్రదవస్థను, స్వప్నావస్థను దాటి, సుషుప్త్యవస్థలోకి పోతున్నాడు. అదియే ఆనందమయ కోశం. ఆ సమయంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయములచే నాలుగుకోశములనుదాటి ఆనందమయకోశములోనికి పోతున్నాడు. సుషుప్త్వవస్థ ఆనందమయ కోశమునకు చెందినది గనుకనే, సుషుప్త్యవస్థయందు అందరికి చాల ఆనందం. అట్టి ఆనందమయకోశం దాటితే స్వప్రకాశానంద రూపమగు బ్రహ్మయే తను అగును.

ఆ సుషుప్తిదశయందు స్థూల, సూక్ష్మశరీరములు రెండు అణగిపోయినవి. అజ్ఞానమనే కారణదేహంలోనే యున్నాడు. అపుడు. బ్రహ్మానందమునకు అజ్ఞానవరణయే అడ్డం. కాని ఆ సమయంలో ఆకాస్త అజ్ఞానావరణను దాటితే, పరబ్రహ్మస్వరూపమును పొందవచ్చును. కాని పొందలేకున్నారు. ఈ విషయమునే ఉపనిషత్తు ప్రతిరోజు పరమాత్మదాకా దాదాపు ఆనందమయ కోశంలోకి వెళ్ళుచున్నారు అందరుజీవులు. అందులో ఒక జీవుడైనను నిత్యస్వప్రాకాశానంద స్వరూపమగు ఆత్మను తెలుసుకొనలేకుండా ఉన్నాడే. ఎవ్వరు తెలసుకొనుటలేదు. ఆయావరణశక్తి త్రోవ ఇవ్వక కార్యభ్రమ రూపముగానున్న స్వప్న జాగ్రత్ర్పపంచ భ్రమలలోనికి అందరుజీవులను తోసివేయుచున్నది. ఆ తోసివేయుటలోకూడా మనుష్య శరీరంనుండి వచ్చినజీవుని మనుష్యశరీరంలోకి, పశు, మృగాది శరీరములనుండి వచ్చిన జీవులను పొరపాటులేకుండా వారివారి శరీరముల లోనికే తోసివేయుచున్నది యనే అర్థమును ఆశ్చర్యముగా బోధించినది.

అయితే అజ్ఞానం చాలా బలమైనది. యెంత శక్తికలది? ఆత్మను ఆవరించి జీవునిగా తయారుచేసి లేని ప్రపంచమును చూపించి సత్యమనిపించిందే. అంటే సందేహం లేదు. అజ్ఞానం అంత బలమైనదే. ఈవిషయంలో సంక్షేపశారీరకంలో సర్వజ్ఞముని చెప్పెను.

శ్లో|| ఏకశ్శతృ ర్నద్వితీయో స్తి శతృ రజ్ఞానతుల్యః పురుషస్య రాజన్‌ |

యేనావృతః కురుతే సంప్రమత్తో ఘోరాణి కర్మాణి సుదారుణాని||

నాయనా. జీవునికి ఒక మహాశతృవు ఉన్నాడు. ఎవడనగా అజ్ఞానమనే శతృవే. అట్టి అజ్ఞానమనే శతృవుతో సమానమైన శత్రువు మరియొకడు లేడు. ఎందుచేతనంటే సచ్చిదానందరూపుడు. అజ్ఞానమనే శతృవుతో, నావరింపబడినవాడై స్వరూపమును మరచి జీవుడ ననే భ్రాంతినిపొంది అహంకార మమకారములు కలవాడై చేయతగినది ఏమి చేయకూడనిది ఏమియని తెలిసికొనలేక ఈ లోకమందు భయంకరమైన పనులను, పరలోకమందు నరకమును కలుగజేయు పాపకృత్యములనుకూడా చేయుచున్నాడు. ఇదంతయు అజ్ఞానప్రభావమే. అందువలన దూరముగా నున్న పుణ్యలోకములను పుణ్యకర్మలుచేసి పొందుట సులభంగాని, బాగుగా సమీపమైన తన స్వరూపమును తెలిసికొని అజ్ఞానమును పోగొట్టుకొనుట చాలాకష్టము. కర్మ ప్రతిబంధమును పోగొట్టుకొనుటకంటే అజ్ఞాన ప్రతిబంధమును పోగొట్టుకొనుట చాలా కష్టమని గ్రహించవలయును.

శ్లోకంలో విశేషం విచారింతము ''సర్వాత్మ త్వమితి స్ఫుటికృత మిదం యస్మా దముష్మిం స్తవే'' అని భగవత్పాదులవారు ఈ స్తోత్రంలో సర్వాత్మత్వం స్పష్టపరచబడినదని చెప్పిరి. జ్ఞానికి సర్వాత్మ భావమేర్పడును జీవన్ముక్తి దశలోకుడా ప్రపంచమంతయు బ్రహ్మవేత్తకు ఆత్మగాతనే భాసించును. బ్రహ్మవేత్తస్థితి చాల ఆశ్చర్యమైనస్థితి. అందుచేతనే అర్జునుడు బ్రహ్మవేత్త, అద్వైతస్థితిని ఆశ్చర్యముగా గ్రహించి

శ్లో|| స్థిత, ప్రజ్ఞస్యకాభాషా సమాధిస్థస్య కేశవ,

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేతకిం||

అని కృష్టపరమాత్మను అడిగెను.

స్థితప్రజ్ఞుడు అనగా పరమాత్మానుభూతికల మహానుభావుడు. ఎట్లా మాట్లాడును? కూర్చుండునా, నిలుచునా, వెళ్ళునా, ఏపనియైనా చేయునా? ఆయనస్థితి ఎట్లా ఉండును?అని అర్జునుడు అడిగినాడంటే. నిజమే సర్వప్రపంచమంతయు ఆత్మయందు లయించి ఆత్మయే అయి ఆత్మయే మిగిలినపుడు దేహేంద్రియములు మనస్సు ఏమీ లేనపుడు ఆత్మస్వరూపం ఎట్లుండునని ఆశ్చర్యపడుచూ గుర్తించవలసిన విషయమే.

శంకర భగవత్పాదులవారు సర్వాత్మత్వమును స్వాత్మ ప్రకాశిక యందు ఇట్లు చెప్పిరి:

శ్లో|| చిదేవ దేహస్తు, చిదేవ లోకాః చిదేవ భూతాని, చిదింద్రియాణి|

కర్తా చిదంతః కరణం, చిదేవ, చిదేవ సత్యం, పరామార్థరూపం||

చిదేవ చైతన్యమే. అని యర్థము. చైతన్యమనగా ఆత్మయే. దేహము చైతన్యమే. లోకములు చైతన్యమే, భూతములు చైతన్యమే, ఇంద్రియములు చైతన్యమే.కర్త అయిన జీవుడు చైతన్యస్వరూపుడే. అంతఃకరణ చైతన్యస్వరూపమే. అంతయు చైతన్యస్వరూపమంటే చైతన్యమే నాశములేనిది. అన్నిటికిని పరమార్థస్వరూపమని తాత్పర్యము.

ఒక ప్రశ్న. ఆద్వైతసిద్ధాన్తంలో అంతా పరమాత్మ స్వరూపమే నని చెప్పుచున్నారు. కనిపించే ప్రపంచం ఏ ప్రమాణముచేతనైనా తెలియబడే దృశ్యములు ఏమియు లేవు. అంతయు మాయామయమే. మిధ్యాభూతమని కనిపించని అనగా ప్రమాణమునకు గోచరించని బ్రహ్మయే సత్యమని యంటారు. ఇది అనుభవమునకు చాలా విరుద్దముగానున్నది. కనిపించేది లేదు. కనిపించనిది యున్నది అని చెప్పుటనుబట్టియే కొందరు అద్వైతమతం ప్రచ్ఛన్న బౌద్ధమతమన్నారు. బౌద్ధులు అంతా శూన్యమన్నారు.

అద్వైతులు దృశ్యమేమిలేదు. దృశ్యముకానిది ఒక ఆత్మయున్నది అన్నారు. దృశ్యంకానిది అనగా తెలియబడనిది ఉన్నదని చెప్పకూడదు. ప్రమాణములతో తెలియబడిన దృశ్యము ఏమీలేదంటున్నారు. ప్రమాణములచేత తెలియబడనిది ఎట్లాగూ లేనిదానికిందనే జమ. అట్లయిన అంతా శూన్యమనియే చెప్పినట్లగును. అది బౌద్ధమతంగానే గ్రహించవచ్చును. కాని అద్వైతులు దృశ్యప్రపంచం ఏమీలేదు అని, అంతా శూన్యమేనని యనకుండా దాచి, దృశ్యం కానిది ఒకటి యున్నదని, దృశ్యంలేదని (అనగా శూన్యమన్నట్లే ) చెప్పుచున్నారు గనుక, అద్వైతులు ప్రచ్ఛన్న బౌద్ధులని, అద్వైత సిద్ధాన్త రహస్యం తెలియక అద్వైతమతమును ద్మేషించు కొందరు ద్వైతులు ఆక్షేపించుదురు.

ఈవిషయంలో సావధానంగా, సావకాశంగా, సమాధానం వినవలయును. ఏమంటే దృశ్యమనగా దృక్కుచేత తెలియబడేది యని అర్థము. మరియొక విధంగా చూడండి. దృశ్యమనగానే దృశ్యమును జూచేవాడొక డున్నట్లేకదా. కనిపిస్తున్నదంటే కనిపించేసేది ఉన్నట్టేకదా! కనిపింపచేసేదికుడా కనిపించవలయునని నియమం లేదు. తెలియచేసేదికూడా తెలియబడవలెనని నియమంలేదు. తెలియ చేయునది తెలియబడనంత మాత్రంతో కనిపింపచేసేది కనిపించనంతమాత్రంతోను, తెలియచేయునది కనిపించచేయునది లేదని చెప్పుటకు వీలులేదు. ఎందుచేతనంటే తెలియచేయునది గనుకనే, చూచేది గనుకనే.

ఎటులననగా నేత్రేంద్రియముతో అనేక వస్తువులనురూపములను చూచుచున్నాము. నేత్రమున్నందువలననే అన్నియు కనిపించుచున్నవికదా! నేత్రేంద్రియం లేకపోతే రూపాదులు కనిపించవుకదా! రూపాదులు నేత్రేములున్నవారికే కనిపించునుగాని, నేత్రములు లేనివారికి కనిపించవని సర్వులకు అనుభవసిద్ధమైన విషయమేకదా! అయితే, అన్నిరూపాదులను కనిపింపచేసే నేత్రేంద్రియం మనకు కనిపించుచున్నదా?కనుపించుట లేదు. అయితే కన్నుగుడ్లు కనిపించుచున్నవికదా. అంటే ఆ గుడ్లు గుడ్డి వాళ్ళకుకూడా ఉంటవి. అవి నేత్రేంద్రియం అనుటకు వీలులేదు. గుడ్లే నేత్రేంద్రియమయితే గుడ్డివాళ్ళకుకూడామంచివాళ్ళకువలె అన్నియు కనిపించవలసివచ్చును. కాని కనిపించుటలేదు. గనుక ఆ గుడ్లు చక్షురింద్రియ ముండుటకు స్థానం-గోళకమనికూడా అంటారు. అందుచేత ఆ గోళకములు నేత్రేంద్రియములు కాదు. ఆ గోళకములయందు అతిసూక్ష్మమైన ఒక చక్షురింద్రియ మున్నది.

ఆ యింద్రియము అపంచీకృత భూతకార్యముగనుక, తనకుగాని ఇతరులకుగాని యంత్రసాధనలతో చూచినను కనిపించదనియే శాస్త్రకర్తల సిద్ధాన్తం. ఆధునిక భౌతికవిమర్శకులగు వైద్యులుకొందరు నేత్రేంద్రియం సూక్ష్మమయినను యంత్రసాధనలతో కనిపించునని చెప్పెదరేమోగాని, ఆ కనిపించునది నేత్రేంద్రియమునకు ఆధారమైన గోళకమందలి సూక్ష్మభాగమేకాని, నేత్రేంద్రియం దృశ్యం కాదనియే ప్రాచీన శాస్త్ర సిద్ధాన్తం. గనుక నేత్రేంద్రియం రూపాదులను చూపించేదేగాని, అది కనిపించదని తేలినది. అయితే చక్షురింద్రియంలేదని చెప్పవచ్చునాఅంటే చెప్పకూడదు. నేత్రేంద్రియం లేకపోతే రూపాదులు ఎట్లా కనిపించును. గనుక నేత్రేంద్రియం కనిపించకపోయినను రూపాదులను రుజువుచేయుచున్నది గనుక. ఉన్నటుల రుజువైనట్లే. అనగా కనిపించకపోయినను కనిపింపచేయచున్నది గనుక నేత్రేంద్రియమున్నదనియే చెప్పవలయునుగాని, లేదని చెప్పుటకు వీలులేదు.

అటులనే మనలో ఒక చైతన్యమున్నది. ఆ చైతన్యము అన్నిటిని తెలుసుకొనుచున్నది, అనగా అన్నిటిని తెలియచేయుచున్నది. జాగ్రదవస్థను, స్వప్నావస్థను, సుషుప్త్యవస్థను, జ్ఞానమును, అజ్ఞానమును తెలుసునని, తెలియలేదని, ఉన్నదని, లేదని అన్నిటినీ తెలియచేయుచునే యున్నది. కాని తెలియబడుటలేదు. అది తెలియబడే వాటిలో చేరదు. వేరుగానున్నది. నిజముగా దానికంటే వేరయినదేమియులేదు. తెలియబడనంతమాత్రంతో లేదనిచెప్పుటకు వీలులేదు. తెలియచేసే చైతన్యమేలేక పోతే ప్రపంచం తెలియబడక పోవలసివచ్చును. శృతికూడా బ్రహ్మనులేనటుల ఎవరు అనుకొందురో ఆ అనుకున్నవారు, లేనివారగుదురని చెప్పుచున్నది. ఎందువలననంటే తను బ్రహ్మయే గనుక బ్రహ్మ లేదను కుంటే తన్నుతాను లేననుకున్నట్లగును. శంకర భగవత్పాదులవారు ''ఆత్మాచ బ్రహ్మ'' యనిరి. అనగా ఆత్మయే బ్రహ్మయని యర్థము. అట్టి ఆత్మ జ్ఞానరూపమై మనలోనున్నది. అదియే చైతన్యం, అట్టి చైతన్యం, ప్రమాణములను ప్రమేయములను ప్రమాతను అనగా తెలియబడే శబ్ధాది విషయములను తెలియజేసే ఇంద్రియములు మొదలగు ప్రమాణములను తెలుసుకున్నే జీవులనుకూడా తెలియచేయుచున్నది.

భగవద్గీతలోకూడా భగవంతుడు ''నతద్భాసయతే సూర్యో నశశాంకోన పావకః యద్గత్పానని వర్తన్తే| తద్ధామ పరమంమమ'' అని ఆ పరమాత్మతత్వమును సూర్యుడు ప్రకాశింపచేయలేడు. చంద్రుడు ప్రకాశింపచేయలేడు. అగ్ని ప్రకాశింపచేయలేదు. అనగా దీపము మొదలగునవి కూడా ప్రకాశింప చేయలేవన్నమాటే. ''యద్గత్వానని వర్తన్తే తద్ధామ పరమంమమ|'' అనగా దేనిని పొందినవారికి పునరావృత్తి అనగా పునర్జన్మ లేదో ఆ స్వరూపమే నాదియని చెప్పెను. దేనిచేతను తెలియబడనిదియే పరమాత్మస్వరూపమని చెప్పినట్లయినది.

అన్నిటిని ప్రకాశింపజేయుచు స్వయంప్రకాశమానమై జ్ఞానరూపమైమన కాత్మరూపమైయున్న పరమాత్మ తెలియబడుటలేదు గనుక, లేదని చెప్పినట్లేనని కల్పించి ప్రచ్ఛన్న భౌద్ధమనియనుట చాలా అవివేవకము.

భ్రమదశలో రజతం తెలియబడినది శుక్తి తెలియబడుటలేదు. అంతమాత్రంతో రజతమున్నది సత్యమని, శుక్తిలేదని చెప్పకూడదు. తాడుయందు సర్పభ్రమకలిగితే గోచరించేది సర్పమే, అసలు తాడు గోచరించుటలేదు గనుక సర్పమే సత్యము. తాడు అసత్యమని చెప్పకూడదు. అటులనే ప్రపంచం కనిపించుచున్నది గనుక సత్యమని, ఆత్మ కనిపించడంలేదు గనుక అసత్యమని చెప్పకూడదు. పైగా రజతం కనిపించుచున్నది గనుకనే అసత్యం అనగా మిధ్యా కనిపించనిశుక్తియే సత్యం ఆనవలయును, ఎందుచేతనంటే, శుక్తియనితెలిస్తే రజతం అదృశ్యమై పోతున్నది శుక్తియే మిగులచున్నదికదా! అటులనే ఆత్మ సాక్షాత్కారంకలిగితే ప్రపంచం అదృశ్యమై ఆత్మయే మిగులును, గనుక ప్రపంచం అసత్యం, అనగా మిధ్యా, బ్రహ్మయే సత్యమని తెలుసుకొనవలయును.

మరియు అద్వైతుల ప్రపంచమును లేదనరు. ఇది పరమాత్మయే అంటారు. అనగా పరమాత్మకంటే వేరుకాదని యర్థము. కొన్నచోట్లు ప్రపంచంలేదని చెప్పియున్నను, పరమాత్మకంటే వేరుగాలేదని యర్థము. అందువలననే అద్వైతులు బ్రహ్మసత్యం,జగన్మిధ్యయని అంటారు. అంతేగాని బ్రహ్మసత్యం, జగదసత్యం అనరు. మిధ్యయనగా అసలు వస్తువుతెలిస్తే కనిపించకుండాపొయ్యేదే! ఆత్మజ్ఞానంకలుగగానే ఆరోప ప్రపంచము అదృశ్యమగును, గనుక మిధ్యాభూతమని ముఖ్యముగా గమనించవలయును. ఆత్మయే సత్యమై మిగులును, గనుక లేనిది ఎప్పుడు కాదు. ఈవిషయములను ఈ పుస్తకములోని శంకరాచార్య అద్వైతస్తోత్రతాత్పర్య వివరణములలో ఆయాశ్లోకములక్రింద రెండు మూడు పర్యాయములు వివరించితిని.

చివరశ్లోకంలో సర్వాత్మత్వమితిస్ఫుటికృత మిదం యస్మాదముష్మింస్తవే'' అని భగవత్పాదులవారు అద్వైతమందు శాస్త్ర తాత్పర్యమును చెప్పిరి. ఈ రాస్వత్మ భావస్థితి జ్ఞానముచేతనే కలుగునుకానివేరు సాధనం లేదనికూడా చాలామాట్లు చెప్పినవిషయమే. గ్రంథములవలన తెలుగు టీకా తాత్పర్య వివరణములవలన మనం స్వయముగా కొన్నివిషయములను గ్రహించగలిగినను, సందేహములేకుండా పొరపాటులేకుండా తెలియవలెనంటే వేదాంతవిద్యను బాగుగా నభ్యసించినపండితులవద్ద అప్పుడపుడు వినుట చాలా అవసరము. అటులచేసినయడల గ్రంథములనుచూచినను చాలా బాగుగా నిస్సందేహముగా సిద్ధాన్తం తెలిసికొనవచ్చును.

శ్లో|| నహి ప్రపంచో నచభూతజాతం నచేంద్రియం ప్రాణగణోనదేహః|

నబుద్ధిచిత్తం నమనోనకర్తా బ్రహ్మైవసత్యం పరమార్థరూపం||

అని స్వాత్మప్రకాశికయందు శంకర భగవత్పాదులవారు చెప్పిరి.

ప్రధానంగా ఆద్వితీయమగు బ్రహ్మ విచారముచేయువారు. ఆ రోపమును నిషేధించుచునే అధిష్ఠానమగు ఆత్మను తెలుసుకొనవలయును, గనుక ప్రపంచము ఆత్మకంటే, వేరుగాలేదు, భూతములేమియు లేవు, ఇంద్రియములులేవు, ప్రాణములేదు, దేహములేదు. వృత్తిభేదము చేత అంతఃకరణయే మనస్సనియు, బుద్ధియనియు, అహంకారమనియు, చిత్తమనియు నాల్గువిధములుగా వ్యవహరింపబడుచున్నది, గనుక అవి ఏవియులేవు. కర్తయని, భోక్తయని వ్యవహరింపబడుచున్న జీవుడుకూడా లేడు. అంతయు పరమాత్మయే అనగా బ్రహ్మయేయని. అదియే పరమార్థమని, అదియే నేనని తెలుసుకొని కృతకృత్యులు కావలయునని తాత్పర్యము.

ఈ క్రిందిశ్లోకమును ముఖ్యముగా విచారింపవలయును.

శ్లో|| చిదమృతసుఖరాశౌ చిత్తఫేనంవలీనం క్షయమధి గతరూపోవృత్తిచంచ త్తరంగః|

స్తిమితసుఖసముద్రో నిర్విచేష్టస్సపూర్ణః| కధమిహమమ దుఃఖం సర్వదైకోహమస్మి||

అని శంకర భగవత్పాదులవారు స్వాత్మప్రకాశకయందేచెప్పిరి. (ఆత్మవేత్త అనుభూతి) నేను. స్వప్రకాశానంద స్వరూపుడను అట్టి ఆనంద సముద్రరూపమగు నాయందు జ్ఞానముచేత మనస్సుఅనే నురుగు అణగిపోయినది. అంతఃకరణవృత్తులు అనేకములుగానున్నవి అవి సముద్రతరంగములవలె ఆందోళనచేయుచు, నిశ్చలస్థితి లేకుండాచేస్తూ వుండేవి. జ్ఞానమహిమచేత ఆ వృత్తి తరంగములు లయించినవి. తరువాత తరంగాది వికారములేని పరిపూర్ణ సముద్రమువలె సర్వభ్రమలుపోయి అనగా ఆవరణ విక్షేపరహితమైన పరిపూర్ణమగు సచ్చిదానందస్వరూపుడనైతిని. అట్టి నాయందు దుఃఖమేల కలుగునని జ్ఞాని స్వానుభూతిని వెల్లడించుచు పరమానంద స్వరూపముగానుండును.

శ్రీశంకరాచార్యుల వారు వ్రాసిన వేదాంత స్తోత్రములన్నియు ఉపనిషత్తుల యొక్క అర్థమును బోధించునవే గనుక ఉపనిషత్తులతో సమానమైననే సందేహములేదు. ఈ దక్షిణామూర్తి స్తోత్రమునకు తాత్పర్య వివరణమును వ్రాయుచు వారు చెప్పిన సిద్ధాన్తమును బాగుగా తెలియునటులు ప్రతిపాదన చేయుటకు కొన్ని వచనములను ఉదహరించుచు వారు వ్రాసిన ఇతర స్తోత్రములలోని శ్లోకములను కూడా ఉదహరించితిని.

ముఖ్యవిషయం; అజ్ఞానమున్నంతవరకు జీవభావముండును. గనుక జీవభావమున్నంతవరకు కర్మకూడా ఉండును గనుక పుణ్యజీవులుకూడా పుణ్యలోకములకు వెళ్ళునపుడు మరణకాలమందు ... ఈ స్థూలదేహమును విడిచిపెట్టి లింగదేహోపాధికులై వెళ్ళిపోవలసినదే. పాపజీవుల విషయం చెప్పనేఆక్కరలేదు. మాటిమాటికి నరకలోకమునకు వెళ్ళుట నరకము ననుభవించుట మరల పాపజన్మలెత్తుట తప్పదు. బ్రహ్మ సాక్షాత్కారమును పొందిన మహానుభావుడు మాత్రం ఈదేహమునువిడచిపెట్టి లోకాంతరమునకు వెళ్ళుటలేదు, జ్ఞానం కలిగినపుడు అజ్ఞానం పోవును, కర్మలన్నియు జ్ఞానాగ్నిచేత దగ్ధమగును. ప్రారబ్ధమీదేహము పడిపోవునప్పటికి పూర్తిగా నశించి పోవును జీవత్వంపోవునున. కర్మరాహిత్యం కలుగును. మెలుకువ వచ్చినపుడు స్వప్నం తనయందు లయించినటులు సర్వప్రపంచము తన యందే లయించును. బ్రహ్మాకారవృత్తికూడా లయించును అద్వితీయమగు సచ్చిదానంద బ్రహ్మరూపుడగును. అట్టి స్థితిలో అన్ని లోకములు తన యందే లయించుచున్నప్పుడు లోకాంతరమునకు దేహమును విడిచిపెట్టి వెళ్ళేదేముండును. సర్వాత్మత్వమే కలుగును.

ఈ విషయమునే ''సర్వాత్మాత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతస్సిద్ధ్యేత్తత్పునరష్టధాపరిణతం చైశ్వర్యమవ్యాహతం'' అని చెప్పిరి. సర్వాత్మత్వమను, మహావిభూతి గొప్ప ఐశ్వర్యం. పరమాత్మ స్వరూపస్థితి అజ్ఞానం పోగానే ఆవిర్భవించును. ఆస్థితి ఈవిధముగా నున్నదని చెప్పుటకు వీలులేదు. అది చెప్పుటకు వీలులేదనే విషయం మౌనవ్వాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అను శ్లోకము వల్లనే స్పష్టమగు చున్నది, సర్వజ్ఞులగు మహానుభావులందరు ఈ సర్వాత్మ భావమును గురించియు ఈ తత్వశాస్త్రమును గ్రహించుచు చాలా ఆశ్చర్యపడినట్లు తెలియుచున్నది.

ఆత్మసాక్షాత్కారము కలిగిన మహానుభావుడు ఈవిధముగా అను కొంటాడు.

దేహాభిమానులు వేదములను శాస్త్రములను చదువుదురుగాక అనేక కర్మలను చేయుదురుగాక నాకేమీ అవసరంలేదు. నాకు లౌకిక వ్యాపారములుగాని వైదిక కర్మలుగాని ఏమియులేవు. అంతయు నేనే గనుక నేనేమీ చేయనవసరంలేదు, కృతకృత్యుడనే చేయనక్కరలేదనే స్థితికూడా అనవసరమే వాక్కు వేదశాస్త్రములను పఠించుగాక, మనస్సు శ్రీమహావిష్ణువును గాని ఇతర దేవతలనుగాని ధ్యానించుగాక. లేక బ్రహ్మనందమందు. నిమగ్నమగుగాక. నేను సాక్షిరూపడును విధినిషేధములు లేవు. అతీతుడను. అయినను లోకసంగ్రహము కొరకు అనగా గొప్పవారు యెటుల ప్రవర్తించుదురో ఇతరులు కూడా అటులనే ప్రవర్తింతురు గనుక సామాన్య మనుష్యులనుకూడా మంచిమార్గమందు ప్రవర్తింపచేయుటకు శాస్త్రోక్తమార్గమందే ప్రవర్తిస్తాను. శరీరేంద్రియములు సదాచారమందు న్నటుల లోకమునకు చూపించెదను. నాకేమీ సంబంధంలేదు. నేను బ్రహ్మానంద స్వరూపుడనేనని సర్వాత్మభావములో నున్న మహానుభావుడు అనుకుంటాడు.

శ్రీవిద్యారణ్య స్వాములవారు నాల్గువేదములకు భాష్యములను వ్రాసి వారు పరమహంసాశ్రమమును స్వీకరించి శ్రీశంకర భగవత్పాదులవారు స్థాపించిన శ్రీశృంగేరీ మహాపీఠమందు పీఠాధిపతులుగానుండి అనేక దుర్మతములను ఖండించి అద్వైత సిద్ధాన్తమును బలపరచి సంప్రదాయమును అభివృద్ధిచేసిరి. అట్టి విద్యారణ్య స్వాములవారు వారు రచించిన పంచదశీ గ్రంథమందు బ్రహ్మవేత్త అనుభవమును, స్థితిని ఈవిధముగా చెప్పిరి.

శ్లో|| ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మాన మంజసావేద్మి|

ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతిమేస్పష్టం||

శ్లో|| ధన్యోహం ధన్యోహం దుఃఖం సాంసారికిం నవీక్షేద్య

ధన్యోహం ధన్యోహం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి||

శ్లో|| ధన్యోహం ధన్యోహం కర్తవ్యం మేన విద్యతే కించిత్‌ |

ధన్యోహం ధన్యోహం ప్రాప్తవ్యం సర్వ మద్య సంపన్నం

శ్లో|| ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భ##వేల్లోకే|

ధన్యోహం ధన్యోహం ధన్యోధన్యః పునః పునర్ధన్యః ||

శ్లో|| ఆహోపుణ్య మహోపుణ్యం ఫలితం ఫలితం దృఢం|

అహోపుణ్య స్యసంపత్తే రహోవయ మహోపయం||

శ్లో|| అహోశాస్త్రమహోశాస్త్ర మహోగురురహో గురుః |

అహోజ్ఞాన మహోజ్ఞాన మహోసుఖ మహోసుఖం||

ఆత్మసాక్షాత్కారము కలిగినతరువాత నేను చాలాధన్యుడను. ధన్యుడను. ఎల్లపుడు నాపారమార్థికమగు సచ్చిదానందమగు పరమాత్మను బాగుగ తెలసుకొనుచున్నాను. నేను మూటికి ముమ్మాటికి ధన్యుడను. చాలా పర్యాయములు ధన్యుడనని అన్నందువలన (ఆదరముగా చెప్పి నట్లు) చెప్పుటకు వీలులేని లోకాతీతమగు ధన్యత్వమును పొంది. అతీతమగు పరమానందమును పొంది, అవధిలేని తన ఆనందస్థితిని లోకమునకు తెలియచేయుచున్నాడని యర్థము.

ఇంకా ఎంతధన్యుడను నాకు సంసారసంబంధమైన దుఃఖము లేశము కూడా గోచరించటలేదు. ఎంత ధన్యుడను నాయాత్మను నాకు తెలియకుండా ఆవరించిన అజ్ఞాన మెట్లా పోయెను. నేను జీవుడననే భ్రాంతియు, ప్రపంచమనేభ్రాంతియు, ద్వైతదృష్టియు అంతయు యెట్లుపోయెను. నేను మహాధన్యుడను. నేను చేయవలసినదేమియు గోచరించుటలేదు. నేను చాలాధన్యుడను పొందతగినది అంతయు లభించినది, నేను చాలా ధన్యుడను నాకు కలిగిన తృప్తికి అవధిలేదు. ఈ విధంగా నున్నదని చెప్పుటకు ఉపమానం లేదు. అనగా పోల్చతగినదిలేదు. నేను ధన్యుడను మరీ మరీ ధన్యుడను.

ఆశ్చర్యం నాపుణ్యమునకు అవధిలేదు. యెంతపుణ్యమో చెప్పజాలను. అనంత జన్మలనుండి చేసిన మహాపుణ్యం నేటికి ఫలించింది. చాలాబాగా ఫలించింది. యింత మహాపుణ్య సంపత్తు కలవాళ్ళము మేమే మేమే. చాలా ఆశ్చర్యమైన స్థితిమాది. ఈఅద్వైత వేదా న్తశాస్త్ర మెంత ఆశ్చర్యకరమైనది. చాలా ఆశ్చర్యమును కలిగించినది. శాస్త్రముచాలా ఆశ్చర్యకరమైనదే. ఆ శాస్త్రమునుచెప్పే గురువుకూడా చాలా ఆశ్చర్యకరమైనవాడే. ఆధ్యాత్మిక బ్రహ్మవిద్యను చెప్పువారు అనగా ఆవాఙ్మానన గోచరమగు పరబ్రహ్మతత్వమును ప్రబోధించు గురువు చాలా దుర్లభుడని యర్థము. ఆశ్చర్యం ఈ బ్రహ్మసాక్షాత్కారమనే జ్ఞానం చాలా ఆశ్చర్యకరముగా నున్నది.

అతిదీర్ఘ నిద్రలో అతిదీర్ఘస్వప్నము ననుభవించి బాగా మెళుకువ వచ్చిన తరువాత నిద్రస్వప్నములుపోయి స్వస్థతనుపొందినవాని స్థితివలె యున్నది. తెలుసుకొనుటకు సౌకర్యముగాచెప్పితినిగాని ఆత్మానుభూతి స్థితికి పోలియకయేలేదు.

నా స్వరూపముగానున్న సుఖం అనగా ఆనందం అవధిలేకుండా నున్నది ఆశ్చర్యముగానున్నది. నా స్వరూపానందం అనుభవరూపముగా నున్నదియని జీవన్ముక్తులు వారి సర్వాత్మత్వమహావిభూతిని లోకమునకు వెలిబుచ్చు చుందురు. ఈ స్థితినే సాక్షాత్తు పరశివావతరమైన శ్రీ శంకర భగవత్పాదులవారు సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతస్సిధ్యేత్‌ అని చెప్పిరి. ఈ స్థితి కలుగవలయునంటే సర్వాత్మత్వ మితిస్ఫుటీకృతమిదం యస్మాదముష్మిం స్తవే. తేనాస్యశ్రవణాత్త దర్బమననాత్‌ ధ్యానాచ్చ సంకీర్తనాత్‌. అని చెప్పినప్రకారం ఈ స్తోత్రంలోచెప్పిన సర్వాత్మత్వమును సంప్రదాయానుసారముగా విచారించి అనగా శ్రవణ మనన నిదిధ్యాసనలు చేసి తత్వసాక్షాత్కారమునుపొంది మూలాజ్ఞానమును, జీవత్వభ్రాంతిని, ప్రపంచభ్రాంతిని (వదలి) నివృత్తి చేసుకొని కృతకృత్యులై సర్వాత్మభావమను స్వస్వరూపస్థితిలో నుండవలయునని పరమతాత్పర్యం.

''శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం సమాప్తం.''

శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తిస్తోత్రమునకు మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభయను తెలుగు టీకాతాత్పర్య వివరణం సమాప్తం.

Thathva Rahasyaprabha    Chapters